[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘హృదయ సామ్రాజ్ఞికి ఓ విన్నపం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మ
ఊహాజనితమైన ఓ పదార్థమే!
ఓ దివ్యతేజమూర్తిని
నా మది మందిరంలో ప్రతిష్ఠించి
నిత్యనీరాజనాలు సమర్పిస్తూ
హృదయారాధనలో మునిగిపోయాను!
కానీ.. ఇదేమి విచిత్రమో..
నా జీవన యానంలో
విభిన్న పాత్రలు పోషిస్తూ
నా అడుగులో అడుగులేస్తూ
నా మాటల చిరుజల్లుల్లో తడుస్తూ
నా సమస్యల సంద్రాన్ని నాతో కలిసి ఈదుతూ..
నా కన్నీటి ప్రవాహంలో నాతో బాటే కొట్టుకుపోతూ..
అనంతమైన ఈ జీవన సాగరాన్ని
నీ ప్రేమ గంగాజలంతో పునీతం చేసి
విలువైన జీవన గమ్యంలో
నన్ను ‘రాజు’ లా నిలిపి..
మన సంసార సామ్రాజ్యానికి
‘సామ్రాట్టు’ను చేసిన నిన్ను మాత్రం..
నా హృదయ ‘సామ్రాజ్ఞి’గా గుర్తించలేకపోయాను!
సమస్యల తేనెటీగలు చుట్టుముట్టాయని బెదిరిపోలేదు
సంప్రదాయ సంకెళ్ళను తెంచుకొని పారిపోలేదు
బంధాలను గౌరవించి
రక్త సంబంధాలకు విలువనిచ్చి
ప్రతి.. ప్రతిఘటననూ ప్రేమమయంగా మలుచుకొని
నీ జ్ఞాపకాల దొంతరల్లో భద్రపరచుకోని
భరించలేని వేదనను సైతం
నీ గుండెలోతుల్లో దాచుకోని
కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా
పంటి బిగువున కన్నీళ్ళను అదుపు చేసుకొని
మా కోసం హృదయ పరిమళాలను వెదజల్లావు!
భౌతికంగా బలహీనురాలివేగానీ..
మానసికంగా దృఢమైన సంకల్పబలం
నిన్ను మహోన్నతమైన వ్యక్తిత్వంతో
ఆకాశం అంచులతో నిలబెట్టింది!
ఓర్పు నీ ఆయుధమై అలరారుతోన్న వేళ..
నిరంతర కృషితో నిస్వార్థ త్యాగమూర్తివై
కలల కడలిలో మునిగి పోతున్న
కుటుంబ జీవన నౌకను
ప్రశాంత బ్రతుకు తీరానికి చేర్చావు!
ఓ సౌభాగ్యవతీ..
ప్రేమాన్విత సుందరమూర్తీ..
నీ పాదధూళిని నా శిరస్సున దాల్చి
నీ పాదాల చెంత..
నా ప్రాణాలు విడిచి పెట్టాలని
అత్యంత ప్రీతికరమైన..
నా కడ కోరిక!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
