సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
నటి దేవికా రాణి ఎస్టేట్ వివాదం – విషాదం:
ఆమె భారతదేశపు గొప్ప సినీ నటీమణులలో ఒకరు కావచ్చు, ఆయన 20వ శతాబ్దపు గొప్ప కళాకారులలో ఒకరు కావచ్చు. కానీ దాదాపు ఒక దశాబ్దం పాటు, దేవికా రాణి, ఆమె భర్త స్వెతోస్లావ్ రోరిచ్ సమాధులు – మూలల్లో సాధారణ ఇటుకలతో కట్టబడి అనామకంగా ఉండిపోయాయి. ఇప్పుడు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు వెలుపల ఉన్న ఈ దంపతులకు ప్రియమైన తాతగుణి ఎస్టేట్లో ఈ రెండు ప్రదేశాలను గుర్తించి స్మారక చిహ్నాలను నిర్మించడం ప్రారంభించింది.
అంతేకాకుండా, ఆ జంట కళాఖండాలు, శిల్పాలు మరియు పెయింటింగ్ సేకరణతో కూడిన ఆర్ట్ గ్యాలరీ మరియు మ్యూజియంను స్థాపించడానికి; ఎస్టేట్ లోని విలువైన చెట్ల పెరుగుదలను సంరక్షించడానికి కర్ణాటక హైకోర్టు ఇటీవల ఈ ఎస్టేట్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఎక్కువగా ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన ట్రస్టీల బోర్డు ఈ ఎస్టేట్ నిర్వహణా బాధ్యతలను స్వీకరిస్తుంది.
ఈ మ్యూజియంలో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న రోరిచ్ పెయింటింగ్ 210 ఉన్నాయి, వీటిని తాత్కాలికంగా వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. కానీ ఆయన అమూల్యమైన పెయింటింగ్లలో రెండింతలు కంటే ఎక్కువ – కులు లోయ గురించి వేసిన దాదాపు 515 పెయింటింగ్ల మొత్తం సిరీస్ – కనిపించడం లేదు. ఈ సిరీస్లోని ప్రతి పెయింటింగ్కి కనీసం రూ. 50,000 ఖర్చవుతుందని కళా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. రోరిచ్ చిరకాల స్నేహితురాలు, ప్రసిద్ధ బెంగళూరు పాఠశాల మాజీ ప్రిన్సిపాల్ అదితి వశిష్ట్ వద్ద ఆయన జీవించి ఉండగా ఆమెకు బహుమతిగా ఇచ్చిన కొన్ని చిత్రాలు ఉన్నాయి.
ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న అనేక చిహ్నాలు కూడా స్టోరేజ్లో ఉన్నాయి, అయితే వాటిలో చాలా విలువైనవి కనిపించకుండా పోయాయి. తాతాగుని ఎస్టేట్ నుండి పదమూడు విలువైన గంధపు చెట్లు కూడా అదృశ్యమయ్యాయి. ఎస్టేట్ లోని మొత్తం 340 సిల్వర్ ఓక్ చెట్లలో, 115 మాత్రమే మిగిలి ఉన్నాయి.
రోరిచ్ దంపతులకు చాలా కాలంగా వ్యక్తిగత సహాయకురాలిగా ఉన్న మేరీ జాయిస్ పూనాచాపై క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె బెయిల్పై బయటకు వచ్చి బెంగళూరులో నివసిస్తోంది. ఆమెపై దొంగతనం, మోసం, నమ్మక ద్రోహం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆమె భర్త మానేపండ అచేయ అలియాస్ అనిల్ పూనాచా, పూనాచా దంపతుల స్నేహితుడు పి.ఎం. నందకుమార్ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులు ఆరు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నాయి, ప్రభుత్వం ఎస్టేట్ స్వాధీనం కోసం తన ప్రణాళికలతో ముందుకు సాగడానికి ముందు వాటి పరిష్కారం కోసం కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దశాబ్దం క్రితం రోరిచ్లు ఇలాంటి ట్రస్ట్ను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, వారు అప్పటి ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణను సభ్యుడిగా నియమించారు. అయితే తరువాత ఆయన తన అనుమతి లేకుండా తన పేరును చేర్చారని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రస్ట్కు, రోరిచ్లు స్పష్టంగా భావించిన ట్రస్ట్కు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, రెండో ట్రస్ట్లో మేరీ జాయిస్ ప్రముఖంగా కనిపించింది.
రోరిచ్ దంపతుల జీవితకాలంలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఎస్టేట్ను స్వాధీనం చేసుకునే ఆలోచనను ప్రతిపాదించింది. “ఈ ఎస్టేట్ విచ్ఛిన్నం కావాలని ప్రభుత్వం కోరుకోవడం లేదు, కానీ దానిని పబ్లిక్ పార్క్గా, నగర వనంగా సంరక్షించాలని కోరుకుంటుంది” అని అప్పటి ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప అన్నారు. కానీ భూమి ఒప్పందాలతో సంబంధం ఉన్న ఏదైనా విషయంలో బంగారప్ప ఉద్దేశాలను ప్రజలు అనుమానించినందున ఈ ఆలోచన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ దంపతుల వ్యక్తిగత ఆభరణాలలో కేవలం 21 మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన 319 ఏమయ్యాయనేది ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. అయితే వినిపించే పుకార్ల ప్రకారం రాజకీయ నాయకులు, రోరిచ్ ఉద్యోగులు, స్నేహితులు, ఇద్దరు పోలీసు అధికారుల హస్తం కూడా ఈ అభరణాల అదృశ్యంలో ఉంది. ఈ ఆభరణాలన్నీ – దేవిక రాణి, ఆమె మొదటి భర్త ప్రముఖ చిత్రనిర్మాత హిమాంశు రాయ్, స్వెతోస్లావ్ రోరిచ్, హెలెనా రోరిచ్, ఇంకా 20వ శతాబ్దం ప్రారంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి మొదటి సర్జన్ జనరల్ అయిన దేవిక రాణి తండ్రి ఎం.ఎన్. చౌదరి సంయుక్తంగా సేకరించినవి.
మాయమైపోయిన వస్తువులన్నీ వారసత్వ సంపద. రోరిచ్ దంపతులు మరణించిన వెంటనే, బెంగళూరు పోలీసులు అనిల్ పూనాచా మరియు మేరీ జాయిస్ ఇంటికి దగ్గరగా దుకాణం కలిగి ఉన్న చైన్రాజ్ అనే ఆభరణాల వ్యాపారి నుండి కొన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుని, అక్విజిషన్ ప్రాసెస్ని, మిగిలిన కళాఖండాల – ఇతర ఆస్తుల వర్గీకరణ త్వరగా పూర్తి చేయకపోతే, అవి కూడా క్రమంగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. “రోరిచ్ వారసత్వాన్ని న్యూయార్క్ మరియు మాస్కోలో అర్హత కలిగిన వ్యక్తులు చూసుకుంటున్నారు” అని భారతదేశంలోని రష్యా రాయబారి అలెగ్జాండర్ కడాకిన్ అన్నారు. “సాంస్కృతికంగా సగం అవగాహన ఉన్న వ్యక్తులు ఇక్కడ రోరిచ్ల కళతో వ్యవహరించడానికి మనం అనుమతించకూడదు” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తాతగుణి ఎస్టేట్లో ఖననం చేయబడిన రోరిచ్ మృతదేహాన్ని మాస్కోకు తరలించి, అక్కడ ఒక గొప్ప స్మారక చిహ్నంలో దానిని తమ పద్ధతిలో ఖననం చేయాలనే ఆశను రష్యా ప్రభుత్వం ఇప్పటికీ వదులుకోలేదు. 1993లో జనవరి 30న బెంగళూరులో రోరిచ్ మరణించినప్పుడు వారు దీన్ని చేయాలనుకున్నారు.
స్వెతోస్లావ్ మరణవార్త విని బెంగళూరుకు చేరుకున్న కడకిన్, ఇతర దౌత్యవేత్తలు మృతదేహంతో పాటు మేరీ జాయిస్ రావడాన్ని వ్యతిరేకించారని రోరిచ్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వర్గాలు తెలిపాయి. మేరీ జాయిస్ రష్యన్ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని వారు దేవికా రాణిని చాలా స్పష్టంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది, ఎందుకంటే రోరిచ్ చివరి సంవత్సరాలలో అనారోగ్యంతో బాధపడుతుండటంలో ఆమె పాత్ర ఉందని చాలా మంది రష్యన్లు విశ్వసించారు.
దేవిక రాణి స్పందిస్తూ, రోరిచ్ను బెంగళూరులో, తనకు అత్యంత ప్రియమైన ఎస్టేట్లో ఖననం చేయడం ఉత్తమం అని ఆమె అన్నారు. “వీలైతే డాక్టర్ తన జన్మస్థలంలో ఖననం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు” అని ఆమె అన్నారు. “లేకపోతే, ఆయనను తాతగుణిలో ఖననం చేయాలనుకున్నారు. ఆయన నిర్ణయాన్ని నాకే వదిలేశారు. అనారోగ్యం మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా నేను మృతదేహాన్ని రష్యాకు తీసుకెళ్లలేకపోతే, నేను లేనప్పుడు ఆయనను ఖననం చేయడానికి ఇష్టపడేవారా?” అని ప్రశ్నించారామె.
అప్పటికి దేవికా రాణి శ్వాసకోశ వ్యాధులతో తీవ్రంగా బాధపడ్డారు, రోజుకు నాలుగు లేదా ఐదు ప్యాకెట్ల సిగరెట్లు తాగే అలవాటు వల్ల ఆమె అనారోగ్యం మరింత తీవ్రమైంది. అయితే, చేతిలో సిగరెట్ లేదా ముఖంపై మేకప్ లేకుండా ఎప్పుడూ ఫోటోలు తీయకుండా చూసుకోవడానికి ఆమె చాలా కష్టపడేవారు. “నా మొదటి భర్త హిమాంశు రాయ్ ఎప్పుడూ ఆ రెండు విషయాల గురించి జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పారు” అని ఆమె ఒకసారి అన్నారు.
తమ జీవితంలోని చివరి సంవత్సరాలలో, రోరిచ్లు బెంగళూరు నడిబొడ్డున ఉన్న వారి ఎస్టేట్; వారి కార్యాలయం మధ్య తిరుగుతూ, ప్రైవేట్గా కానీ విలాసవంతమైన జీవితాన్ని గడపడం నుండి, నర్సులు, డ్రైవర్లు మరియు ఇతర సిబ్బందితో చుట్టుముట్టబడిన అనారోగ్యం, మతిమరుపు వంటి సమస్యలలో వృద్ధ జంటగా రూపాంతరం చెందారు. ఈ జంట తమ స్నేహితులను గుర్తుంచుకోవడం; సుదీర్ఘమైన, తెలివైన సంభాషణలను కొనసాగించడం కష్టమని భావించారు. ఇది వయస్సు వల్ల కలిగే సహజమైన విషయమని అందరూ భావించారు, కానీ తరువాత ఏదో తప్పు జరుగుతోందన్న పుకార్లు వచ్చాయి, కానీ అవేవీ నిరూపించబడలేదు.
1990లో రోరిచ్కు హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఆ జంట నర్సింగ్ హోమ్ నుండి నేరుగా ఒక హోటల్లోకి మారారు. వారు తమ ఎస్టేట్కు తిరిగి రావడానికి ఒక ప్రయత్నం చేశారు, వారు దాన్ని ఎంతో ఇష్టపడేవారు. 1950లలో బెంగళూరుకు మొదటిసారి వచ్చినప్పటి నుండి అక్కడే నివసించారు. కానీ అక్కడ వారి బస చాలా గందరగోళంతో నిండిపోయేసరికి, వారు హోటల్కు తిరిగి వచ్చారు. తన భర్త మరణించిన దాదాపు 15 నెలల తర్వాత దేవికా రాణి బ్రాంకైటిస్తో మరణించారు. ఆమె ఆయనని ‘డాక్టర్’ అని పిలిచేవారు, ఆయన ఆమెను ‘మేడమ్’ అని పిలిచేవారు.
1990లో, రోరిచ్ తాతగుణి ఎస్టేట్లో కొంత భాగాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. మేరీ జాయిస్ 234 ఎకరాలను బిల్డర్ కెటి భగత్కు రూ. 9.6 మిలియన్లకు విక్రయించడానికి చర్చలు జరిపింది. దేవిక రాణికి ఈ అమ్మకం గురించి తెలియకపోవడంతో ఆమె చాలా కోపంగా 224 ఎకరాలను మళ్ళీ భగత్కు విక్రయించాలని నిర్ణయించుకుంది. ఆమె మేరీ జాయిస్ బావమరిది ఆర్ దేవదాస్, మేరీ అక్క డోరతీ భర్త సహాయం తీసుకుంది. భగత్కు బెంగళూరుకు చెందిన మద్యం వ్యాపారి మద్దతు ఉందని పుకారు ఉంది. యాదృచ్ఛికంగా, రోరిచ్ల మరణం తర్వాత, మేరీ, దేవదాస్ ఇద్దరూ ఒకరితో ఒకరు విభేదించి, ఇద్దరూ తమ వద్ద రోరిచ్లు సంతకం చేసినట్లుగా చెప్పబడే వీలునామాలున్నాయని వాటిని సమర్పించారు.
ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు కొనుగోలుదారులకు రూ.50 మిలియన్ల వరకు పరిహారం చెల్లించడానికి కోర్టు అధికారం ఇచ్చింది. కానీ అది అధికారికంగా జాబితా చేయబడిన ఆస్తి అమ్మకపు ధర, అంటే రూ.20 మిలియన్ల కంటే తక్కువ ఉన్నంత వరకు మాత్రమే వారికి పరిహారం చెల్లించే అవకాశం ఉంది.
ఆ దంపతులు తమ చివరి సంవత్సరాలు గడిపిన అశోక హోటల్, చిత్రకళా పరిషత్కు చాలా దగ్గరగా ఉంది, ఇది రోరిచ్లు తమ ఆరోగ్యకరమైన రోజుల్లో ఎంతో ఇష్టపడి పోషించిన కళా కేంద్రం. రోరిచ్లు చనిపోయే వరకు రోజుకు రెండుసార్లు వారిని సందర్శించే పరిషత్ ప్రధాన కార్యదర్శి నంజుండ రావు, కడకిన్ తో సహా ఇతర రష్యన్ లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, అన్ని కోర్టు కేసులను ట్రాక్ చేస్తూనే ఉన్నారు.
పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం – పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్లను ఆస్వాదించేందుకు ఫేస్బుక్లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
