[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘దుఃఖం చెలమ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
చెట్టూ ఒంటరే,
పక్షి వాలని చెట్టు కొమ్మా ఒంటరే,
చెట్టు కింద అనుభవాల ముడతలతో,
వార్ధక్య వధ్య శిలపై నున్న,
మునిమాపు ఒంటరే!
దూరంగా ఉన్న
పాడబడ్డ బావి ఒంటరే!
ఖాళి గడపలతో కాలం గడిపే
గ్రామం ఒంటరే!
మానవ స్పర్శ దూరమై,
శీతల స్పర్శ చేరువై,
ఏ వాణి వినిపించుకోని
చరవాణుల సందోహానికి
అక్కడున్న చరమ దేహం
ఉనికి కానరాదు!
చెలిమి చేరువ కానప్పుడు,
బావురుమన్న,
దుఃఖం చెలమలనుండి
కన్నీరు స్రవిస్తుంది!
మానవత మృగ్యమైన ఎడారిలో
ఇంకిపోతుంది!
