[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘కనికరం లేని కాలం కరిగిపోయింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నడిరేయి నిశ్శబ్దం!
శీతాకాలమే అయినా,
ఒళ్ళంతా స్వేదంతో
తడిసి ముద్దలా మారి
ఊపిరి ఆగిపోయిన భావన!
ఉలికిపాటుతో లేచాను..
శ్వాసలో కదలిక
నిలకడగానే వుంది..
అందరూ హాయిగా
నిద్రాదేవి ఒడిలో
సేదదీరుతోన్న వేళ..
నా ఒక్కడి లోనే
ఎందుకీ ఆందోళనా తరంగాలు
ఎగిసెగిసి పడుతున్నాయి!?
అంతరంగం ఆలోచనలతో నిండిపోయి
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది!
యవ్వనకాలం కోరికలన్నీ
ఊహలకే పరిమితమై..
ఆచరగాత్మకం చేయలేక
నిస్సహాయుడనై..
నిర్లిప్తత ఆవహించగా
సోమరినై శూన్యంలో చరించాను!
నేలపై కాలిడిన తర్వాత
సంసార సాగరం
భయానకంగా స్వాగతం పలికి..
అనురాగ బంధాల కెరటాలను
కానుకలుగా సమర్పించింది!
కుటుంబ బంధాల బాధ్యతలు
జైలు జీవితాన్ని తలపింప జేయగా..
ప్రయోజకత్వం రహదారి వైపు
పయనం సాగించలేకపోయాను!
ఏళ్లు గడిచాయి..
ఊళ్ళు మారిపోయాయి..
రక్త సంబంధాల బుద్దులు
గతులు తప్పి పేగు బంధాలను
నిర్లక్ష్యం చేసి అపహాస్యం చేస్తున్నాయి!
కరిగిపోయిన కాలం
వృద్ధాప్యాన్ని బహుమతిగా ఇచ్చింది!
కలల అలలపై తేలియాడిన గతం
ఎదురుగా నిలబడి వెక్కిరిస్తోంది!
కాలం విలువను నిర్లక్ష్యం చేసి
ఓ జీవిత కాలాన్ని
నిరుపయోగం చేసుకొని
ఆశలను, ఆశయాలను
కాలగర్భంలో కలిపేసి
నిస్సహాయంగా..
నిద్రలేని రాత్రులతో
సహవాసం చేసూ..
బ్రతుకు బండిని భారంగా ఈడుస్తూ..
ఎంత కాలమిలా..!?
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
