Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతీయులకు హెచ్చరిక-6

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము.

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – నాల్గవ అధ్యాయము

భారతీయతకు సమర్ధన

ఒక ప్రమాదఘంటిక

సజీవమైన ఆర్య బహు దేవతారాధన (paganism)కు చివరి గట్టి పట్టు కొమ్మ, భారతదేశం. కాని ఎంత కాలం భారతదేశం మనబోతూంది? అంటే, ఎంత కాలం భారతీయత  భారతదేశంలో మనగలగుతూంది?

దక్షిణ భారతంలో నివసించే వారికి, ఈ ప్రశ్న వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే వారు, దేశానికి గర్వకారణమైన, అద్భుత దేవాలయాలకు దగ్గరగా, మమ్మురమైన భారతీయ  జీవనం మధ్యన నివసిస్తారు కాబట్టి. ఏమిటి మరి ఈ ప్రమాదం? కొంత మంది అస్పృశ్యులు రోజూ క్రైస్తవులుగా మారుతున్నారనా, ఐనా సరే వారు సమాజంలో అస్పృశ్యులుగా ఉండిపోతున్నారనా? వారు లెక్కలోకి రారు. మరి మహమ్మదీయులు? వారు జనాభాలో మూడు లేక నాలుగు శాతం ఉంటారు. వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా కనబడదు. వారికి అధికారం లేదు. వారు ఏ ఇబ్బందులు సృష్టించరు. భారతీయత   ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

ముస్లింములు రెండు శాతం ఉన్న ఒరిస్సాలో నివసించేవారికి ఇలాగే అనిపిస్తుంది. బీహారులో వారి సంఖ్య పది శాతం, ఆగ్రా, అవధ్ ప్రాంతాలలో వారు పదమూడు శాతం. మధ్య భారతపు పరగణాల్లో వారి సంఖ్య ఐదు శాతంలోపే. పశ్చిమ బెంగాల్ లోని (మిద్నపూర్ జిల్లా, ఉదాహరణకు) కొన్ని ప్రాంతాల్లో ఆరు శాతం. అక్కడ కూడా మనం భారతీయతకు ముప్పు లేదనే అనుకుంటాం.

మరి, ఆర్య సంస్కృతి పుట్టి పెరిగిన పంజాబు సంగతేమిటి? దాని పశ్చిమ జిల్లాలను మినహాయిస్తే, భారత సంస్కృతికి నిలయమైన బెంగాలు మాటేమిటి? కనీసం, పంజాబులో, ఒక్కటిగా నిలిచి భారతీయత  కోసం, ఒక వేళ ఏదైనా సమస్య వస్తే, పోరాడగల సిక్కులున్నారు. బెంగాలులో అలాంటి పోరాట యోధులు లేరు. దాని పరిస్థితి మరింత అధ్వాన్నం.

1931లో, బెంగాలు చేపట్టిన జనగణన సరైనదైతే, బెంగాలు గురించిన ఒక స్పష్టమైన, చెప్పకోదగ్గ చిత్రం అది మనకిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో హిందువులు మెజారిటీ, కాని ఉత్తర, తూర్పు బెంగాల్‌లో వారు, ఒక బెంగాలీ రచయిత విషాదంగా అన్నట్లుగా, ‘ఒక నశిస్తున్న జాతి’.

బెంగాల్‌లో హిందూ జనాభా ఇంచుమించు 22 మిలియన్లు. ముస్లిముల జానాభా 28 మిలియన్లు. అస్సాంలోని సిల్హెట్ అనే సరిహద్దు జిల్లాలో, బెంగాలీ మాట్లాడతారు. వారిలోని ముస్లింలను కూడా కలుపుకుంటే, ఆ సంఖ్య 30 మిలియన్లకు చేరువవుతుంది. అది బ్రిటిష్ పాలిత భారత దేశంలోని మొత్తం ముస్లిం జనాభాలో ఒకటిన్నర భాగం (భారత రాష్ట్రాలను మినహాయిస్తే).

బెంగాలులోని ముస్లింల జనాభా ఒక్కటే ప్రస్తుత టర్కీ జనాభాకు రెండింతలుంటుంది. దానిలో  మైమన్‌సింగ్ అనే జిల్లా ముస్లింల జనాభా, మొత్తం అరేబియా దేశపు జనాభాలో సగం కంటే ఎక్కువే.

సంఖ్యలు ఎంత బాగున్నా, బెంగాలు గ్రామీణ ప్రాంత ముఖచిత్రం మరింత బాగుంటుంది.

ఒక్క హిందువును కూడా చూడకుండా, మైళ్ల కొద్దీ మనం నడవ గలిగిన ప్రాంతాలున్నాయి. నదిలోని పడవవారి మధ్య జాతి భేదాలు ఉండవు. అలాగే పొలాలలోని రైతులలో కూడా. అలాగే బెంగాల్ లోని ఇతర ప్రాంతాలలో ఉండే పడవవారు, రైతుల మధ్యలో కూడా. వారంతా బెంగాలీ భాషే మాట్లాడతారు. వారoతా బెంగాలీలే. వారికి ‘గడ్డం’ లేకపోతే, తెల్లని ధోవతికి బదులుగా వారు రంగుల లుంగీని ధరించకపోతే, వారిని మనం హిందువులుగానే లెక్క వేస్తాం. కాని, వారి సామూహిక స్పృహ మాత్రం భారతీయతది కాదు. వారి తిండి వేరు. వారి దృక్పథం వేరు. ఒక, చర్చించబడని, పరిపూర్ణ సత్యాన్ని వారంత గట్టిగా నమ్ముతారు. ఒక మతగ్రంథంలో ప్రవచించిన, నిశ్చితమైన, ఒక అంతర్జాతీయమైన విశ్వాసాన్ని, వారు అనుసరిస్తారు. వారి దేవుడు మానవ జాతికి తొలుతగా ఆ పవిత్ర గ్రంథాన్ని ఇచ్చిన ఒక సుదూర దేశం నుంచి తమ పూర్వీకులు వచ్చి ఉంటారని నమ్మటానికి వారు సిద్ధంగా ఉంటారు.

మీరు ఒక గ్రామానికి వెళ్లండి. తూర్పు బెంగాల్ లోని ఒక అందమైన గ్రామాల్లో ఒక దానికి, వెదురు బొంగులతో చేసిన పాకలు, ఒక ఆకు పచ్చని ఆడవి మధ్య మీకు కనువిందు చేస్తాయి, గులాబీ, తెలుపు రంగుల్లో విరబూసిన తామరలు గల చెరువులతో మీరు ఆ ఊరి పేరు అడగండి. అది కృష్ణపూర్, కాళీపూర్, సీతారాంపూర్ లేదా ఏదో ఒక హిందూ పేరు అయివుంటుంది. కానీ ఆ ఊర్లో, హిందువులెంత మంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. ఉంటే గింటే, అతి కొద్దిమందే ఉంటారు. మహా అయితే ఒక అరడజను మంది బెస్తవాళ్లు, ఒక మంగలి, ఒక చాకలి, అంతే! వారు కూడా అజ్ఞానంతో, అవసరంతో, పరిస్థితుల ఒత్తిడితో, ఒకటి రెండు తరాల తర్వాతో, ఇంకా ముందో, ముసల్మానులుగా మారిపోతారు.

ఊర్లోని ‘జమిందారు’ – అప్పు లిచ్చేవాడు సహజంగా హిందువులే అయి ఉంటారు. కాని వారి పరిస్థితి కూడా త్వరలోనే ప్రమాదంలో పడేలా ఉంటుంది.

బయటి నుంచి వచ్చిన వారికి ఒక బెంగాలీ గ్రామంలో, ప్రశంసించతగిన వారు జ్ఞానులైన బ్రాహ్మణులు (పండితులు), ఇంకా బాగా చదువుకున్న ఉన్నత కులీనులు అయివుంటారు. వారికి విశాలమైన బాహ్య ప్రపంచం గురించి అంతగా తెలియదు, ఫ్రాన్స్ లేదా ఇంగ్లాండులోని విద్యావంతులైన గ్రామీణుల్లాగా. కాని వారు ఎంతో సంస్కారవంతులు. స్వచ్ఛమైన భారతీతీయులు. ‘సంస్కృతి’ అనే పదానికున్న లోతైన అర్థాన్ని బట్టి చూస్తే, ఆ పండితులతో గంటల తరబడి వాదించడం ఎంతో సంతోషాన్నిస్తుంది. వారు ఒక నైరూప్యమైన విషయాన్ని గురించి మనసు విప్పి చెబుతారు. అప్పుడప్పుడూ ఉపనిషత్తుల నుండి, వేదాల నుండి, సంస్కృత భాషలోని కొన్ని సూక్తులను ఉదహరిస్తారు (వారికి అవన్నీ కంఠతః వచ్చినట్లు అనిపిస్తుంది). వారు మీతో ఎత్తైన చెట్ల క్రిందగాని, వెదురు గోడల  ఒక గదిలోగాని సంభాషిస్తారు. ఆ గదిలో కూర్చోడానికి ఒక చాప, అనేక పురాతన గ్రంథాలు తప్ప, మరేమీ ఉండవు. ప్రపంచం పుట్టినప్పటి నుండి, ఆధిపత్య వర్గానికి చెందిన వారు ఆ బ్రాహ్మణులు. వారి స్వభావం మధురం. వారి ప్రవర్తన స్నేహ పూర్వకం. వారు పేదవారే, కాని పరిశుద్ధులు. వారితో సాన్నిహిత్యం వల్ల, మనం ఇంత వరకూ ఎవరూ స్పృశించని, భారతదేశపు పార్శ్వాన్ని కనుకొన్నట్లుగా భావిస్తాం.

మైళ్ల కొద్దీ నడుస్తూ, గంటల కొద్దీ నదీ ప్రవాహాల్లో ప్రయాణిస్తూ, బెంగాలులోని హిందూ పేర్లుగల, తొంభై శాతం మహమ్మదీయ జనాభా గల ప్రాంతాల్లో తిరుగుతూ మనం ఒక గ్రామంలో కాసేపు ఆగుతాం. అక్కడున్న ఒకరిద్దరు పండితులతో మాట్లాడతాం. వారి జీవితం పరిపూర్ణ హైందవ, ప్రశాంత వాతావరణంతో కూడినది. వారు మీతో చెబుతారు. వారి చక్కని భాషలో అనేక శాస్త్రాల నుంచి సంస్కృత శ్లోకాలను ఉటంకిస్తూ, శాస్త్రాలకు వ్యాఖ్యానాలు చేస్తూ, భారతీయ ధర్మం  ఒక ‘సనాతన ధర్మ’ మని వారు మీకు స్పష్టం చేస్తారు

మీకు తెలుస్తుంది, గత నెలలో, ఆ ఊరి నామ శూద్రుడొకరు, ఇద్దరు ‘మాలీ’లు, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ఊరి నుండి, ముస్లిం మతంలోకి మారారని. ఆ నిమ్న కులాల వాళ్లు పోయినంత మాత్రాన భారతీయ ధర్మానికి, దాని సనాతనత్వానికి వచ్చిన హాని ఏదీ లేదని అనిపిస్తుంది.

పట్టణాల్లో, హిందువుల సంఖ్య, నిస్సందేహంగా, నిష్పత్తి పరంగా, పల్లెల కంటె ఎక్కువ. కాని, ఢాకా చిట్టగాంగ్ లలో కొన్ని ప్రాంతాలున్నాయి. ఎర్రనిటోపీ, గడ్డం ఉన్న వ్యక్తులను నీవు దాటుకుని వెళుతూన్నపుడు, మీరు కైరోలోనో, బాగ్దాద్ లోనో ఉన్నారని అనిపిస్తుంది, భారతదేశంలో కాకుండా.

చదువకున్న హిందువులు, చాలా మంది, తమ ఇళ్లలో భారతీయ  సంప్రదాయాలను సంస్కృతిని  సజీవంగా ఉంచుకుంటారు. వారితో కూర్చుంటే మాత్రం, మీరు భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి మీరు ఇండియాలోనే కదా ఉన్నారు ఇంకా, కాని సామాన్య ప్రజానీకం రోజు రోజుకూ ఇస్లామీకరణ చెందుతున్నారు.

ఢాకా లేదా చిట్టగాంగ్ లోని విద్యాధికులైన హిందువులకు మీరు ఈ విషయం చెప్పారనుకోండి. వారు కూడా, –

గ్రామాల్లోని బ్రాహ్మణులలాగే, భారతీయ ధర్మానికి  మరో పేరు ‘సనాతనధర్మం’ అని చెప్పవచ్చు. ఈ గడ్డాల వాళ్లు, ఎర్రటీపీల వాళ్లను చూడటానికి వాళ్లు అలవాటు పడిపోయారు. వారి సంఖ్య ఎంత వరకు పెరుగుతూందని వారు ఇంత వరకు వాకబు చేయలేదు. ఏ అంతుపట్టని మానసిక ప్రక్రియ ద్వారా, తమలో అంత వరకు ఒకడైన ఒక హిందువు, ఉన్నట్లుండి, గడ్డం పెంచి, టోపీ పెట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. తనను తాను ఒక ముసల్మానుగా పిలుచుకోవడం మొదలు పెట్టాడు అని కూడా తెలుసుకోడానికి వారెన్నడూ శ్రమపడలేదు. ఏ అంతుపట్టని మానసిక ప్రక్రియ ద్వారా, అతడు అసలొక ముసల్మాన్ అయినాడు, పూర్తి ముస్లిం చైతన్యంతో, తొలి పిలుపుకీ హిందువులపై కయ్యానికి దిగడానికి సిద్ధమైనవాడు ఎలా అయ్యాడు అని కూడా వారు తెలుసుకోరు.

వారు మాకు ఏమని చెబుతారంటే, ఆ ముస్లింలంతా నిమ్న కులాలకు చెందిన హిందువులు ఒకప్పుడు, అని. అది సహజంగా నిజమే. కానీ ప్రత్యేకంగా బెంగాల్ లోని హిందూ ముస్లిం సమస్యకు సంబంధించిన ఒకే ఒక నిజం మాత్రం కాదు.

ఆ లోటు వల్లనే, ‘నాణ్యత’కు ‘పరిమాణానికి’ మధ్య పాత వివాదం, భారతీయధర్మం  యొక్క సనాతనత్వం, చర్చలోకి వచ్చాయి. రెండింటిలో, మన మేధస్సు వెనుక, ఈ రెండు అంశాల మధ్య ఒక అయోమయం నెలకొని ఉంది. ఒకటి, ‘సత్యానికి’ సంబంధించింది. అది కాలానికీ, చోటుకూ అతీతమైంది. రెండవది ‘కర్మ’ ,  ‘విజయా’ లకు చెందింది. అది చారిత్రాత్మక పార్శ్వం. దానిలో స్థలకాలాలే అన్నీ.

‘సత్యం’ ఆదిభౌతికం, ఆధ్యాత్మికం. అందులో సందేహం లేదు. దాన్ని స్వీకరించే వాళ్ల సంఖ్య మీద అది ఆధారపడదు. ఆ సంఖ్య పెరిగినందు వల్ల అది మరింత ‘నిజం’గా మారదు. వారి త్యాగశీలత, లేదా ఇతర వ్యక్తిత్వ సుగుణాల వల్ల కూడా. వారి కనుకూలంగా, బలమైన విశ్వాసంగల వారిగా, అది సాక్షిభూతమవుతుందే కాని, ఆ సత్యం విస్తరించబడటం కాని, మారడం గాని, ఉండవుగాక ఉండవు. ఒక అమరవీరుడు, తన మరణం ద్వారా, తాను ఏ సత్యం కొరకు మరణించాడో, దాన్ని ఋజువు చేయలేడు. అతని వ్యక్తిగతమైన నిలకడతనాన్ని మాత్రమే నిరూపించుకుంటాడు అంతే.

సౌందర్యం, పరిపూర్ణత, ఇంకా ఇలాంటి నైరూప్యమయిన గుణాలన్నీ ఒకే విధంగా తాత్వికమైనవి, ఆదిభౌతికమైనవి. వాటిని ‘సమర్థించడం’ కేవలం సమయాన్ని వృథా చేయడమే. అవి తమ సంగతి తాము చూసుకోగలవు. సనాతన ధర్మమైన భారతీయ ధర్మం  (అంటే, అనేకమైన శాస్తాల్లో, సూత్రాల్లో వ్యక్తం చేయబడిన ‘సత్యం’, ఉపనిషత్తులలోని వివేకం, వేద మంత్రాలలోని మహిమ) తన బాగు తాను చూసుకోలగదు. దాన్ని సమర్థించాల్సిన పని లేదు. ఒక వేళ రేపటి రోజు భారతదేశమంతటా ఇస్లాం ప్రవచించబడినా, భారతీయధర్మం  పూర్తిగా అదృశ్యమైనా, కొన్ని అనివార్య విపత్తు వల్ల అనుకుందాం, పెద్ద తేడా ఏమీ ఉండదు. జాగృతమైన, చైతన్యం పొందిన ప్రపంచం భారతీయ   పవిత్ర గ్రంథాలను పరిరక్షిస్తుంది. ఎందుకంటే అవి పరిరక్షించాల్సినవి కాబట్టి.

ప్రపంచం ఒక వేళ వాటిని పరిరక్షించలేకపోయినా, వాటిలోని ‘సత్యాన్ని’ అది నెమ్మదిగా తిరిగి కనుక్కుంటుంది. కాబట్టి, భారతీయధర్మం సూత్రాలు సిద్ధాంతాల గురించి మనం ఇబ్బంది పడడం అంత మంచిది కాదు. అవేమి ప్రమాదంలో లేవు.

ఒక దేశంగా, ఒక జాతిగా, లుప్తమయ్యే ప్రమాదంలో ఉన్నవారు భారతీయులే!  ఇది కనీసం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. కాబట్టి మనం భారతీయధర్మాన్ని, , భారతీయతను సమర్ధించాల్సివుంటుంది.  భారతీయధర్మం సనాతనమైనదైతే, భారతీయత  కూడా అలాంటిదేని ఋజువు చేసేదేమీ లేదు. భారతీయత  యొక్క సంఖ్యాపరమైన, రాజకీయపరమైన శక్తి, భారతీయధర్మం  విలువను  నిస్సందేహంగా, ఏ మాత్రం పెంచదు. కాని తద్విరుద్దంగా, భారతీయధర్మం  యొక్క విలువ భారతీయతను  కాపాడదు, భారతీయత గనుక సంఖ్యాపరంగా, రాజకీయపరంగా బలమైనది కాకపోతే.

ప్లేటో రచనలోని ‘సత్యం’ ఇంకా నిజంగానే ఉంది. కాని, అది పురాతన గ్రీకు సమాజాన్ని,  నాగరికతను గతించిపోకుండా ఆపలేకపోయింది. అలెగ్జాండ్రియాలోని పాగనత్వాన్ని హైపాషియా జీవిత సౌందర్యం కాపాడలేదు.

ఎవరైనా ఉత్తర, తూర్పు బెంగాల్‍లో సంచరిస్తే (హిందువులు జనాభా 25 శాతం కంటె తక్కువ ఉండే ఇతర ప్రాంతాల గురించి మాట్లాడాల్సిన పని లేదు) వారికి చాలా వరకు అర్థం అవుతుంది. తొలి మధ్యయుగ కాలంలో, క్రైస్తవం రోజు రోజుకూ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూంటే, పూర్తి చైతన్యవంతుడైన ఒక గ్రీకు సనాతనవాది, తన సొంత దేశంలో, ఎటువంటి భావాలకులోనై ఉంటాడో!

ఎందుకంటే క్రైస్తవ మతం ప్రజలను గెలుచుకుంది. తొలి నాట క్రైస్తవులు ఎన్ని అవమానాలను, నిరాదరణను అనుభవించారో  కాని,  చివరి సనాతన వాదులు క్రిస్టియన్ల చేతుల్లో ఎంత అణచివేతకు గురయ్యారో మాత్రం  క్రైస్తవ మతం అసలు చెప్పదు. కాన్‌స్టాంటయిన్ (ప్రథమ) రోజుల్నుండి, జస్టినియన్ రోజుల వరకు, క్రైస్తవ మతం ఒక అధికారిక, రాజ్యమతంగా ఎదిగేంత వరకు, కళాఖండాలు నాశనమయ్యాయి, పండుగలు పబ్బాలు ఆగిపోయాయి, వేదాంతాన్ని బోధించే విద్యాలయాలు మూతబడ్డాయి, జ్ఞానులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇది ఎంత త్రీవంగానైనా మనకు కనబడవచ్చు. పదిహేను వందల సంవత్సరాల క్రిందట జరిగాయి కాబట్టి, అవన్నీ పెద్ద ప్రాధాన్యం లేని వానిగా కనిపించవచ్చు. కాని క్రిస్టియన్ల దుర్మార్గంతో వాటిని పోల్చిచూడాలి (రోజు రోజుకూ సంఖ్యాపరంగా, ప్రభుత్వ మద్దతు వల్ల వారు మరింత బలపడ్డారు). గ్రీసు, ఆసియామైనర్, ఈజిప్టు, ఇటలీ దేశాలలోని పల్లెల్లో, పట్టణాల్లో, అప్పటికీ మైనారిటీలో ఉన్న సనాతన వాదుల సంఖ్య మరింత క్షీణించింది.

మతోన్మాదులైన క్రైస్తవ సన్యాసులు, జ్ఞాని సద్గుణ సంపన్నడైన హైపాషియా మహాశయున్ని, అనాగరికంగా చంపినపుడు, మనం తీవ్రమైన ఆగ్రహానికి గురవుతాం. కాని హైపాషియా (Hypatia) ఒక్కరే కాదు బలయింది  ఆ రోజుల్లో క్రిస్టియన్లకు, సనాతన వాదులకు మధ్య ఎన్నో కలహాలు, పోట్లాటలు, ఉండేవి. గ్రీకు వేదాంతాన్ని ప్రజలకు బోధించేటపుడు, వారి దేవతల గౌరవర్థం, వారు శాంతియుతంగా ఊరేగింపులు జరుపుతున్నపుడు క్రైస్తవ దుండగులు వారిపై దాడి చేసేవారు. అవి ఎంత వరకు పెచ్చరిల్లాయంటే, స్వేచ్ఛాయుతమైన ప్రతి గొంతూ నొక్కబడేంత వరకూ, సనాతనుల జీవితాల్లోని ప్రతి ప్రజాప్రదర్శన పూర్తిగా ఆగిపోయేంత వరకు.

సనాతనుల జీవితాన్ని ఆపివేయడం అంత సులభం కాదు. కొంత వరకు సనాతన జీవన విధానం, వారి పండుగలు, క్రైస్తవ మతం ముసుగులో కొనసాగాయి (క్రైస్తవ మత వ్యవస్తను ఒక సారి పరిశీలిస్తే మీకిది అవగతం అవుతంది). ఇది కాక, గ్రీసు, క్రెటె దేశాల్లోన కొన్ని మారుమూల పల్లెల్లో, క్రీ.శ. పదకొండో శతాబ్దంలో, తమ పురాతన జాతీయ మతాన్ని గురించి ప్రవచించే వాళ్లు ఇంకా ఉండేవారని అంటారు. క్రీ.శ. 15వ శతాబ్దంలో నియోప్లాటోనేసియన్లలో చివరి వాడైన ‘గెమిస్టోస్ ప్లెధాన్’ (Gemistos Plethon) గ్రీసుదేశంలో నివసిస్తూ ఉండేవాడట (సుదూర ఉత్తర ఐరోపా, తన యోధుని వంటి సనాతనత్వాన్ని గురించి అంతగా తెలియక, మధ్యధరా ప్రపంచం కంటె చాలా తొందరగానే, వ్యగ్రతతోనే, క్రైస్తవ మతసిద్ధాంతాలను స్వీకరించింది. అది క్రైస్తవమతంతో బంధాన్ని చాలా ఆలస్యంగా పొందినా కూడా).

క్రైస్తవం ఆధిపత్యపు తొలి రోజుల్లో, పాశ్చాత్య ఆర్యనాగరికతలకు ఏ గతి పట్టిందో, ఈనాటి భారతీయులు  లోతుగా పరిశీలించడం మంచిది. తూర్పు బెంగాల్ గ్రామాలలో, 90 శాతం మంది ముస్లింలున్న చోట భారతీయధర్మానికి  ఇంకా ప్రతినిధులుగా ఉన్న అతి తక్కువ మంది జ్ఞానులైన పండితులున్నారు. వారిలాగే, పాశ్చాత్య దేశాల్లో, ఎనిమిది లేదా తొమ్మిది వందల ఏళ్ల క్రితం, సనాతన గ్రీకు తత్వానికి ప్రతినిధులైన కొందరు జ్ఞానులుండేవారు. వారు, అత్యంత హేయమైన అధిక సంఖ్యాకులైన క్రైస్తవుల ప్రాబల్యపు, శతృత్వపు ప్రభావంలో ఉండి కూడా, తమ సనాతన ధర్మాన్ని వదలలేదు.

***

‘గ్రీకు తత్త్వవిచారం’ ఇంకా సజీవంగానే ఉంది. గ్రీకుల సనాతన బహుదేవతారాధన, ఒక సత్య, సుందర విషయంగా, అర్వాచీనం. కాని గ్రీకుల సనాతనత్వం మాత్రం గతించిపోయినట్లే కనబడుతుంది.

భారతదేశంలో, ఎన్నో చోట్ల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. కాని భారతీయ  జీవితం ఇంకా ఉంది.

గ్రీసుదేశం అబ్బురపరచే శిధిలాలతో నిండి ఉంటుంది. నిలువుగా ఉన్న దైవ మందిరాల్లో, ఇంకా తెల్లని స్తంభాల వరుసలు అగుపిస్తాయి, ద్వీపాలతో నిండిన వినీల సముద్రాన్ని చూస్తూ. కాని సజీవ జీవితం చుట్టూరా, విభిన్న రకాలుగా, నడుస్తూ ఉంటుంది. జాతీయ దేవతామూర్తులు, వస్తు ప్రదర్శనశాలలో, ప్రశంసార్హమైన వస్తువులుగా ఉన్నారు. వారిని చూడడానికి ఆమెరికా నుంచి విదేశీయులు వస్తారు. కానీ, ఎవరూ వారిని పూజించరు. అకరోపోలిస్ నగరంలో, అత్యంత వైభవంగా జరిగే, ఊరేగింపులు ఇప్పుడు లేవు. అవి పూర్తిగా పాలరాతితో నిర్మితమైన, ఏథెన్స్ నగరంలోని, గొప్ప స్టేడియంలో జరిగేవి.

అదే రకంగా ఇటలీని కూడా చెప్పకోవచ్చు. అసలైన క్రైస్తవం దురదృష్టం ఏమోగాని, సనాతన ధర్మం దాని ‘చర్చిని’ చాలా మటుకు ఆక్రమించింది. కాని పాగనిజం అనేది కేవలం ఒక ప్రదర్శన కాదు. దానిలో, ఇటలీ నుండి, గ్రీసు నుండి నిష్క్రమించినది ఏదో ఉంది. అది సనాతనత్వం యొక్క జాతీయ స్పృహ.

చాలాకాలం క్రితం భారతదేశంలాగే కనిపించిన ఈజిప్టును గురించి కూడా, మనం ఇదే విషయాన్ని చెప్పుకోవచ్చు. అక్కడ పవిత్రమైన వృషభరాజాన్ని ఆరాధించేవారు. నైలు నదిని తమ వృద్ధుడైన తండ్రిగా గౌరవించేవారు, భారతీయులు  గంగామాతను పూజించినట్లు. నైలునదిని వారు, స్వర్గం నుంచి దిగి వచ్చి, తమకు జీవజాలాన్ని ప్రసాదించే దేవతగా బావించేవారు.

ప్రస్తుతం, నైలు నదీ తీరం వెంబడి, పిరమిడ్లు, దైవమందిరాలు, గులాబీరంగు గ్రానైట్‌తో చెక్కబడిన పెద్ద పెద్ద విగ్రహాలున్నాయి. అవి ఈజిప్టు దేవతలవి. కాని, ఆ శిధిలాల ఛాయలో ప్రస్తుతం నివసించేవారు ముస్లింలు. వారిలో కొందరు క్రైస్తవులు, వారిలో కొందరు, ఈజిప్టును సందర్శించే విదేశీ యాత్రికులకు మార్గదర్శకులుగా గూడా ఉన్నారు. వారు అమెరికా వారిని, ఆ ఘనమైన స్తంభాలవెంట, శిలాఖండాల వెంట తిప్పుతారు. వారితో ఇలా చెబుతారు “ఇది ‘ఫ్తా’ మందిరం.. ఇది ఆ దేవుని ప్రతిమ.. ఇది మౌత్ అనే దేవుని విగ్రహం, ఇది అతని రాణిది..” అలా.. ఏ రాజు ఏ దేవాలయాన్ని నిర్మించాడో వారు వివరిస్తారు. విగ్రహాల సౌందర్యాన్ని గమనించమని కోరతారు. ఈజిప్టు వైభవాన్ని, బాధ్యతాయుతంగా చూపుతారు. కాని, వారి పూర్వీకుల వైభవం వారిది కాదు. వారు మరో దేశపు పిల్లలు, శిధిలాలలో పెరిగినవారు. అదే భూమి, వేరొక దేశం. అవే శిలలు. వాటి అర్థం తెలియకుండా. అదే నైలు నది, దాని పట్ల ఆరాధన లేకుండా.

ఒక ఆధునిక బహుదేవతారాధకుడు కొన్ని సంవత్సరాల క్రిందట ఈజిప్టుకు వచ్చాడట. అతడు మొదట చేసిన పని ఏమిటంటే, నైలు నది వెంబడి నడవటం. దాని ప్రవాహంలో పువ్వులు వేయడం, వంగి నదీ జలాన్ని కాసింత తాగి, మరి కొంత నెత్తిన జల్లుకోవడం. “నైలు నదీ, మా వృద్ధజనకుడా, నీవు సుందరుడవు. లక్షల జీవరాశులకు నీవు జీవితాన్ని ఇస్తావు. కాని, ఎన్ని శతాబ్దాలయింది ఎవరూ నీకు నమస్కరించక? ఎవరూ నిన్ను పూజించక? నేను సంపూర్ణంగా నీకు మోకరిల్లుతున్నాను.”

అతడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉండగా, అతనికో ఆలోచన వచ్చింది. ఈ మండుతున్న ఇసుక తిన్నెలకు దూరంగా, ఈ సముద్రానికి దూరంగా, వారింకా మరచిపోని ఒక భూమి ఉంది. అదే భారతదేశం! గంగా మాతకు మోకరిల్లే దేశం! హారతులిచ్చే దేశం! భారత దేశానికి జయమగుగాక!

***

అదే, దూరం నుంచి గోచరించే భారతీయత. ఎవరైనా బలహీనంగా ఉన్న భారతదేశాన్ని, రోజూ శత్రువుల సైన్యాలకు లొంగిపోతూ ఉన్న దాన్ని, దాని బహుళ ప్రయోజనాలను కొంచెం కొంచెంగా కోల్పోతూ ఉన్న దాన్ని, దాని రాజకీయ హక్కులు, మొత్తంగా ఒక దేశంగా పోగొట్టుకుంటున్న దాన్ని చూస్తే, వారికి మరింత అనుమానం వస్తుంది. సనాతన ఇటలీ, సనాతన గ్రీస్, సనాతన ఈజిప్టులకు ఈ రోజు పట్టిన గతే రేపు భారతదేశానికి కూడా పడుతుందేమోనని! కావచ్చు! బెంగాలులోని భారతీయతకేమయిందో చూడండి.  ఉదాహరణకు కొద్ది సంవత్సరాల క్రిందట, బెంగాలులో హిందువులు, జనాభాలో 55 శాతం ఉండేవారు. ఇప్పుడు వారు 45 శాతం మాత్రమే. మరో రెండు వందల సంవత్సరాల్లో, వారి శాతం ఎంత వుండబోతుందో ఎవరికి తెలుసు? మరో ఐదువందల సంవత్సరాల్లో, భారతీయుడనేవాడు  లేకుండా పోయినా ఆశ్చర్యంలేదు. అప్పుడు, ఒక మహమ్మదీయ గైడ్ (తరతరాల బెంగాలీ హిందువుల వారసుడైన బెంగాలీ), శిధిలమైన దక్షిణేశ్వర్ దేవాలయాన్ని అమెరికన్ యాత్రికులకు చూపిస్తూ ఇలా అంటాడు “ఇది కాళీ మందిరం. ఆమె భారతీయుల దేవత.”

చిన్న చిన్న మందిరాల స్థానంలో అక్కడక్కడా మసీదులు నిర్మిస్తారు. మహమ్మదీయ, యూరోపియన్ జీవితశైలులు రెండూ కలసిపోయి, ఒక గుర్తు పట్టలేని భారతదేశం ఏర్పడుతుంది. ఆధునిక ఈజిప్టులాంటిది. సంస్కారవంతులైన భారతీయులు తమ దేశపు దేవుళ్లను, దేవతలను, క్రైస్తవ యూరోపియన్లు గ్రీకు పురాణాలను చూసినట్లు చూస్తారు. గంగానది ఇంకా ప్రవహిస్తూనే ఉంటుంది. కాని దానిలో పవిత్ర స్నానాలు ఉండబోవు. దాని ఘాట్లలో మెట్లెక్కి దిగే యాత్రికులూ ఉండరు. నదిలోకి విసిరే, పూలదండల నివేదనలూ ఉండవు. కాని, ‘ఆమె’ మన భారతదేశం ఎంత మాత్రం కాదు.

అలా అయినప్పుడు, భారతీయులకు కావాల్సిందేమిటి? అదేనా? ఎంత మాత్రం కాదు. కాని వారిలో ప్రతిస్పందన లేకపోతే, జరగబోయేది మాత్రం అదే. మరీ మించిపోక ముందే వారు మేలుకోవాలి.

పరిమాణం కంటె నాణ్యత మెరుగైనదని మనం నమ్ముతాం. కాని, దానికి కావలసిన వాతావరణం లేనప్పుడు, నాణ్యత అదంతట అదే ఎదగలేదు. హిందువుల సంఖ్య తగ్గే కొద్దీ, భారతదేశంలోని భారతీయ వాతావరణం ప్రమాదంలో పడుతుంది. ఇది కనీసం దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనైనా సంభవం కావచ్చు. దాన్ని వెంటనే పరిరక్షించుకోకపోతే, భారతీయుల ‘నాణ్యత’ అనేది కేవలం కొద్ది మంది వ్యక్తుల వెలలేని సంపద అవుతంది. తమ సొంత దేశంలో వారు కొత్త వారవుతారు. ఒక సజీవ దేశపు సంపదగా భారతీయ వాతావరణం ఇక ఏ మాత్రం ఉండబోదు. (దేశ విభజన తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో జరిగిన సంఘటనలు, అక్కడ దేవాలయాలకు పట్టిన గతీ, 1939లో సావిత్రీ దేవి చెప్పినది చేదు నిజమని నిరూపిస్తాయి)

భారతీయత  ఇప్పుడు ఏ దశకు చేరుకుందంటే, అది నాశనమన్నా కావాలి, లేదా తీవ్రంగా ప్రతిస్పందించాలి. కేవలం ఉనికి కోసం కాదు, పాలించడం కోసం. మరి ఇక మూడో ప్రత్యామ్నాయం లేదు.

భారతీయత  నశించి పోతే, భారతదేశం ఇక ముందు భారతదేశంగా ఉండబోదు. కాని అది ఎదురుతిరిగి, పరిపాలించాలంటే?

చాలా మంది హిందువులకు వారి అత్యంత కీలకమైన ప్రస్తుత సమస్య పట్ల ఆసక్తి లేదు. బ్రతకాలా, చావాలా? అనేంత తీవ్రత వారికి పట్టదు. ‘బ్రతకడం’ అనే భావనను తగినంత విస్తృతంగా వారు భావించలేదు. ఒక దేశం, జాతి బ్రతకాలంటే, అది పాలనాధికారం కలిగి ఉండాలి. భారతీయ  నాయకులు మరీ మరీ చెప్పినట్లుగా, భారతీయులు ఒక వర్గం కాదు, ఒక జాతి, ఒక దేశం! తమ ఉనికిని గురించిన స్పృహలేని దేశం వారు. కాని వారు ఒక దేశమే. నిద్రపోతున్నవాడు కూడా మనిషే కదా! భారతీయులు  మేలుకోకపోతే ఏం జరుగుతుందో, ఎవరూ చెప్పలేరు.

మొదట, భవిష్యత్ భారతం, ఒక తిరిగి జయించబడిన, భారతీయ దేశం కావాలి. దాని కంటె మించింది ఏముంటుంది?

తన చేతిలోనే, తన పరిమాణానికి తగినంత అధికారాన్నంతా కలిగిన, సువ్యవస్థీకృతమైన,   భారతాన్ని ఊహించుకుందాం, ఒకప్పుడది ప్రస్తుతమున్న ఆప్ఘనిస్తాన్, జావా, కంబోడియాలను దాటి విస్తరించి ఉండేది. ధృతరాష్ట్రుని భార్య గాంధారదేశపు రాకుమారి. గాంధారమంటే ఆఫ్ఘనిస్తాన్. అప్పటి జావా, కంబోడియా పాలకులు భారతీయ రాజులే. ఒక శక్తివంతమైన  భారతం, ఆ ప్రాంతాలన్నింటినీ పునర్విజితాలు గావించి, భారత నాగరికత యొక్క వైభవాన్ని వారికి తిరిగి ఇవ్వగలదు. ఆమె ఘనమైన భారతదేశాన్ని ఒక సాంస్కృతిక వాస్తవంగానే కాక, ఒక రాజకీయ శక్తిగా కూడా చేయగలదు. ఎందుకు చేయలేదు?

ఏమో, ఎవరికి తెలుసు? ఆమె ఇంకా ఇంకా తన పేరు ప్రఖ్యాతులను విస్తరించి, తన బలాన్ని నిర్ధారించి, తన వైభవాన్ని స్థాపించి, కోల్పోయిన ప్రాంతాలలోని మహాసంస్కృతిని, ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రాంతాల ప్రజలకు తిరిగి ఇస్తుందేమో? పతనమైన పాశ్చాత్య ఆర్యనులకు వారి విస్మృత సనాతనత్వానికి అర్థాన్ని చెబుతుందేమో? ఎక్కడెకంత నశించిపోయిన ప్రకృతి ఆరాధనలను, యువశక్తిని బలాన్ని ప్రతిఫలించే ఆరాధనలను పునర్నిర్మిస్తుందేమో? ప్రపంచస్థాయిలో, జూలియన్ చక్రవర్తి సాధించడానికి ప్రయత్నించిన దాన్ని సాధిస్తుందేమో? సూర్యదేవుడు, తన డెల్ఫీ ద్వారా అసాధ్యమని తేల్చేసిన దాన్ని సాధిస్తుందేమో? ఎవరికి తెలుసు?

విజయోత్సాహుతైన భారతీయులు జూలియన్ ప్రభువుకు ఒక విగ్రహాన్ని, పునర్విజితమైన ఐరోపాలో, సముద్రతీరంలో నెలకొల్పుతారు. దాని క్రింది, సంస్కృంతంలో, గ్రీకు భాషలో ఇలా చెక్కబడి ఉంటుంది.

“నీవు కలగన్నదానిని

మేము సాధించాం!”

ఇదంతా ఉహ తప్ప మరేమీ కాకపోవచ్చు. అలా ఐనా, గొప్ప విషయాలను సాధించడానికి ఊహ అవసరమే. అది తాత్కాలిక ఆపదలను దాటి నిన్ను చూడగలిగేలా చేయగలదు, ఆనందంగా పొరాడగలిగేలా చేయగలదు.

తను తాను కాని ఒక చీకటి దృశ్యానికీ, నిజమైన తన వైభవోపేతమైన గొప్ప భారతదేశానికీ మధ్య, ఏది కావాలో, భారతీయులు ‘ఇప్పుడే’ తేల్చుకోవాలి. ఇప్పుడే! ఒకానొక సమయంలో అసాధ్యంగా కనిపించే విషయాలు సైతం సుసాధ్యాలవుతాయి. ఆ కాలం గతించిపోతే మటుకు, మించిపోయినట్లే. రేపు అనేది చాలా ఆలస్యమైనది. ఉత్తర, తూర్పు బెంగాల్‌లో భారతీయత  కాపాడటం తక్షణం జరగాలి. ప్రపంచాన్ని పునర్నిర్మించే మాట తర్వాత! అది కూడా గొప్ప భారతీయ  ప్రేరణతోనే సాధ్యం.

(ఇంకా ఉంది)

Exit mobile version