[శ్రీ. మిరియాల గారు రచించిన ‘ఏకాంత తీరాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రపంచం నిశ్శబ్దమైంది,
నన్ను నేను కలుసుకునేందుకు!
ఏకాంతమంటే ఒంటరితనం కాదు,
ఆత్మను పలకరించే అద్భుత క్షణం.
కోలాహలం సద్దుమణిగాక,
మనసు పొరల శక్తులు మేల్కొన్నాయి.
సుదీర్ఘ శూన్యంలోనే..
నా ధైర్యం ప్రాణం పోసుకుంది.
కొండంత అండ దూరమై,
లోకం నన్ను నిశ్శబ్దంలోకి నెట్టింది.
కానీ.. ఆ కఠిన రాత్రుల్లోనే,
నా అస్తిత్వపు విలువ తెలిసింది.
సానుభూతి కోసం ఎదురుచూడను,
నా గాయాలకు నేనే మందు వేసుకుంటాను.
తాత్కాలిక బంధాల కంటే,
ఈ ఒంటరితనం నేర్పిన నిజాలే మిన్న.
నిశ్శబ్దం నన్ను బలహీనపర్చలేదు,
నా ఆలోచనలను పదును పెట్టింది.
బాధల సుడిగుండాల నుండి,
గెలుపు కెరటమై పైకి లేపింది.
ఈ ఏకాంతమే నా ఆశ్రయం,
నన్ను గెలిపించే ధైర్యాల నిలయం.
ముసుగుల లోకంతో నాకేంటి?
అంతర్గత శక్తే నా తోడు,
ఆత్మవిశ్వాసమే నా ఊతం!
