[శ్రీ బద్రి రచించిన ‘అభీ నా జావో ఛోడ్ కర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అలెక్సాలో ‘అభీ నా జావో ఛోడ్ కర్’ అన్న పాట వస్తోంది. ఆ పాట విన్నపుడల్ల తనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. జయదేవ్నీ, రఫీనీ, ఆషాని మెచ్చుకోకుండా ఉండలేడు. అంత మధురంగా ఉంటుంది. గ్లాస్లో సింగల్ మాల్ట్ వేసుకొని స్టూడియోలోని కుర్చీలో కూర్చొని ఆ ఆరు పెయింటింగ్స్ వైపే చూస్తున్నాడు.
గిరీశం ఇప్పటికి ఆరుసార్లు వెయ్యటానికి ప్రయత్నించాడు ఆ పోర్ట్రయిట్, అన్ని సార్లు ఆవిడ మొహం పోలికలు వస్తున్నాయి కానీ ఫోటోలో ఆవిడలా అనిపించడం లేదు. తనకు ఏమైంది ఎంత సులువుగా వేస్తాడు మొహాలని, అటువంటిది ఆరు ప్రయత్నాలా అని ఆలోచిస్తూ కూర్చున్న గిరీశానికి గతం ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది.
***
గిరీశం నాన్నగారికి ఉద్యోగరీత్యా తరుచూ ట్రాన్స్ఫర్లు అవుతుండేవి, అలా పది రోజుల క్రితం ఆ కొత్త ఊరు చేరుకున్నారు. కొత్త ఇల్లు కొత్త ప్రదేశం, కొత్త స్కూలు. అన్నయ్య, అక్క ఇద్దరూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకునేవారు. ఊరికి ఒక వైపు గోదావరి ఇంకో వైపు పచ్చని పొలాలు. గిరీశానికి ఈ ఊరు ఎంతగానో నచ్చేసింది, చిన్నప్పటి నుండి బొమ్మలు వెయ్యడం అంటే ఎంతో సరదా, బొమ్మలు వేస్తూ చుట్టూ లోకం మర్చిపోయేవాడు.
ఓ రోజు సాయంత్రం డ్రాయింగ్ బుక్ పక్కన పెట్టి పెరట్లో ఉన్న పచ్చని పైరులు చూస్తూ మైమరచి పోతున్న టైములో పక్క డాబా మీదకి సన్నజాజుల వాసనతో పాటు, ‘కన్నె పిల్లవని కన్నులున్నవని’ పాట హుమ్మింగ్ వినపడడంతో తిరిగి చూసాడు, లంగా వోణి వేసుకొని మేడ పైన ఆరవేసిన బట్టలు తీస్తూ ఓ అమ్మాయి. అలా ఎంతసేపు చూశాడో తెలియదు కానీ, ఆ అమ్మాయి తన పని తానూ చేసుకొని వెళ్ళిపోయింది.
కింద నుండి అమ్మ పిలుపుతో ఈ లోకానికి వచ్చాడు. కింద పిట్టగోడ దగ్గర పక్కింటివాళ్లతో మాట్లాడుతూ అమ్మ పిలుస్తోంది. పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళంగానే “వీడేనండి మా మూడోవాడు గిరీశం, ఈ సంవత్సరమే టెన్త్ క్లాసులోకి వచ్చాడు” అని పరిచయం చేసింది. అక్కడున్న వారికి నమస్కారం చేసి లోపలి వెళ్లబోతుండగా ఆ అమ్మాయి వచ్చింది. “మా రెండో అమ్మాయి నాగవల్లి, ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది” అంటూ పరిచయం చేసారు. “మావాడికి లెక్కలు, సైన్స్లో చాలా తక్కువ మార్కులు వస్తాయి, కొంచం చెప్పమ్మా నీకు పుణ్యం ఉంటాది” అంటూ అమ్మ అప్పుడే తన కోసం మొత్తం చెబుతూ ఉంటే, “అమ్మా” అంటూ లోపలి వెళ్ళిపోయాడు.
లోపలి వెళ్ళాడే కానీ ఆలోచనల్లన్ని నాగవల్లి పైనే, తాను పుస్తకాల్లో చూసిన వపా, బాపు బొమ్మలా ఉంది (వపా పూర్తి పేరు మొన్న మొన్నటి వరకు తనకు తెలియదు, బాపు అంటే గాంధీ చుట్టమేమో అనుకునేవాడు చిన్నప్పుడు). ఆ నవ్వు ఆ కళ్ళు, ఆ నడక వర్ణించలేడు. అప్పుడే రేడియోలో ‘రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో’ పాట వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం అంట పాట పాడింది. భలే అనిపించింది మొదటి సారిగా.
పొద్దున్నే రేడియోలో సంస్కృత వార్తలు వచ్చే సమయానికి లేవడం, అన్నీ కానిచ్చి చద్దన్నం తిని భక్తిరంజని వచ్చే సమయానికి భుజాన స్కూల్ సంచి వేసుకొని స్కూల్కి వెళ్లడం ఏ వూరు వెళ్లిన ఇదే తన దినచర్య. ఈరోజు కొత్త వూరిలో కొత్త బడి బయటకు వెళ్తూ పక్కింటి వైపు చూసాడు నాగవల్లి ఏమైనా ఈ టైములో కాలేజీకి వెళ్తుందా అని. ఎవ్వరు కనబడకపోవడంతో నెమ్మదిగా స్కూల్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. సాయంత్రం తెలిసింది ఏమిటంటే నాగవల్లి ఉదయం ఏడింటికే బాక్స్ పట్టుకొని బస్సుకి పక్క ఊరిలో కాలేజీకి వెళ్తుందని. రేడియోలో ‘చిలక సిలకా’ అన్న పాత పాట ఏదో వస్తుంది. (నా పాట నీ నోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గు లోలకాల సిలకా – ఘంటసాల, సుశీలగారు పాడిన పాట)
***
ఇంతలో అన్నయ్య ఫోన్ వస్తే ఈ లోకంలోకి వచ్చాడు గిరీశం. “ఏరా యు.ఎస్. నుండి నీకు ఏమైనా కావాలా?” అని అడుగుతుంటే తనకి కావలసిన ఓ రెండు వస్తువులు చెప్పి, మిగతా విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేసాడు. ఓ గుడ్డని టర్పెంటైన్లో ముంచి పెల్లెట్ పైన మిగిలి ఉన్న పెయింట్స్, ఆయిల్ పెయింట్ బ్రష్లు శుభ్రం చేస్తూ, గ్లాస్ లోకి సింగల్ మాల్ట్ వేసుకొని కూర్చున్నాడు. అలెక్సాలో ‘హుస్న్ వాలే తేరా జవాబ్ నహీ’ రవి రఫీ కంబినేషన్లో పాట వస్తుంది. మళ్ళీ గతంలోకి జారుకున్నాడు.
***
నెమ్మదిగా నాగవల్లికి దగ్గరైయ్యాడు. ఫిజిక్స్, మాథ్స్ చెప్పించుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం వచ్చే సినిమా వాళ్ళ ఇంట్లోనే చూస్తూ ఉంటారు తాను అమ్మా, ఇప్పటికింకా టీవీ కొనలేదు నాన్న. సినిమా చూస్తూ అప్పుడప్పుడు అక్కడే పడుకుండిపోయేవాడు. చందమామ, స్వాతి, ఆంధ్రభూమి జ్యోతిలో వచ్చే బొమ్మలని కూర్చొని వేయటం ఒక అలవాటు తనకు. అలా వేసి నాగవల్లికి వెళ్లి చూపించేవాడు, తనను ఎంతో మెచ్చుకొని పొగిడితే భలే ఆనందంగా ఉండేది.
ఓ రోజు రేడియోలో ‘నీలాలు కారేనా, కాలాలు మారేనా’ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తుంటే కూర్చొని నాగవల్లి మొహం వెయ్యటానికి చాలా ప్రయత్నాలు చేసాడు తను. అది ఎంతకీ రావటంలేదు. ఇన్నాళ్లు బొమ్మలైతే వెయ్యడం నేర్చుకున్నాడు కానీ మొహాలు వెయ్యడం నేర్చుకోలేదు. అవి ఎలా వెయ్యాలో తెలియదు. అదే విషయం నాగవల్లికి చెబితే “ముందు నేర్చుకో, నువ్వు బాగా వెయ్యగలిగేటప్పుడు నీతోనే వేయుంచుకుంటానులే” అన్నాది.
నెమ్మదిగా టెన్త్ నాగవల్లి సహాయంతో సెకండ్ క్లాసులో పాసైయ్యాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ నాగవల్లితో స్నేహం బాగా బలపడింది. రేడియోలో ‘వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరసమురళి ఆనందన మురళి ఇదేనా’ – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీలగారు పాడిన పాట వస్తుంటే ఇంటర్ రెండో సంవత్సరంలో “నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యు” అని చెప్పాడు. దానికి నాగవల్లి డిప్పమీద ఒక్కటి కొట్టి “పని చూసుకోరా, చదువు ముందు” అంది.
“ఇంటర్ ఐన తరువాత ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుంటా” అంటే నాన్నకు తనకు పెద్ద గొడవైంది. అప్పుడు నాగవల్లి వచ్చి ‘మన ఇష్టాలు వేరు పెద్దల ఇష్టాలు వేరు, నచ్చచెప్పాలి’ అన్నది. అయినా తనకు కోపం తగ్గక, అలిగి, అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తాను అని మారం చేసి అమ్మమ్మ ఊరు వెళ్ళాడు.
అన్నయ్య అక్క అమ్మమ్మలతో టైం స్పెండ్ చేసి ఇరవై రోజులకు తిరిగి ఇంటికి రాత్రి బస్సుకి వచ్చి ఉదయానే కాలేజీకి వెళ్లిన తనకు నాగవల్లి కనిపించలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత కూడా కనిపించలేదు. పక్కింటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. “ఏమైంది?” అని అమ్మని అడిగితే “నాగవల్లికి పెళ్లి కుదిరింది. వాళ్ళ సొంత ఊరిలో పెళ్ళంట, పెళ్ళైన తరువాత అటునుండి అటే అమ్మాయిని తీసుకువెళ్లిపోతాడట అబ్బాయి” అని ఏవో చెబుతుంది అమ్మ. తనకు దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు. అమ్మ ఏమైందని అడిగితే ఏమి చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు ఆ రాత్రంతా. ఎక్కడో దూరంగా ‘కంచికి పోతావా కృష్ణమ్మా’ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తుంది. తరువాత తను నాన్నని ఒప్పించి బెనారస్ వెళ్లి ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవడం, జీవితం సాగిపోవడం అన్ని జరిగిపోయాయి. ఇది జరిగి ఇప్పటికి ఓ 35 ఏళ్ళు అయిఉంటుంది.
***
ఆ ఆరు పోర్ట్రయిట్స్ని చూస్తూ ఫోన్ తీసాడు గిరీశం. వాట్సప్ ఓపెన్ చేసి మెసేజ్ టైపు చెయ్యడం మొదలు పెట్టాడు “హాయ్, మీ అమ్మగారి ఫోటో వెయ్యటం కుదరడం లేదు, వచ్చి ఆవిడ ఫోటో తీసుకోండి. మళ్ళీ నా దగ్గర ఉంటే పాడైపోతుంది” అని. మెసేజ్ పంపి అలెక్సాలో తలత్ మహమూద్ పాట నౌషాద్ స్వరపరిచిన “తస్వీర్ బనాతా హూఁ, తస్వీర్ నహీఁ బన్తీ” పాట వింటూ అక్కడే నిద్రపోయాడు. ఉదయం ఎప్పుడో చూసుకుంటే “ఓకే” అన్న మెసేజ్ వచ్చింది.
ఓ రెండు రోజుల తరువాత ఆ ఫోటో తీసుకువచ్చిన అమ్మాయితో పాటు అమ్మాయి తమ్ముడు కూడా వచ్చారు. అమ్మాయి తమ్ముడిని పరిచయం చేసింది. అతని పేరు కూడా గిరీశమట. తనని ఎంతగానో బ్రతిమిలాడ ప్రయత్నించారు, “మా అమ్మగారి చివరి కోరిక మీతో బొమ్మ వేయించుకోవాలని” అని. తన సమస్య కూడా వారికి చెబుతూ వేసిన ఆరు పెయింటింగ్స్ చూపించాడు. ఇద్దరు బొమ్మల్లా ఆలా నించుండి పోయారు. ఇద్దరి కళ్ళలో నీళ్లు, ఏమైందో అర్థం కాలేదు, కొంచం సేపు వారిని కుదుట పడనిచ్చి అడిగాడు “ఏమైంది?” అని.
“ఈ ఆరు మా అమ్మగారు మా చిన్నప్పుడు ఎలా ఉండేవారో అలా వేశారు, ఇంత అందంగా అమ్మని చూసి చాలా ఏళ్లయింది” అంటూ ఏడుస్తూనే ఉన్నారు.
“ఇంతకీ మీ అమ్మగారి పేరు?” అన్నాడు.
“నాగవల్లి” అన్నారు ఇద్దరు.
అలెక్సాలో ‘ఇన్ ఆంఖోఖి మస్తీ కె మస్తానే హజారో హై’ ఆషా పాడిన పాట ఖయ్యాం స్వరకల్పన వస్తోంది.
