[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అజేయం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తుఫాన్ గాయాలు కొత్త కాదు
అలలకూ నదికి ఒడ్డుకు
రోజూ వంటింట్లో అమ్మకు
పొయ్యి వేడి వాతల్లా..
అయినా
బతికించే ఆశ బయట లోలోపల
ఆలోచన కనుల కట్టిన
మాయామోహపు గంతలు
చీకటి మూసిన కిటికి తలుపులు
బాధే గోరుచుట్టు రోకటి పోటు కానీ
తొలిచే దారంతా కోరిక అజేయంగా
ఉచితాల లోకంలో కల
నమ్మించే సకల కథ సత్యసంధత
వాస్తవంలో పగిలిన కుండల గుండె
చదివి చక్కగా రాసిన
పరీక్ష ఒకనాటి చరిత్ర బృహత్కథ!
అపశృతుల వీణలో తీగతెగిన రాగం
నేడు శృతిమించిన బరితెగింపు…
బయటికొచ్చిన పేపర్ ప్రశ్నలు
గతితప్పిన గాలిలో తిరిగే శేష ప్రశ్న
ఎగిరెగిరిపడ్డదే చినిగింది నిన్నటి డైలీ పేపర్లా
చిత్తుగా మారిన త్రాసు తూకం
కథకు తిరిగి కట్లు తెంపుకునే స్థైర్యం..
పారాహూషార్..
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
