Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ద్వంద్వాలను సహించడమే ఆధ్యాత్మిక విజయానికి తొలిమెట్టు

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ద్వంద్వాలను సహించడమే ఆధ్యాత్మిక విజయానికి తొలిమెట్టు’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః।
ఆగమాపాయినోద్యనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత॥
(భగవద్గీత 2 వ అధ్యాయం, 14 వ శ్లోకం)

అర్జునా, ఇంద్రియాలు మరియు ఇంద్రియ వస్తువుల మధ్య సంపర్కం భౌతికమైన ఆనందంతో పాటు దుఃఖం కూడా కలిగిస్తుంది. ఇవి శాశ్వతం కానివి, శీతాకాలం మరియు వేసవి కాలం వలె వస్తాయి మరియు వెళ్తాయి. ఓ భరత వంశస్థుడా, మన మనస్సులకు, మన జీవితానికి భంగం కలగకుండా వాటిని సహించడం నేర్చుకోవాలి, దృఢమైన అంటే తత్వదర్శి అయిన సాధకుడు దుఃఖాలు మరియు సంతోషాలను ఒకేలా భావించేవాడు, ఇవి ఎవరికి భంగం కలిగించవు, అతను మాత్రమే పూర్ణ పరమాత్మ యొక్క ఆనందానికి అర్హుడు అన్నది పై శ్లోకం లోని భావం.

తీవ్రమైన సాధన ద్వారా ద్వంద్వాతీత స్థితికి చేరుకోవాలని భగవానుడు మానవాళికి పై శ్లోకం ద్వారా సూచించాడు శ్రీకృష్ణుడు.

మన వేదాలు మనకు నిర్దేశించిన కర్మలను సరిగ్గా నిర్వర్తించడంలో, ఆనందం మరియు బాధల యొక్క శాశ్వతమైన కష్టనష్టాలను సహించడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం యొక్క సాఫల్యతను సాధించగలుగుతాము.

ఈ సకల చరాచర దృశ్యమాన ప్రపంచం ఒక గొప్ప భ్రమ, మిథ్య అని, ఇది ఒక నాటకరంగం వంటిదని ఇందులో మనమందరం పాత్రధారులమని తెలియనివారు ఇంద్రియాలు మరియు మనస్సు యొక్క అనుభవాలను వాస్తవమని భావించి, వాటిని తమపై తాము విధించుకుని, వారి జీవితమంతా బాధలు అనుభవిస్తారు. అయితే ఈ మార్పులు శరీరానికి మాత్రమే సంబంధించినవని మరియు వాటి ద్వారా ‘నేను’ ప్రభావితం కాకుండా ఉంటాయని తెలిసిన వారు సుఖదుఃఖాల నుండి విముక్తులవుతారు మరియు అలాంటి సాధకులు  ఎల్లప్పుడూ ఆనందంగా జీవిస్తారు.

మన విద్యుక్త ధర్మాలను చక్కగా నెరవేర్చడంలో మనకు ఎదురయ్యే తాత్కాలికమైన అడ్డంకులను, కష్టనష్టాలను, సుఖదుఃఖాలను సహించదంలోనే మన విజయం ఆధారపడి వుంటుందన్న సంగతి మనో శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేస్తున్నారు.

ఉన్నత ఆధ్యాత్మికానుభవ ప్రాప్తికి కోసం చిత్తశుద్ధితో, పవిత్రమైన మనస్సుతో, స్థిర నిశ్చయం కలిగిన సాధకులు సుఖదుఃఖాలను ఎట్టి మనోవికారాలు లేక సహించగలిగినవారు తప్పక మోక్షాన్ని పొందడానికి అర్హత పొందుతారు. కాని అట్టి కష్టాలను సహించలేనివారికి తాత్కాలిక విజయాలు లభించినా శాశ్వత భగవత్ ప్రాప్తి లభించడం దాదాపు అసాధ్యం.

Exit mobile version