Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన రమణీయం-188

టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.

రిగ్గా ఒక నెలకే రెంట్‍కి తీసుకున్నాడు గెస్ట్ హౌస్ క్రిష్ణ. పి.హెచ్.డి. స్టూడెంట్స్, క్రిష్ణని తమతో వుంచుకుంటాం అన్నారు. స్నేహితులు మాత్రం మా ఇద్దరి పిల్లలకీ మంచివాళ్ళు దొరికారు. సాధారణంగా బయటకి వెళ్ళిన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలిసే ఆస్కారం వుండదు. కానీ, మా వారు – ఆయన సర్వీస్ అంతా వేరే వూళ్ళోనే చెయ్యడం వల్ల నేను, ఇద్దరూ మగపిల్లలే అయినా, ఎప్పుడూ వాళ్ళ స్నేహాల మీద ఓ కన్నేసే వుంచేదాన్ని! రాత్రుళ్ళు సెకెండ్ షోకి వెళ్ళినా, ఫ్రెండ్స్‌తో కబుర్లాడుతూ, అర్ధరాత్రి దాకా ఇల్లు చేరకపోయినా, నేను ఫోన్స్ చేసేదాన్ని. మా అశ్విన్ ఫోన్ చార్జ్ అయిపోయి, ఎప్పుడూ ఆఫ్ లోనే వుండేది!  ‘తెల్లవారిపోతుందేమో… పిల్లాడు ఇంకా రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వుంది’ అన్న పరిస్థితి వస్తే కనుక నేనే కాదు, ఏ తల్లి అయినా కంగారు ఆపుకోలేదు. నేను వాడి స్నేహితులందరికీ ఫోన్స్ చేసేసి ‘అశ్విన్ వున్నాడా’ అని అడిగేదాన్ని.

మేజర్ దివ్య అని ఆర్మీ ఆఫీసర్, మా అశ్విన్ ఆర్కిటెక్ట్ కాబట్టి, ఆమె కూడా ఆర్కిటెక్టే కాబట్టి, టెర్రావర్డిస్ అనే ఆఫీసులో జాబ్ చేసేవారు. ఆమె భర్త ఆర్మీలో చేసొచ్చిన మేజర్ హరి. ఆఫ్తమాలజిస్ట్ (కంటి డాక్టర్). వీళ్ళ ఇంటికి వెళ్తే అశ్విన్‍ని రాత్రి పొద్దుపోయేదాకా వుంచేసేవారు. ఒకసారి అశ్విన్ ఫోన్ ఆఫ్‍లో ఉండడంతో, నేను అందరికీ చేసి, చివరికి దివ్య “ఇక్కడున్నాడు ఆంటీ, ఫోన్ చార్జ్ అయిపోయిందట” అనగానే వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసాను. అప్పటి నుండీ మా పిల్లలకి భయం నేనంటే… ఇలా వాళ్ళని ఎంబరాస్ చేసేస్తానని. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా “చార్జ్ అయిపోయే ముందు అమ్మకి ఓ కాల్ చెయ్యరా, లేదా మెసేజ్ పెట్టు… మీ అమ్మకి కంగారు ఎక్కువని తెలుసుగా” అంటారుట.

చిన్నప్పుడు క్రిష్ణ తప్పిపోయి, మళ్ళీ దొరకడం వల్ల, ఆ భయం నాలో వుండిపోయింది. పిల్లల సెల్ మోగుతున్నా, తియ్యకపోతే అది ఇంకో రకం భయం… ఏమైందో తియ్యడం లేదని!

మొత్తానికి పిల్లల స్నేహితులు ఎవరో మనం ఒక కన్ను వేసి వుంచాలి. ఎటొచ్చీ గొప్ప గొప్ప వాళ్ళ పిల్లల్లా, వీళ్ళు ఏం చేస్తున్నారో, పేపర్లలో చూసి తెలుసుకునే పరిస్థితి, దేవుడి దయ వల్ల, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో వుండదు అనుకోండీ!

నాకు డాలస్‍కి టికెట్ వచ్చేసింది. నేను క్రిష్ణని విడిచి వెళ్ళే రోజు వచ్చేసింది. ఉన్నన్నాళ్ళూ ఇద్దరం స్నేహితుల్లా, చేతులు కలుపుకుని తిరుగుతూ, ప్రతి రోజూ ఏదో ఒక చోటకి వెళ్తూ గడిపేసాం. ఇప్పుడు రెండు రకాల బాధలు నాకు. వదిలి వెళ్ళి, అదే దేశంలో ఇంకో పదిహేను రోజులు వుంటాననీ, వాడికి ఉద్యోగం రాకపోతే ఎలా? నెలా నెలా డబ్బు పంపాలా? ఇండియా వచ్చెయ్యమనాలా? అని. కానీ నేను డాలస్ వదిలి వెళ్ళేముందే, మేం ఇద్దరం కలిసి వెళ్ళిన ఇంటర్వ్యూ ఎక్స్.పి.ఓ. లాజిస్టిక్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే “బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తున్నాం” అన్నారు. బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంటే, సాధారణంగా, అది ఫైనల్. పోలీసు కేసులూ, అవీ లేవు కదా అని చూస్తారు, అంతే! “నాన్నా, మనం వెళ్ళిన రేలీలో వెంకటేశ్వరుడికి వుద్యోగం రాగానే వెళ్ళి మూడు డాలర్లు వెయ్యి” అని చెప్పాను.

డాలస్‍కి వెళ్ళడానికి, క్రిష్ణ కార్ రెంట్‍కి తెచ్చిన నన్ను ఎయిర్‌పోర్ట్‌లో దింపుతుంటే, నా కళ్ళ నిండా నీళ్ళు! పిల్లల్ని వదిలి వెళ్ళడం బాధ కన్నా పెద్ద బాధ ఏం వుంటుందీ? ఉద్యోగం వచ్చినా, వీడు ఇంకో సంవత్సరం దాకా ఇండియా రాలేడన్న బాధ!

డాలస్‍లో అప్పుడు మా రమక్క లేదు! మా పెద్దమ్మ శ్రీదేవి గారు ఇటీవలే కాలం చేసారు 2020లో. అంతదాకా, రమక్క, ఏడాదిలో కనీసం నాలుగైదు నెలలు తల్లిని చూసుకోవడానికి ఇండియాలోనే గడిపేది! మన చిన్నప్పుడు పెద్దగా చీకూ చింతా లేకుండా గడిపేస్తాం, పెళ్ళయ్యాకా, వచ్చిన కొత్త బంధాల తోటీ, మురిపెంగా, కడుపులో నలుసులా పడి, ఆ తర్వాత బయటకొచ్చి, మన ప్రపంచం అంతా తామే అయి ఆక్యుపై చేసుకునే పిల్లల సంరక్షణా, వాళ్ళని పెంచడంలో దాదాపు మిడిల్ ఏజ్ దాకా గుక్క తిప్పుకోకుండా గడిచిపోతుంది. మనం కన్నవాళ్ళు పెళ్ళిళ్ళు అయి, వుద్యోగాల్లో స్థిరపడి, వారి జీవితాలు వారు గడిపే సమయానికి, మనని కన్నవాళ్ళు వృద్ధులు అవుతారు. వారిని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద పడ్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఆడపిల్లలు మాత్రం, తమ సంసారాన్నీ, పిల్లల్నీ వదిలి, తల్లిదండ్రులను పెద్ద వయసులో, దగ్గరుండి చూసుకోడానికి ఎక్కువ తపన పడడం నేను చూశాను. కానీ మగపిల్లలకి ప్రేమలు తక్కువై కాదు, ఆడపిల్లలా, తను వచ్చి వారి దగ్గరుండి చెయ్యడం కాదు, వారినే తన దగ్గరకి తీసుకెళ్తానంటాడు. అన్నివేళలా అది సాధ్యపడదుగా!

సో…  నేను ఫ్లయిట్ దిగగానే, నేను నా దగ్గరనున్న ఇస్మయిల్ సుహైల్ పెనుగొండ గారికి ఫోన్ చేసాను. “ఆల్‌రెడీ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా వాళ్ళు వున్నారు మేడం” అన్నారు.

స్వర్ణ అనే ఆవిడ పుష్పగుచ్ఛం ఇచ్చి నన్ను ఆహ్వానించారు. మేం కార్‍లో కన్వెషన్ సెంటర్‍కి బయల్దేరుతుండగా, ఆవిడకి ఫోన్ వచ్చింది. “కొలరాడో నుండి వచ్చిన ఇంకో గెస్ట్‌ని కూడా రిసీవ్ చేసుకుని వెళ్దాం మేడం” అంది. ఆ గెస్ట్‌ని చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఆవిడ సింగర్ ఛాయాదేవీ, ఆవిడ భర్తానూ. ఈ సింగర్ ఛాయాదేవీ, ఇంకో సింగర్ చంద్రకాంతా – మేం టీవీ కొన్న కొత్తల్లో టీవీలో పాడ్తుండేవారు. కొంతమందిని చూస్తే డి.డి. రోజులు గుర్తొస్తాయి. ‘నమస్కారం’ అనే మన విజయదుర్గ గారిని చూసినా (తర్వాత నేను టీ.వీ. ఫిల్మ్స్ స్క్రీనింగ్‍లో ఆవిడతో సెన్సార్ బోర్డు మెంబర్‌గా కలిసి పనిచేసాను), డాన్సర్ అలేఖ్య గారిని చూసినా, అప్పట్లో ఆలేఖ్యా నరసింగరావుగా ఆవిడ ఫేమస్! ఇలా పాటలు పాడేవాళ్ళని చూసినా, నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. అంతేకాక, మా పెద్దక్క లక్ష్మికి (పెద్ద పెద్దమ్మ కూతురు)కి కీస్ హైస్కూల్లో, ఛాయాదేవి గారు క్లాస్‍మేట్ అని, నాతో తరచూ చెప్పేది!

ప్రముఖ గాయని శ్రీమతి ఛాయాదేవి గారితో రచయిత్రి

నేను ఆవిడతో ఆ మాటలే కలిపాను. వాళ్ళు గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలోనే స్థిరపడినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక వేదికలో ఆవిడ పాట పాడడానికి వచ్చారుట.

మేం కన్వెన్షన్ హాల్ చేరగానే, అక్కడ మమ్మల్ని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. తెలిసిన మొహం, సినీ ఏక్ట్రెస్ రజిత కనిపించింది. రజితా చౌదరీగా నాకు ఎఫ్.బి. ఫ్రెండ్ కూడా. కానీ రామానాయుడు గారికి నేను కథ ఇచ్చిన సినిమాల్లో, తను నటించడం వల్ల నాకు బాగా పరిచయం. వాళ్ళ పిన్నులు క్రిష్ణవేణీ, రాగిణీ కూడా నాకు బాగా పరిచయం! నన్ను తను ఆప్యాయంగా హగ్ చేసుకుంది. ముందు దిగగానే, మంచి ఉపాహారాలూ, కాపీ ఇచ్చారు. డాలస్ అంటే ఓ రకంగా విజయవాడే!

సినీనటి రజితగారు, డా. ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ గారితో రచయిత్రి

అక్కడున్నంత మంది తెలుగు స్నేహితులు అంటే సాహిత్యంతో చెలిమి చేసే తెలుగువారు, ఇంకెక్కడా లేరంటే అతిశయోక్తి కాదు! అందులో ముఖ్యంగా మా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారూ, తోటకూర ప్రసాద్ గారూ, ఎమ్.వి.ఎల్. గారూ, ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ గారూ, మా వి.ఎన్.ఆదిత్య, కజిన్ సిస్టర్ మీనాక్షి అనిపిండి (మంచి గాయని), మా రమక్క, మా కజిన్ భార్య సత్యా చింతపెంట, మా తమ్ముడి లాంటి మాధవ్ దర్భా అక్కా బావగార్లూ సుజనా పాలూరీ, పి.వి. రామారావు గార్లూ, చంద్రా కన్నెగంటి, డా. జంపాల చౌదరి గార్లు… ఇలా ఎందరో.

డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గారు, శ్రీ తోటకూర ప్రసాద్ గారితో రచయిత్రి

శ్రీ నరాల రామిరెడ్డి గారు, శ్రీ వంగూరి చిట్టెన్‌రాజు గారు, శ్రీ సుబ్బు జొన్నలగడ్డ గారితో రచయిత్రి

నాటా సాహిత్య వేదిక

సత్య కూడా ఆ సమయంలో లేనందువల్ల, నేను – సుజన భర్త రామారావు గారిని, ఈ సభలు అవగానే వారింటికి వచ్చి, ఆ రాత్రికుండి, తెల్లవారు ఝామున ఆయన ఎయిర్‍పోర్ట్‌లో దింపితే, కేలిఫోర్నియాలో డుబ్లిన్ వెళ్తాలని, ముందే రిక్వెస్ట్ చేసాను! కేలిఫోర్నియా డుబ్లిన్ నా లిస్ట్‌లో చేర్చుకోడానికి కారణం, కిరణ్ ప్రభ గారూ, కాంతి కిరణ్ పాతూరి దంపతులు! అది నా పుట్టిల్లు యుస్.ఎస్.ఎ.లో అని చెప్పాను కదా!

(సశేషం)

Exit mobile version