[పసుమర్తి పద్మజ వాణి గారి కథాసంపుటి ‘బతుకు రాదారిలో’ పై విశ్లేషణాత్మక సమీక్షని అందిస్తున్నారు శ్రీ మాకినీడి సూర్య భాస్కర్.]
పసుమర్తి పద్మజ వాణి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలు – రహదారుల శాఖలో ఇంజనీర్గా ఉద్యోగ అనుభవం కలిగిన సృజనశీలి. ఈ వృత్తి ఆమెకు అందజేసిన జీవన దృష్టి, శైలి, సన్నివేశాలు, వ్యవస్థలోని మనుషులు – ఈ మొత్తం అనుభవం ఈ తొమ్మిది కథల ఇతివృత్తాలన్నింటిని ఆంతర్యంగా శాసిస్తుంది. సంపుటి మొత్తాన్ని చదివినప్పుడు మనకు కనిపించేది – ఒక రచయిత్రి తన వృత్తి ప్రపంచాన్ని మాత్రమే కాదు, ఆ ప్రపంచంలో మనుషులు ఎలా మారుతారు, ఎలా పడిపోతారు, ఎలా లేస్తారు అనేది అత్యంత సమీపంగా గమనించి రాసిన కథనం. అందుకే జీవద్వంతంగా సాగింది.
పద్మజ వాణి కథల ప్రత్యేకత – అవి కేవలం ‘ఆఫీస్ కథలు’ కావు. భవన – రహదారుల నిర్మాణం, పనుల పర్యవేక్షణ, సెక్షన్ – ఆఫీసులు, టెండర్లు, దూర గ్రామాల్లో జరిగే రహదారి నిర్మాణాలు.. ఇవన్నీ ఆమె కథల్లో పరిసరాలు మాత్రమే. అసలు కథ మాత్రం – ఆ పరిసరాల్లో బతికే మనుషుల అంతర్మథనం.
ఆమె వృత్తి కథనంలో ప్రతిబింబించిన అంశాలు
బ్యూరోక్రసీ లోపాలు – లాభాలు, ఫైల్ పాస్ చేయడంలో జరిగే అంతర్గత రాజకీయాలు, చిన్న తప్పు పెద్ద సమస్యగా మారడం, అధికారి – సిబ్బంది మధ్య అనధికార సమీకరణలు – ఇవి కథలకు ఉపాంగాలుగా (సబ్ ప్లాట్) చక్కగా అమరిపోయేలా రచన సాగింది.
ఇంజినీరింగ్ క్రియాశీలక లోకంలోని భౌతిక వాస్తవాలు – కొండచరియలు, పొంగిపోయిన చెరువులు, కొత్త రహదారి సర్వేలు, భూమి కొలతలు – పద్మజ వాణి వర్ణనల్లో శాస్త్రీయ ఖచ్చితత్వం ఉంటుంది. ఇది కథనానికి నమ్మకం కలిగిస్తుంది.
గ్రామీణ నిర్మాణ పనుల్లో ఎదురయ్యే సామాజిక అడ్డంకులు, పని ఆపేయించే స్థానిక గ్యాంగులు, రాజకీయనాయకుల ఒత్తిళ్లు, విపత్తుల సమయంలో అధికారులు ఎదుర్కొనే ఒత్తిడి ఇవన్నీ కథల్లో కనబడతాయి.
వృత్తి నైతికత – వ్యక్తిగత నైతికత మధ్య ఢీకొనడం
కొన్ని కథల్లో హీరోలు/హీరోయిన్లు ధర్మసంకటాల మధ్య నిలబడతారు – అక్కడే పద్మజ వాణి కథలు మరింత బలపడతాయి. విజయవంతంగా సాగుతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, పద్మజ వాణి వృత్తి కథనం – జీవితం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది, ఉద్యోగం ఎలా పనిచేస్తుందో కాదు.
పద్మజ వాణి కథనశైలి మూడు అంశాల వలన ప్రత్యేకంగా నిలుస్తుంది:
- సరళమైన భాష, కానీ లోతైన అంతర్మథనం. చిన్న చిన్న సంభాషణలే పాత్రల మనోవిశ్లేషణను మౌనంగా మోస్తుంటాయి.
- అనుభవ–ప్రేరిత సన్నివేశ నిర్మాణం మరో విశిష్టత. ఆమె కథల సన్నివేశాలు పుస్తకాల్లోంచి కాదు, ఫీల్డులో – మట్టి, ధూళి, సర్వే సుత్తులు, పనిముట్లు ఉన్న చోట – పుడతాయి. ఇది ఆమె కథలకు ప్రత్యేక యథార్థతనిస్తుంది.
- ముగింపులు చాలా వాస్తవికంగా, – ‘అవును, నిజం కదా!’ అనిపించేలా ఉంటాయి.
పద్మజవాణి కథల్లో ‘రంగు రంగుల ముగింపు’లుండవు. ముగింపు అనేది కథలోని సమస్య పూర్తిగా పరిష్కారమైన చోట కాదు—వాస్తవం మనిషిని ఎక్కడ ఆపుతుందో అక్కడే ఆమె కథ ఆగుతుంది.
కథయిత్రిగా పద్మజవాణి బలమైన అంశాలు:
(i) పరిశీలనా శక్తి: ప్రతి పాత్ర – చిన్నదైనా – పూర్తిగా జీవిస్తుంది. ఒక జూనియర్ ఇంజినీర్, ఒక కాంట్రాక్టర్ అసిస్టెంట్, ఒక గ్రామ పెద్ద, ఒక కూలీ ఆడదాని మాట – ఎవరూ ‘సడన్ ఎంట్రీ’ గా రారు. అది స్పష్టంగా ఒక అధికారి – పరిశీలకురాలు రాసిన కథ.
(ii) మహిళా రచయితగా వృత్తి లోకాన్ని చూపిన ధైర్యం: ఇంజినీరింగ్ శాఖలలో మహిళల సంఖ్య తక్కువగా ఉండే కాలంలో వచ్చిన ఈ కథలు – మహిళ అనుభవించిన ఒత్తిళ్లు, పనిస్థలం ఇబ్బందులు, పైకి కనిపించని వివక్ష, వృత్తి గౌరవం పొందడానికి పడిన ఆరాటం, చేసిన పోరాటం – ఇవన్నీ యథాతథంగా చిత్రించి బడ్డాయి.
(iii) లోతైన మానసిక వాస్తవికత చిత్రించడంలో కూడా పద్మజవాణి కలం తొట్రుపడదు. పాత్రలు బయటకు నిశ్చలంగా కనిపించినా – లోపల గొంతెమ్మలతో పోరాడుతుంటాయి. ఈ కథల అసలు బలం ఇదే.
యద్దనపూడి మహిళా మనోవైఖరి, అంతర్ముఖ సంఘర్షణ, మానవ సంబంధాల సున్నితత్వం ఈమె కథల్లో వేరే వాతావరణం.. పూర్తిగా వేరే – సాంఘిక సాఫ్ట్-డ్రామాలా కాక, వృత్తిపరమైన కఠిన వాతావరణం నేపథ్యంగా సాగుతాయి. మల్లాది వెంకటకృష్ణమూర్తి చిత్రించిన ఆఫీస్ పర్యావరణం, వ్యవస్థ లోపాలను మరింత వాస్తవికంగా చూపుతాయీ కథలు.
‘వృత్తి–కథల’ సంప్రదాయం (Professional fiction) పాశ్చాత్యంలో
అతోల్ ఫుగార్డ్ – మైనింగ్/కళాకారుల కథలుగాను,
అప్టన్ సింక్లేర్ – పారిశ్రామిక వాస్తవికతను
అరవింద్ అడిగా – బ్యూరోక్రటిక్ భారతాన్ని వృత్తి–ఆధారిత యథార్థ కథలుగా రాశారు. వృత్తి లోకాన్ని వాస్తవిక కథలుగా మార్చిన రచయితలు తెలుగులో అరుదు. ఇది ఈ కథయిత్రికి ప్రత్యేక స్థానం కల్పించుతుంది. పోలీసు కథలను సీతారామారావు రాశారు.
పద్మజ వాణి కథలు కూడా వృత్తి అనుభవం ఆధారంగా నిర్మితమైనందున – ప్రపంచ కథా సంప్రదాయంలో ఇవి సాంఘిక వాస్తవ వృత్తి కథల వర్గంలోకి వస్తాయి. అయితే భవనాలు – రహదారుల నిర్మాణ ప్రపంచాన్ని వేదికగా రాసిన రచయితలు ప్రపంచ సాహిత్యంలో కూడా అరుదే కావచ్చు.
జీవితం అనేది రహదారి లాంటిదే. రాళ్ళు, గుంతలు, అడ్డంకులు – దాటుకుంటూ పోతేనే ముందుకు సాగుతాం. ఆ రహదారిని నిర్మించే మనుషుల అంతరంగాన్ని ఈ కథలు దగ్గరగా చూపించాయి. కథయిత్రి పద్మజ వాణి గారికి అభినందనల శుభాకాంక్షలు.
***
రచన: పసుమర్తి పద్మజ వాణి
పేజీలు: 144,
వెల: రూ.150/-
ప్రతులకు:
విశాలాంధ్ర,
నవోదయ,
నవ చేతన,
నవ తెలంగాణ బుక్ హౌస్
~
రచయిత్రి ఫోన్: 8247499024.
~
శ్రీమతి పసుమర్తి పద్మజ వాణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-padmaja-vani/

