Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ కడుపు చల్లగా-49

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

క్లైమేట్ క్రైసిస్ కారణంగా 2025 నాటికి ‘గల్ఫ్ స్ట్రీమ్’ ఎండిపోతుందని ఒక అంచనా. ‘రీఫారెస్టేషన్’ ప్రోగ్రామ్ కూడా అనుకున్నంత/ఆశించినంత సత్ఫలితాలను ఈయని కారణంగా అది కూడా ఒక రకంగా విఫల ప్రయత్నం గానే మిగిలిపోయిందని నోబెల్ బహుమతి గ్రహీత ఎలినార్ ఆస్ట్రామ్ (Elinor Ostrom) వ్యాఖ్యానించడం జరిగింది. స్పటికమంత స్వచ్ఛమైన జలాలతో అలరారే లాగూన్స్ (అర్జెంటీనా), అటకామా ఎడారి కనిపించకుండా పోయే ప్రమాదం ఉందనీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇవే కాకుండా మనకు తెలియని ఇటువంటివే మరెన్నో ప్రకృతి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాయి.

ఫసిఫిక్ దీవుల వాతావరణ చర్యల నెటవర్క్, ‘ఆయిల్ ఛేంజ్ ఇంటర్నేషనల్’ వంటి సంఘాలు ఈ అంశంపై CoP-28లో ఘాటుగానే స్పందించాయి. 127 దేశాలు – ఒక ఆమోదముద్రతో కూడిన నిర్ణయం కావాలని పట్టుబట్టాయి. నిరుడు ‘ఫేజ్ అవుట్’ గురించి పట్టుబట్టిన ఆ దేశాల సంఖ్య 80 మాత్రమే. కాగా CoP-28 నాటికి ఆ సంఖ్య 127కి పెరిగింది. U.K., U.S., EU, Japan, Canada, Australia వంటి దేశాలు వెంటనే ఇల్లు దిద్దుకొని ప్రపంచ దేశాలకు కావలసిన పాకేజీని అందించాలన్నది డిమాండ్ కాగా నిధులు, సాంకేతికతల బదిలీ వంటి అంశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ష్యూరిటీతో కూడిన స్పష్టమైన వాగ్దానాలు కావాలని ‘ప్రపంచ పర్యావరణ న్యాయం’ ఉద్యమం వ్యవస్థాపకుడు అసద్ రెహమాన్ డిమాండ్ చేశారు. దానికీ కారణం ఉంది.

యునైటెడ్ నేషన్స్ I.P.C.C నిపుణుల పేనల్ 2030 నాటికి 1.5° కి ఉద్గారాలను తెగ్గోసి తీరాలని నిర్దేశించింది.

2021 మే నెలలో I.E.A క్రొత్త ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్‌ను గాని, క్రొత్త బొగ్గు గనులను గాని వనరుల వెలికితీతకై ఒప్పుకోరాదని, అప్పుడే ‘Net-0’ కు మార్గం కొంతలో కొంత సులువవుతుందని శాసించింది. CoP-26లో దేశాలు ఫేజ్‍ డౌన్‌కు అంగీకరించాయి కూడా. అయితే, అంగీకారాల దారి అంగీకారాలదే, చేతల దారి చేతలదే అన్నట్టుగా –

2022 తరువాత కూడా 437 క్రొత్త ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. పెట్టుబడులు పెట్టి హైడ్రో కార్బన్ ఫీల్డ్ లను అభివృద్ధి చేసి తదుపరి దశలో చమురును వెలికితీస్తారు. వీటిలో 57% ప్రాజెక్టులకు వెనకాల ప్రభుత్వాల దన్ను ఉన్న కంపెనీలే ఉండటం విశేషం. 2019 నాటికి 40% ఉత్పత్తి తగ్గిస్తామని అన్న B.P. రూటు మారి తగ్గింపును 25%కి కుదించింది. ఆయిల్ దిగ్గజాల రెన్యూబుల్ కు మార్పిడి చురుకుగా జరగటంలేదు కాబట్టి డిమాండు రీత్యా ఇంధనాల వెలికితీత తప్పనిసరి అవుతోందని ఒక దిగ్గజ కంపెనీ C.E.O. వివరణ!

“మండుతున్న భూగోళాన్ని శిలాజ వనరుల అగ్నిగండంతో చల్లబరచలేమని 1.5° కూడా అవకాశమే గాని అంతకు మించిన ఎన్నో చర్యలు కూడా తక్షణం అవసరం” అనీ సుస్పష్టంగా ప్రకటించిన U. N. సెక్రటరీ జనరల్ హెచ్చరికలూ చెవిటికి శంఖమే అవుతున్నాయి!

Exit mobile version