~


నా చెవుల్లో నా మదిలో ఎక్కడెక్కడో అన్నిచోట్లా నిరంతరంగా ఒక ఝరిలా
మనిషి శాశ్వతం కాదు కానీ ఆ మనిషిలోని ప్రతిభ ఏదైనా స్థిరంగా ఉండిపోతుంది
ఇంతమంది రసజనుల గుండెల్లో చోటు దక్కించుకోడం ఎంతమందికి సాధ్యపడుతుంది
అది గాయకుడు ఒక్క బాలుగారికి దక్కిన గొప్ప అదృష్టం.
ఆయనకు మాత్రమే కాదు వినేవారికి పాట అంటే ఇష్టపడే వారికీ
పాటతో బాధను మరిచిపోయేవారికీ పాటతో ఉత్సాహం పొందేవారికి
పాటతో ఆరాధన చేసేవారికి పాటను సందేశంగా పంపేవారికి ఒక సాంత్వన.
ఉద్యోగంలో ఒత్తిడి జీవితంలో వచ్చే సమస్యల ఒత్తిడి విభేదాల ఒత్తిడి
ప్రతివాళ్ళు ఎదురుకొంటూ సతమత మవుతూ చిరాకుతో ఉంటే
ఒక బాలూ పాట ఔషధమై వారిని సేదతీర్చుతుంది.
మనిషికి జీవితంలో వచ్చే అన్నిదశలకు ఆయన పాడిన పాట వుంది
దాన్ని వింటూ గుర్తుకు తెచ్చుకుంటే ఎంత హాయి సంతోషం తోడు అనిపిస్తుంది
పాటతో మనిషిలో ఎంతటి మార్పు తీసుకురావచ్చో ఎన్ని ఉదాహరణలో.
అనుభవించిన ప్రతి ఒక్కరికి తెలుసు ‘పాడుతా తీయగా’ వింటూ నిద్రపో హాయిగా
‘స్వరాభిషేకం’ చేస్తున్నాం ఆ జల్లులో తడవండి నిలువెల్లా చల్లగా
ఝుమ్మను నాద నినాదాలు దివిలో విరిసిన పారిజాతాలు సిరి మల్లి పూలు ఎన్ని సుగంధాలో.
ఒకటికాదు వేవేల నవరస భరితాలు మదిని కొల్లగొట్టు మధుర గీతాలు
చెప్పేకొద్దీ వూరే ఊటలు ఆ మహాగాయకుడి గొంతులో మంత్రజాలాలు
మైమరిపించే ఇంద్రజాలాలు భక్తులకు అభిమానులకు తనివితీరని
మనసునిండని అనుబంధాలు మరపురాని రసగుళికలు గుప్త నిధులు
దటీస్ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యంగారు.
(సరిగా రాసేనా? అమ్మో తప్పువస్తే దిద్దువారు గద్దిస్తారు.)
Image Courtesy: Internet

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.