[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘బంధాలన్నీ.. రుణానుబంధాలే!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గుండె లోతులన్నీ ఘనీభవించాయి!
ప్రేమానుబంధాల తేమ..
మమతానురాగాల తడి..
గుండె గోడలపై మచ్చుకైనా లేవు!
నాలుగు గోడల నడుమ
యాంత్రిక జీవనమే అందరిదీ!
తనకు అందరూ ఉన్నారనే నిజం భౌతికమైతే..
ఎవ్వరూ లేరనే నైరాశ్యం
హృదయమంతా నిండి వుంది!
సంతోషాలు ఒక్కొక్కటిగా వస్తే
దుఃఖాలు గుంపులుగా వచ్చి..
అంతరంగంలో బాధను
హృదయంలో వేదనను
రగిల్చి వెళ్తున్నాయి..!
అందరూ ఆశావహంగానే కనిపిస్తారు గానీ..
లోలోపల తీవ్రమైన అంతర్వేదనలు
అల్లిబిల్లిగా అల్లుకొని..
మానస సరోవరంలొ
అలజడులెన్నో చెలరేగుతున్నాయి!
హృదయం ఎడారిలో భగభగల మంటలు..
ఆ ఆవేదనా జ్వాలలను తడిపేందుకు
ఏరులై పారుతున్న దుఃఖ ధారలు..
కాలిపోతున్న గుండె లోపలి నుండి
ఎగదన్నుకుంటూ వస్తోన్న పొగలు..
ఉక్కిరిబిక్కిరై అలమటిస్తోన్న దుస్థితిలో
ప్రేమతో లాలించే హృదయాలు..
సానుభూతితో గుండెలకు హత్తుకునే చేతులు..
కరువైపోయాయి చుట్టూ వున్న ప్రపంచంలో!
ఈ ఆధునిక వ్యవస్థలో..
అన్నీ ఇచ్చిపుచ్చుకోడాలే!
మనతో కలిసి బ్రతికే జన సమూహమే కాదు..
బంధాలు.. రక్త సంబంధాలు
కన్నవాళ్ళు.. కడుపున పుట్టినవాళ్లు
అందరిదీ వ్యాపార దృక్పథమే!
మానవ జీవనయానం కడవరకూ
గమ్యం తెలియని ప్రయాణమే!
ఈ బ్రతుకంతా బాకీలు తీర్చడానికేనని..
మనిషికీ మనిషికీ మధ్య నడయాడేది
రుణానుబంధమేనని..
ఒకరికి మరొకరు
బాకీలు తీర్చుకొని
ఎవరి లోకానికి వారు
పయనమైపోతారని..
కట్టకడపటి మజిలీ
మృత్యుగహ్వరమేనని..
గ్రహించలేని మనిషి
బ్రతుకంతా ఆరాట పోరాటాలతో
ప్రతి రోజూ..
ప్రతీ క్షణమూ..
చస్తూనే బ్రతుకుతున్నాడు!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.