[శ్రీమతి అరవిందారావు గారు రచించిన ‘అనాథ నాదం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒకప్పుడు అమ్మానాన్నలతో..అక్కాచెల్లెళ్లతో
అనందంగా ఆడుకుంటూ జీవించేవాళ్ళం
మా బొమ్మల్ని ఇతరులతో పంచుకుంటూ
బడిలో పాఠాలు వల్లించేవాళ్ళం
కాని.. ఇప్పుడు నా తరగతికి గోడలు లేవు
తలుపులు లేవు
ఇల్లు లేదు తల్లి లేదు
ఎగరేసి ఎత్తుకునే తండ్రి లేడు
చెల్లి ఒక చేయి ఎగిరిపోయింది
అన్న ఒక కాలు ఊడిపోయింది
ఇద్దరినీ తట్టినా ఉలకలేదు
ఇద్దరినీ తడిమినా పలకలేదు
వారి నెత్తురుతో తడిసిన నా చేతులు
తుడిచే పొడిబట్టలు లేవు
తడిసిన నా చెక్కిళ్ళు తుడిచే
పొడి చేతులు లేవు
సూర్యుడు మరణించాడు
మిన్నుకు మసిబట్టింది
పగలో రాత్రో తెలియని పరిస్థితిలో
నిరంతర సైరన్ల పాటలకి
ఎడతెగక రోదిస్తున్న పసిపాపలు
పరుగెడుతున్నాము ఆశతో
పట్టుబడని సందుల్లోకి
నిప్పుల వర్షంలో తడిసి
నీడలేక నిరాశతో..
రాక్షసులు ఉన్నారని
అమ్మ చెప్పిన కథలు
గురుతుకు తెచ్చుకుని
గజగజ వణుకుతున్నాము
మా ఇళ్ళని కాల్చేసి
మా జీవితాలు భస్మంచేసి
కూలిపోయిన నగరాలకు
రాజులవుతున్నారు..
ఇది మా యుద్ధం కాదు
ఈ కాల్పులు.. హత్యలు మాకొద్దు
బాంబులతో ఆడే మీ ఆటలు అసలొద్దు
మీరు గిరిగీసిన గీతల్లో(సరిహద్దుల్లో)
మీ దేశపు కొలతల్లో..
మాకు ఆసక్తి.. అక్కసు లేవు
మా సందులలో మమ్మల్ని బతకనివ్వండి
మా అమ్మల వొడిలో తలదాచుకోనివ్వండి
మా ఊపిరి ఆగేలోపు
తుపాకీల తమకంలో
మా గోడు వినిపిస్తే
ఈ మారణహోమం ఇక మానండి..
హైదరాబాదులో పెరిగిన పారనంది అరవిందారావు గారు విశ్రాంత రసాయనిక పరిశోధన శాస్త్రవేత్త (బోయింగ్ కంపెనీ). ఇంగ్లండులో బోయింగ్ కంపెనీకి కావలసిన Eco friendly polymers ఉత్పత్తి పరిశోధనకి ప్రాజెక్ట్ లీడర్ గా 20 ఏళ్ళు పనిచేసారు.
బోధనా పద్ధతులలో పోస్ట్ గ్రాడ్యేట్ చేసి ప్రస్తుతం కేంబ్రిడ్జ్ అంతర్జాతీయ ఎగ్జామినేషన్ బోర్డ్కి ముఖ్య పరీక్షాధికారిగా పనిచేస్తున్నారు.
దక్షిణ భారతీయ, ఉత్తర భారతీయ (హిందుస్తాని )సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. ఇంగ్లండు లోనే అద్భుతమైన గురువు వద్ద గజల్స్, టుమ్రీలు, భజనలు పాడే తీరు అభ్యసించారు.
European Telugu Association UK సంస్థకి ఉపాధ్యక్షురాలిగా, ఆశావరి అనే హిందుస్తాని శాస్త్రీయ సంగీత సంస్థకి కార్యదర్శిగా పనిచేసి, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
గీతాంజలి అనే బహు భాషా కవుల సంఘ సభ్యురాలు. ఆంగ్ల కవితలు కూడా రాసి ఇంగ్లండులో మంచి పేరు తెచ్చుకున్నారు. అవి ఇక్కడ anthology లో ముద్రింపబడ్డాయి.
ప్రచురణలు: మనసు విప్పిన మడతలు, కీ.శే. జింకా రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితా సంపుటి (2024) పురస్కారం సిరికోన సాహితీ అకాడమీ ద్వారా లభించింది.
కథా సంపుటి అహమిక పుస్తక ఆవిష్కరణ జనవరి 2025 సిరికోన సాహితీ అకాడమీ ఆధ్వర్యంలో ఆచార్య రాణిసదాశివమూర్తిగారు (తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయపు ఉపకులపతి) చే ఆవిష్కరింపబడింది.
త్వరలో రాబోయే ప్రచురణలు – ద్వితీయ కవితాసంపుటి, ప్రథమ నవల, లండన్ కథాసంపుటి
సంగీత సాధన, కవితలు, తెలుగు గజల్స్ రచన ,కథలు రాయడం, పుస్తక పఠన వీరి ప్రధాన ఆసక్తులు.
మెడికల్ కాలేజీల్ల్లో సీట్ల కోసం శ్రమ పడే విద్యార్థులకి రసాయనిక శాస్త్ర బోధిస్తుంటారు.
