Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లోకల్ క్లాసిక్స్ – 40: ఆధునిక హాస్య విషాదం

‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా రాంరెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘తిథి’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

‘తిథి’ (కన్నడ)

హిందీ ఆర్ట్ సినిమాలైనా కమర్షియల్ సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించక పోవడానికి కారణం ఒకటే కన్పిస్తుంది: అవి శిలా సదృశంగా ఒకే ధోరణిలో సీరియస్‌గా వుంటూ, సగటు ప్రేక్షకులకి దూరంగా, ప్రధాన స్రవంతిలో లేకపోవడమే. మారిన కాలానికి వుంటున్న తీరులో హిందీ ఆర్ట్ సినిమాలకిక ప్రేక్షకుల్లేరని గుర్తించిన శ్యామ్ బెనెగళ్, ఒక కొత్త ఒరవడికి తెర లేపారు. 2000 నుంచి హిందీ ఆర్ట్ సినిమాలని ప్రధాన స్రవంతి బాలీవుడ్ స్టార్స్‌తో తీయడం మొదలెట్టారు. రేఖ, కరిష్మా కపూర్, అమృతా రావ్, మినిషా లాంబా, మనోజ్ బాజ్ పాయ్, అమ్రిష్ పురి, శ్రేయాస్ తల్పడే, బొమన్ ఇరానీ… ఇలా కమర్షియల్ సినిమా తారాతోరణాన్ని ప్రేక్షకుల ముందుంచుతూ ఆర్ట్ సినిమాలు తీయడం మొదలెట్టారు. దాంతో అవి ప్రధాన స్రవంతి లోకొచ్చేసి, కొత్త తరం ప్రేక్షకుల అండదండలతో వాణిజ్య పరంగానూ విజయాలు సాధించడం మొదలెట్టాయి.

ఇదే బాటని గోవింద్ నిహలానీ అనుసరించాడు. ఇప్పుడు వీటికి క్రాసోవర్ సినిమాలని పునర్నామకరణం చేశారు. సరిహద్దుని క్రాస్ చేసి బాలీవుడ్ లోకి ప్రవేశించిన కొత్త మోడల్ ఆర్ట్ సినిమాలన్న మాట. ఇక మొదలైంది బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్త దర్శకుల వరస… ఈ మార్గంలో ఈ బృందం కొత్త కొత్త నటీనటులతో, స్వల్ప బడ్జెట్ మల్టీప్లెక్స్ సినిమాలనే ఇంకో ధోరణికి దారి తీశారు. ఈ దారిలో ఆర్ట్ సినిమా వాస్తవికతల్ని వదిలేసి కాలక్షేప బఠానీలకి లొంగిపోయారు.

ఇంకా ఇటువైపు చూస్తే, వివిధ ప్రాంతీయ భాషల సినిమాలు ఇంకా అవే కాలం చెల్లిన ఆర్ట్ సినిమాల ధోరణుల్లోనే వుంటూ, ప్రాంతీయంగానే ప్రేక్షకుల్లేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలతో సరిపెట్టుకో సాగాయి. ఈ సినిమా లెక్కడున్నాయో చూడడానికి వెతికి పట్టుకోవడం కూడా కష్టమే. ఈ పూర్వ రంగంలో కన్నడ నుంచి ఒక కొత్త దర్శకుడు రాంరెడ్డి, ప్రాంతీయ క్రాసోవర్ సినిమాలని ఎలా తీసి ప్రాంతీయ- జాతీయ- అంతర్జాతీయ ప్రేక్షకుల వరకూ అలరించవచ్చో, అలాగే రికార్డు స్థాయిలో 20 దాకా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం ఎలా పొందవచ్చో తనదైన ప్రధాన స్రవంతి మోడల్ నిచ్చాడు. అది 2015 లో ‘తిథి’ రూపంలో తెర దాల్చింది.

శ్యామ్ బెనెగళ్ హిందీ ఆర్ట్ సినిమా తీరు తెన్నుల్ని మార్చి స్టార్స్‌తో ఆధునీకరిస్తే, రాంరెడ్డి తిరిగి అదే పాత రోజుల్లో కెళ్లి అక్కడున్న పాతతోనే, స్టార్స్ అవసరం లేకుండానే సాహసం చేశాడు. స్థానిక ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి స్టార్స్ అవసరం లేని సాహసం. ఆర్ట్ సినిమా కథల్లో ఏదైనా సమస్యని సీరియస్ గానే చర్చించనవసరం లేదనీ, వినోద భరితంగానూ ముచ్చటించుకో వచ్చనీ ఒక ప్రయోగం చేసి చూపించాడు. ఇలా ఇది ఆర్ట్ సినిమా కథని పూర్తి వినోదాత్మకంగా మార్చిన ఇంకో నూతన కల్పన అయింది. ఇదెలా వుందో ఓసారి చూద్దాం…

కథ

కర్ణాటక మాండ్యా జిల్లా నోడెకొప్పలు అనే పల్లెటూరు. రైలు కట్ట వారగా వూరు. ఆ రైలు కట్ట నానుకుని మంచి ధర పలికే అయిదెకరాల మాగాణి. దాని ఆసామి బడుగు జీవి, కాటికి కాళ్ళు జాపుకున్న, నిండు 101 సంవత్సరాల సెంచరీ గౌడ అనే బూతు వీరుడు. పనేం వుండదు. దారి పక్కన కూర్చుని, వచ్చే పోయేవాళ్లని బండ బూతులు తిట్టడమే. అమ్మనా బూతులు కూడా తిడతాడు. తిట్టించుకుంటున్న వాళ్ళకి అది నిత్య కార్యక్రమమే కాబట్టి, జీవితంలో విడదీయలేని భాగంగా చేసుకుని సాగి పోతూంటారు. సెంచరీ గౌడని పోలీసులు వచ్చి పట్టుకోవడానికి అవి ఆన్ లైన్లో సోషల్ మీడియాలో తిట్లు కావు, సొసైటీలో లైవ్‌గా తేట తేనియల తిట్లు. అక్కడ అందరికీ ముద్దొస్తున్నాయి.

ఇలాటి సెంచరీ గౌడకి ఒకానొక డెబ్బయి ఏళ్ల కొడుకు గడ్డప్ప. ఇతను గడ్డాలూ మీసాలు పెరిగిపోయి నడుచుకుంటూ వెళ్లి పోతూంటాడు. ఎక్కడికి వెళ్లి పోతూంటాడో తెలీదు. నడకే అతడి నినాదం. ఎక్కడో ఆగి, క్వార్టర్ బాటిల్ తీసి ఒక గుక్క లిక్కర్ పట్టిస్తాడు. ఇంకెక్కడో చెట్టు కింద కూర్చుని పులి జూదం ఆడతాడు. ఇతడికి తమ్మన్న అని కొడుకు. ఇతను తండ్రిని వెతికి పట్టుకొచ్చి అన్నం పెడతాడు. ఇతడికో కొడుకు అభి. వీడికి కావేరీ అని గొర్రెల పెంపకం అమ్మాయికి వల వేయడం పని. ఇతడికో తల్లి. ఈ మగ మేధావులకి వండి పెట్టడం ఈమె పని.

ఇలా నాల్గు తరాల నిండు కుటుంబం వూరిని సముచితంగా ఉద్ధరిస్తున్న వేళ, ఓ రోజు సెంచరీ గౌడ తిట్లతో వీధి నిర్వహణ పూర్తి చేసుకుని ఇంటికి పోతాడు. పోతూ దారిలో మూత్రం పోయడానికి కూర్చుంటాడు. కూర్చుని అలా వొరిగి పోయి తనువు చాలిస్తాడు.

విషాదం అలుముకుంటుంది. అయితే పెద్ద కర్మలోగా కొన్ని వింతలు చోటు చేసుకుంటాయి. సెంచరీ గౌడ కొడుకు, మనవడు, ముని మనవడు ముగ్గురూ పాల్పడే వింతలు. కుటుంబంలో ఒక మరణంతో ఒక స్వేచ్ఛ, ఒక స్వార్ధం మనుషుల్లో పుట్టుకు రావొచ్చు. ఒక మరణం ఒక మంచో చెడో పుట్టుకకి కారణమవుతుంది. అదే సమయంలో ఇంకో గాయాన్ని మాన్పలేని వైఫల్యం కూడా మరణానికుంటుంది. కొన్ని గాయాల్ని మరణాలు మాన్పలేవు. ఏమిటా గాయం? ఎవరా జీవితకాల క్షత గాత్రుడు? దీని గురించే మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే నోడెకొప్పలు గ్రామంలో దర్శకుడు రాంరెడ్డి కనుగొన్న కథ. ఇది రచయిత ఎరెగౌడ స్వగ్రామం. ఒకసారి ఎరెగౌడని కలవడానికి రాంరెడ్డి వచ్చినప్పుడు, ఇదొక కొత్త ప్రపంచంలా అన్పించింది. గ్రామం తీరుతెన్నులు, మనుషుల ధోరణి చూస్తే వెంటనే ఈ గ్రామాన్ని పాత్రగా చేసి సినిమా తీయాలన్పించింది. దీంతో జెకెస్లోవేకియా వెళ్ళి ఫ్రాగ్ ఫిలిమ్ స్కూల్లో ఏడాది పాటు దర్శకత్వం, రచనల్లో శిక్షణ పొందాడు. అక్కడ పరిచయైన డొరోన్ టెంపర్ట్‌ని ఛాయాగ్రాహకుడిగా నియమించకున్నాడు. ఎరెగౌడతో కలిసి కథ రాసుకుని సినిమా తీయడం మొదలెట్టాడు.

ఇది పూర్తిగా హాస్య ప్రధానం. ఈ కథలో ప్రతిఫలించే అంశాలు మరణం, పేదరికంలో పుట్టే స్వార్ధం, దాంతో మోసం, కుటుంబ సంబంధాల లేమి మొదలైన సీరియస్ విషయాలు. వీటిని నెగెటివ్ ప్రవర్తనలతో నవ్వొచ్చేట్టు చూపిస్తాడు. నవ్వించుకుంటూ వెళ్ళి వెళ్ళి చివర్లో విషాదాంతం చేస్తాడు. కఠిన వాస్తవాలతో కళ్ళు తెరిపిస్తాడు.

ఇప్పుడంటే తెలుగు సినిమాల్లో కామెడీకి సవాలక్ష రస భంగాలుంటున్నాయి గానీ, ఒకప్పుడు బాపు, జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నర్సింహారావు, విజయబాపినీడు తీసిన కామెడీ సినిమాలు కామెడీ సినిమాల్లాగే వుండేవి. ఏకధాటిగా నవ్వించినంత నవ్వించి, చివర్లో గభీరంగా విషయం చెప్పి ముగించే వాళ్ళు. కామెడీ సినిమాల కిది జానర్ మర్యాద. ఇప్పుడు జానర్ మర్యాదల్లేవు, జాతి లక్షణాల్లేవు. కామెడీ మధ్యలో చాదస్తాలకి పోయి ఏదో ఫీల్ వుండాలనీ, ఇంకేదో సెంటిమెంటు వుండాలనీ శోక రసాన్ని జొప్పిస్తూ, హాస్యరస ప్రధాన కథల్ని సాధ్యమైనంత హతమార్చడమే చేస్తున్నారు.

బాపు తీసిన ‘ముత్యాల ముగ్గు’ లో భర్త వదిలేసిన సంగీత పాత్రతో విషాదముంటుంది. ఆ సమస్యా పరిష్కారానికి ఆమె ఇద్దరు పిల్లలతో హాస్యరసానికి అద్భుత రసం జోడించి వినోదాత్మకం చేశారు. అద్భుత రసంతో హాస్యరసానికి చైతన్యం వస్తుంది. కామెడీలకి కావాల్సిందిదే.

2018 క్రిస్మస్‌కి, ఇప్పుడు క్రిస్మస్ కీ విడుదలైన ‘ది ప్రిన్సెస్ స్విఛ్డ్’, ‘ది ప్రిన్సెస్ స్విచ్డ్ ఎగైన్’ అనే రెండు హాలీవుడ్ సినిమాలూ క్రిస్మస్ ఫ్యామిలీ సినిమాలే. పూర్తిగా హాస్యభరితాలే. ఈ పండగ ఫ్యామిలీ సినిమాల్లో సెంటిమెంట్లూ, ఏడ్పులూ, గుండెలు బరువెక్కడాలు, కన్నీటి జలాపాతాలు ఏవీ వుండవు. హాస్యం చూపించినంత చూపించి, కొలిక్కి తెస్తూ పాత్రల కళ్ళు తెరిపిస్తారు. హాస్యంతో కూడా గంభీర విషయం చెప్ప వచ్చన్న జానర్ మర్యాదాయుక్త హాస్య కథా సంవిధానం. ఇటు తెలుగులో ఫ్యామిలీ సినిమాలంటే ఇంకా అవే ఏడ్పులూ పెడబొబ్బలతో బాటు, విలన్ రక్తపాతాలు, హీరో చేతిలో భారీ ఖడ్గం, ఓ తరతరాల నరుక్కునే పండుగ!

‘తిథి’ అనే ఈ వాస్తవిక సినిమాలోని హాస్య కథ పూర్తిగా జానర్ మర్యాదలతో వుంటుంది. 101 ఏళ్ల సెంచరీ గౌడ మరణాన్ని కూడా హాస్యం పట్టించడమే. పల్లెలో భేషజాలుండవు, పట్టణాల్లోనే సూడో నాగరికత లుంటాయి. పల్లెల్లో పచ్చి వాస్తవా లాధారంగా జీవితాలుంటాయి. ఎంత అట్టడుగు వర్గాల జీవితాలుంటే అంత నగ్నసత్యాల నాట్యముంటుంది. డివైన్ డాన్స్. తమ్మన్న తండ్రి గడ్డప్పని వెతుక్కుంటూ వెళ్ళి- తాత చచ్చిపోయాడు, కార్యక్రమాలున్నాయి రమ్మంటే, చచ్చి పోయినవాడికి కార్యక్రమాలు తెలుస్తాయా, రానంటాడు గడ్డప్ప.

ఇంకోసారి నువ్వు ఇంట్లో కూర్చోక ఎందుకిలా తిరుగుతావంటే, కూర్చుని చచ్చే కన్నా తిరిగి చావడం మిన్న అంటాడు గడ్డప్ప. నిజానికి తిరుగుతున్నవి అతడి కాళ్ళు కాదు, మనసులోనే ఏదో సుళ్ళు తిరుగుతోంది. ఆ పోటుకి కూర్చుని వుంటే చచ్చిపోతాడు. అందుకని ఇలా నిత్య సంచారి. మనసులో ఏమిటా పోటు అనేది సస్పెన్స్. పైకి చెప్పుకోలేడు. ఈ చీకటి కోణం కథకి బలమైన వెన్నెముక.

లిక్కర్ తాగడం మరుపు కోసం, పులిజూదం ఆడడంలో మనస్సుని గెలవాలన్న ఆరాటం. ఒకవైపు మర్చిపోవాలని, ఇంకో వైపు గెలవాలని. క్షమిస్తే మనస్సుని గెలవగలడు. కానీ తండ్రి సెంచరీ గౌడ తనతో చేసింది క్షమించరానిది. అది పైకి కూడా చెప్పుకోలేనిది.

వంద దాటిన సెంచరీ గౌడ మరణం వూళ్ళో ఎవరికీ పట్టదు. చాలా పాత సరుకని ముని మనవడు అభి కూడా పట్టించుకోడు. పెద్ద కర్మకి సరుకులు తేవడానికి వెళ్ళి ప్రేమిస్తున్న కావేరీ కనపడగానే ఆమె వెంటపడి వెళ్ళిపోతాడు. ఇటు తండ్రి తమ్మన్న కూడా పెద్ద కర్మని పట్టించుకోకుండా, అర్జెంటు పని మీద వుంటాడు. ముందు తండ్రి గడ్డప్పని అడుగుతాడు- నీ అయ్య వంద దాటి బతికాడు, నువ్వెప్పుడు చస్తావో ఏమో, ఈలోగా నీ తమ్ముళ్ళు పొలం పంచమని వస్తారు, అందుకని అయ్యనుంచి నీకొచ్చిన అయిదెకరాలు నాకు రాసేయ్- అని వెంటపడతాడు. గడ్డప్ప ఒకటే మాటంటాడు – నేను చచ్చాకే, నీ కొచ్చేది అని.

సెంచరీ గౌడ చితాభస్మం సేకరించబోయి అక్కడ కెలుకుతూ- ప్రక్కటెకముకలు మిగిలే వున్నాయి, వీడు మామూలోడు కాదనుకుంటారు. అందుకే వూళ్ళో ప్లే బాయ్‌లా వెలిగి అలాటి పన్లు చేశాడని అనుకుంటారు. ఇలా సెంచరీ గౌడ గురించి కొత్త విషయం మనకి తెలుస్తుంది. బూతుల వీరుడెందుకయ్యాడో పాత్ర అర్థమవుతుంది.

పొలం రాయడానికి తండ్రి నిరాకరించడంతో తమ్మన్న టౌను కెళ్ళిపోయి, టింబర్ డిపో ఆసామికి పొలం బేరం పెట్టేస్తాడు. ఇరవై లక్షలకి బేరం కుదురుతుంది. ఆసామీ పత్రాలు పరిశీలించి గడ్డప్ప పేరు మీద వున్నాయే అంటే, తన తండ్రి గడ్డప్ప చచ్చిపోయాడని తమ్మన్న అనేస్తాడు. అయితే డెత్ సర్టిఫికేట్ పట్రమ్మంటాడు ఆసామీ. తమ్మన్న రెవిన్యూ అధికారికి లంచమిచ్చి డెత్ సర్టిఫికేట్ సంపాదిస్తాడు. ఇక నీ తండ్రి ఈ చుట్టుపక్కల కనిపించకూడదని రెవిన్యూ అధికారి హెచ్చరిస్తాడు.

తమ్మన్న తిరిగి వచ్చి, ఒక వడ్డీల రౌడీ రాణి దగ్గర తెగించి భారీ వడ్డీకి రెండు లక్షలు అప్పు తీసుకుంటాడు. ఆ డబ్బు గడ్డప్ప కిచ్చి, నీకు తిరగడం అలవాటు కదా, ఇక అలా ఓసారి దేశాటన చేసి ఆర్నెల్ల తర్వాత రమ్మని బస్సెక్కించి పంపించేస్తాడు. ఇక చట్టం దృష్టిలో గడ్డప్ప చచ్చిపోయాడు! తాత పెద్దకర్మ లోగా తండ్రి మాయం, అస్తమయం! అయితే గడ్డప్ప తిరిగే కాలు వూరి పొలిమేరలు దాటి వెళ్ళదు కాబట్టి పక్కూళ్ళో ఎంచక్కా బస్సు దిగిపోయి, గొర్రెల పెంపకం వాళ్ళ దగ్గర మకాం వేస్తాడు. ఈ విషయం తెలీక కావేరీ కోసం అక్కడి కొచ్చి లైనేస్తూంటాడు ముని మనవడు అభి.

హమ్మయ్యా ఒక పనైపోయిందని తమ్మన్న, ఇక పెద్ద కర్మ పన్లలో పడతాడు. సెంచరీ గౌడ @ 101 చుట్టు పక్కల ఎంతో ఫేమస్ కాబట్టి, 500 మందికి తక్కువ లేకుండా మేక మాంసంతో భోజనాలు పెట్టాలని పెద్దలు హుకూం జారీ చేస్తారు. ఈ క్షవరం విజయవంతంగా చేయించుకుంటాడు తమ్మన్న. వచ్చి మాంసం మెక్కుతున్న చాలా మందికి సెంచరీ గౌడ చచ్చిపోయాడని కూడా తెలియదు. భోజనాలయ్యాక, రాత్రిపూట సెంచరీ గౌడ ప్రశస్తి గురించి బృందగాన ప్రదర్శన. తెల్లారి ఇంకో కార్యక్రమం పూర్తి చేయడానికి చితి దగ్గరికి వెళ్లినప్పుడు, కొడుకు గడ్డప్ప లేకపోవడంతో కలవరం మొదలవుతుంది. ఇంతలో పొలం కొనుగోలు కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి ఆసామీ డబ్బు పట్టుకొచ్చేస్తాడు. మరింతలో రైలు కట్ట వారగా గొర్రెల మందతో పాటూ నింపాదిగా పోతూ గడ్డప్ప కన్పిస్తాడు జనాలకి!

తమ్మన్నకిక పీక్కోలేని కక్కలేని పరిస్థితి!… ఇక్కడ్నించీ గడ్డప్ప అటు తండ్రే అనుకుంటే ఇప్పుడు కొడుకు విశ్వాస ఘాతుకానికీ మతిచలించిన వాడవుతాడు. అయినా చేతికొచ్చిన పొలం డబ్బులు పోతున్నాయన్నకసి తమ్మన్నకి… రక్తసంబంధాలు రిక్త హస్తాల్ని మిగిల్చాయన్న ఆక్రోశంతో తండ్రిని దూషించడాలు. అటు తండ్రి, ఇటు కొడుకూ గుండెల్లో గునపాలు దింపిన వాళ్ళైపోతే, గడ్డప్పకి దిక్కు తోచని స్థితి.

చీకట్లో చలిమంటేసుకుంటున్న గడ్డప్ప క్లోజింగ్ ఇమేజితో కదిలించే విధంగా ముగింపు. ఈ సహజ కథ కథ నడిపిన తమ్మన్నది కాదనీ, కథకి కారకుడైన మౌన బాధితుడు గడ్డప్ప దనీ చిట్ట చివర్లో తేలి గడ్డప్ప గొప్పగా కన్పిస్తాడు. పాత్ర చిత్రణంటే ఇదీ కదా అన్పించేలా. ఆ రెండు లక్షలు పట్టుకెళ్ళిన గడ్డప్ప తాగితందానా లాడెయ్యడు, పరోపకారానికి వాడేస్తాడు. కాస్త కుదురుగా అతను గడిపేది గొర్రెల పెంపకం వాళ్లతోనే. ఈ గడ్డప్ప విషాదానికి హాస్యంతో ఇచ్చిన షుగర్ కోటింగే జీవం పోసింది. ఈ హాస్యం వూరికే హాస్యం కోసం అన్నట్టు లేదు. వివిధ ఆచారాలూ, ప్రవర్తనా లోపాలపైన ఆలోచనాత్మక వ్యంగ్యాస్త్రాలివి.

స్థానిక పాత్రలకి స్థానికులే నటులు

సెంచరీ గౌడ, గడ్డప్ప, తమ్మన్న పాత్రల్లో సింగ్రి గౌడ, చన్నే గౌడ, తమ్మే గౌడ వృత్తి నటులు కారు. నటన తెలీని ఆ వూరి సగటు మనుషులే. అభి, కావేరీ యువ పాత్రల్లో అభిషేక్, పూజ సైతం స్థానికులే. ఇంకా అన్ని సహాయ పాత్రలూ, మిగతా అందరూ స్థానిక ప్రజలే. వీళ్ళకి 80 రోజుల పాటు శిక్షణ నిచ్చాడు దర్శకుడు. ఆ వూరి ఆత్మని అక్కడే వుంటూ రాసుకుంటూ, తీసుకుంటూ ఆవాహన చేసుకుని ఒక యజ్ఞంలా పూర్తి చేశాడు. ముఖ్య పాత్రల్లో సింగ్రి గౌడ, చన్నే గౌడ, తమ్మే గౌడ వృత్తి నటులే అన్నంత సహజ మెథడ్ యాక్టింగ్ చేసి బలమైన ముద్ర వేస్తారు. పాత్రల్ని మర్చిపోలేని విధంగా ప్రేక్షకుల మనో ఫలకాల మీద ముద్రించి వదుల్తారు. ఎక్కడా కమర్షియల్ యాక్టింగ్ వుండదు.

ఈ తరం దర్శకుడు రాంరెడ్డి, రచయిత ఎరెగౌడ జీవితం పట్ల లోతైన అవగాహన గల వాళ్ళుగా అన్పిస్తారు. హైలైట్ చేయాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఆర్ట్ సినిమాకి నూతన కల్పన చేస్తూ కథా నిర్మాణం వుండని పాసివ్ పాత్రల ఆర్ట్ సినిమా తీయలేదు. సగటు ప్రేక్షకుల అనుభవంలోకి కూడా తీసుకొస్తూ, ప్రధాన స్రవంతి సినిమా మూడంకాల (త్రీయాక్ట్ స్ట్రక్చర్) నిర్మాణం చేశారు. కథ స్ట్రక్చర్‌లో వుందంటే పాసివ్ పాత్రలుండవు. దృశ్య మాధ్యమమైన సినిమాకి కావాల్సిందిదే. అయితే ఈ సినిమాని వివిధ దేశ భాషల్లో డబ్బింగ్ చేసి ఓటీటీలో వుంచాల్సింది. జాతీయంగా, అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో ఇరవై అవార్డులు పొందిన ఈ సృజనాత్మకత వివిధ భాషల్లోకి వెళ్ళాలి.

ఇంతకీ గడ్డప్ప పట్ల తండ్రి సెంచరీ గౌడ పాల్పడిన చెప్పుకోలేని పాపపు కార్యమేమిటి? అదిక్కడ చెప్పేకన్నా నెట్ ఫ్లిక్స్‌లో చూస్తేనే బావుంటుంది.

Exit mobile version