Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవిశ్రాంత శ్రామికుడు

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘అవిశ్రాంత శ్రామికుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

శాభ్దాలెన్ని గడిచినా
తాతలు పంచి ఇచ్చిన
వారసత్వ సంపద
ఎర్రమట్టి భూమిలో..
అన్నం గింజలు మొలక లెత్తడానికి
నువ్వు చిందించిన
చెమట చుక్కల సువాసన
నా నాసిక పుటాలకు
ఇప్పటికీ అంటుకునే వుంది!
నాలుగెకరాల దుక్కి తోనే
నలుగురు బిడ్డల భవిష్యత్తును ముడిబెట్టి
వరుణ దేవుడి కరుణ కోసం
ఆశగా ఎదురు చూస్తూ
రెక్కలు ముక్కలు చేసుకోని
బీడుభూమిని పంట చేనుగా మార్చి
ధాన్యపు సిరులు పండించావు!
నీ బిడ్డల ఆకలి మాత్రమే గాక
సభ్య సమాజం కడుపుమంట కూడా తీర్చి
అన్నదాతవై అలరారావు!
భార్యాబిడ్డల ఆనందమయ జీవనం..
కుటుంబ బాధ్యతల బంధాలు..
సుసంపన్నమైన బిడ్డల భవిష్యత్ జీవితం..
నీ జీవిత లక్ష్యాలుగా
కష్టాల కడలిలో ఈదులాడుతూ
జీవన గమ్యానికి చేరుకున్నావు గానీ..
నీకంటూ ఏమో మిగుల్చుకోలేక
నీ కోసం ఇసుమంతైనా దాచుకోలేక
నీ జీవన భాండాగారంలోని
శ్రమను..
వయస్సును..
శక్తినీ..
మా ఔన్నత్యం కోసం
నిస్వార్థంగా త్యాగం చేశావు!
మాకు జీవితాన్ని ఇచ్చావు..
బ్రతుకు దారి చూపావు!!
నువ్వు మా కోసం నిర్మించిన
జీవన రహదారిపై. నడుచుకుంటూ..
విలాసవంతమైన జీవన గమ్యంలో
భార్యాబిడ్డలతో
తృప్తిగా స్థిరపడిపోయాము!
కానీ.. నువ్వు మాత్రం
ఇంకా అక్కడే..
ఆ ఎర్రమట్టి భూమిలోనే..
స్వేదం వర్షాన్ని కురిపిస్తూ..
భావి తరాలకు అన్నం పెట్టాలని
శ్రమిస్తూ..!?
నీ శ్రమను దోపిడీ చేసి..
నిన్ను మరచిపోయి..
కృతజ్ఞతా భావనను విస్మరించి..
నగరవాటికలో
హాయిగా బ్రతుకుతోన్న..
నీ బిడ్డల్ని మన్నించు నాన్నా!!

Exit mobile version