[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 3వ భాగం.]
ప్రశ్నలు:
21.
కూస్తే అలారం
కోస్తే ఆహారం
‘కొక్కొరకో’ అంటూ
ఇళ్ళ చుట్టూ విహారం
22.
ఎగురుతాయి, రెక్కలుంటాయి!
కానీ పక్షులు కావు
ఆహారపదార్థాలు, కుళ్ళిన చెత్త
ఏదైనా సరే వాలిపోతాయి
చెప్పండి, మరి ఏమిటవీ?
23.
మనిషి నెత్తినెక్కి తిరుగుతుంది
తలంతా కొరుక్కుతింటుంది
పచ్చిరక్తం తాగుతుంది
గోళ్ళ మధ్య ఇరుక్కొని
చిటుక్కుమని చస్తుంది
24.
తీపి ఎక్కడున్నా పసిగట్టి
దండుతో దండయాత్ర చేస్తుంది
దాని బంగారు పుట్టలో
వేలెడితే కుడుతుంది
25.
పేరుకు పిట్టేగానీ
చెట్లను చెక్కుతుంది
కొయ్యపని వారి వృత్తిని
ఇంటి పేరు చేసుకుంది
26.
ఇంటిపై పెంకులున్నట్లు
ఒంటిపై పెంకుండేది ఏది?
నీటిలో నివసిస్తూ
ఇసుకలో గుడ్లు పెట్టేది ఎవరు?
27.
పేరులో కృష్ణుడుంటాడు
రూపంలో జింకలా ఉంటుంది
మన ఆంధ్ర రాష్ట్ర జంతువు
కనిపెట్టారా పిల్లలూ!
28.
నేను మనుషుల మీద పడితే
శాస్త్రాలు చూసుకుంటారు
తినే పదార్థాల్లో పడితే
యమపురి చేరుకుంటారు
నేనెవరో చెప్పండి పిల్లలూ!
29.
ఇంటికి కాపలా కాస్తాను
విశ్వాసానికి మారు పేరును
తోక ఊపుకుంటూ తిరుగుతాను
దొంగలొస్తే మొరుగుతాను
మరి నేనెవరినో చెప్తారా?
30.
ఎండాకాలమైనా, చలికాలమైనా
ఉలెన్ స్వెట్టర్ వేసుకునే ఉంటుంది
వంచిన తల ఎత్తకుండా నడుస్తుంది
అన్నింటిదీ ఒకేమాట, ఒకే బాట
జవాబులు:
21. కోడి 22. ఈగ 23.పేను 24. చీమ 25. వడ్రంగి పిట్ట 26. తాబేలు 27. కృష్ణజింక 28. బల్లి 29. కుక్క 30. గొర్రె
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.