Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం బెహరా గారి ‘మధ్యతరగతి మందహాసం’

[శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారి సర్వలభ్య రచనల సంపుటం ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తక సమీక్షని అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[నేడు, 28 జూన్ 2026, శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారి 91వ జయంతి సందర్భంగా, ఆ సందర్భంగా ఈ సమీక్ష అందిస్తున్నాము.]

శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారి సర్వలభ్య రచనల సంపుటం ‘మధ్యతరగతి మందహాసం’, ఇటీవల ద్వితీయ ముద్రణ ఎమెస్కో ప్రచురణల ద్వారా వెలువడింది. ఇది తెలుగు కథా సాహిత్యంలో ఒక మైలురాయి లాంటి పుస్తకం.

బెహరా వెంకట సుబ్బారావు గారు 1957-97 మధ్య కాలంలో అంటే సుమారు నాలుగు దశాబ్దాల పాటు రచనలు చేశారు. డెబ్భై, ఎనభై దశకాల్లో అగ్రశ్రేణి వారపత్రికలన్నింటిలోనూ ఆయన కథలు పాఠకులను విశేషంగా అలరించాయి. నలభై ఏళ్ళ కాలం సాహితీవేత్తగా క్రియాశీలకంగా కొనసాగడమంటే, అన్నేళ్ళ సమాజ స్థితిగతులను, మార్పులను, ప్రభావశీల శక్తులను సన్నిహితంగా గమనిస్తున్నట్టే. సుబ్బారావు గారు సుమారు 200 కథలు వ్రాశారు. పుస్తకం శీర్షిక తెలుపుతున్నట్టుగానే ఇవి మధ్యతరగతివారి కథలు. సగటు మనుషుల కథలు.

ఇవి రచయిత అత్యంత సమీపం నుంచి చూసినవారి జీవితానుభవాలు. ఆయా కాలాలలో మనుషుల ప్రవర్తనలు, నడవడిక, విలువలు, వృత్తి సమస్యలు, వేతన సమస్యలు, కుటుంబ సమస్యలు, చదువులు, ఆరోగ్యం.. అన్నీ కధాంశాలుగా మారాయి. వీరి కథలకు సమాజమే ముడిసరుకు. సమాజంలోని మనుషులే కథల్లోని పాత్రలు.

సుబ్బారావు గారు తాను నమ్మినవాటినే రాశారు, రాసినవాటిని నమ్మారు, పాటించారని ఈ కథలు చదివితే పాఠకులు గ్రహిస్తారు.

మధ్యతరగతి వర్గంలో కష్టాలూ కన్నీళ్ళు ఉన్నట్టే, మనోధైర్యం కూడా ఉంటుంది, అందుకే కష్టాల్లోనూ నవ్వగలరు. అందుకే ‘మధ్యతరగతి మందహాసం’ అన్న పదబంధం అంత ప్రజాదరణ పొందింది.

“కథ, నవల, హరికథ, బుర్రకథ.. ఏ సాహిత్య ప్రక్రియ అయినా సమాజానికి మేలు చేసేదిగా ఉండాలన్నదే నా అభిప్రాయం. వేయిమంది పాఠకుల్లో ఒక్కరైనా ప్రభావితమవుతే రచయిత ధ్యేయం నెరవేరినట్టే” అని బెహరా వెంకట సుబ్బారావు గారు పేర్కొన్నారు. ఆయన విశ్వాసం ప్రకారమే ఈ కథలు సాగుతాయి. సామాజిక ప్రయోజనాన్ని, సాంఘిక చైతన్యాన్ని ఆశించి వ్రాసిన కథలివి. మానవ సంబంధాలకి అత్యంత ప్రాధాన్యనిచ్చిన కథలివి.

‘మధ్యతరగతి మందహాసం’ కథా సంపుటిలోని అనేక కథల్లో సాధారణ మనుషుల త్యాగాలు, ఒకరికొకరు తోడుగా నిలిచే గుణాన్ని అద్భుతంగా చిత్రించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పక్కవారికి సాయం చేయడంలో వెనకాడని మధ్యతరగతి మానవత్వాన్ని రచయిత గొప్పగా ప్రదర్శించారు.

~

బెహరా వెంకట సుబ్బారావు గారి రచనా శైలి అత్యంత సరళంగా, హృద్యంగా మరియు పాఠకుడి మనసును హత్తుకునేలా ఉంటుంది. సమాజంలోని మధ్యతరగతి జీవితాలను, వారి సుఖదుఃఖాలను ఏ విధమైన కృత్రిమత్వం లేకుండా దర్పణం పట్టడం ఆయన శైలిలోని ప్రత్యేకత. ఆయన రచనా శైలిలోని ముఖ్యమైన లక్షణాలు ఇవి:

సరళమైన వాడుక భాష:

ఆయన కథల్లో గ్రాంధిక భాషాడంబరం ఎక్కడా కనిపించదు. నిత్యజీవితంలో సాధారణ ప్రజలు మాట్లాడుకునే అచ్చతెలుగు వాడుక భాషలోనే కథాగమనం సాగుతుంది. దీనివల్ల సామాన్య పాఠకుడు సైతం కథతో సులభంగా మమేకం అవగలుగుతాడు.

వాస్తవికత:

బెహరా గారి కథలు ఊహాలోకంలో విహరించవు. మన చుట్టూ ఉన్న సమాజం, మన ఇరుగుపొరుగున ఉండే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులే ఆయన కథల్లో పాత్రలుగా కనిపిస్తారు. పాత్రల మనస్తత్వాలను, వారి ఆర్థిక ఇబ్బందులను అత్యంత సహజంగా చిత్రీకరించారు.

ఆహ్లాదకరమైన చమత్కారం, సున్నితమైన హాస్యం:

కధ ఎంత గంభీరమైనదైనా, మధ్యమధ్యలో ఆయన చొప్పించే సున్నితమైన హాస్యం, లోకాభిరామాయణ చమత్కారాలు పాఠకుడికి విసుగు రానివ్వవు. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లలో జరిగే సంభాషణల్లోని హాస్యాన్ని ఆయన అద్భుతంగా పండించారు.

నాటకీయత, ఆసక్తికరమైన కథనం:

కథ ప్రారంభం నుండి ముగింపు వరకు పాఠకుడిలో ఉత్సుకతను కాపాడటం ఆయన శైలి. కథా ముగింపులు చాలావరకు ఆలోచింపజేసేవిగా, మనసును ఆర్ద్రతతో నింపేవిగా ఉంటాయి. ‘దొడ్డమనసు’, ‘పాఠం’ వంటి కథల్లోని ముగింపులు దీనికి చక్కని ఉదాహరణలు.

ఉత్తరాంధ్ర మాండలిక పరిమళం:

ఆయన కథల్లో అక్కడక్కడా ఉత్తరాంధ్ర ప్రాంతపు జీవన విధానం, అక్కడి ఆచార వ్యవహారాలు మరియు భాషా సొగసులు సహజ సిద్ధంగా కనిపిస్తూ కథకు స్థానికతను, అందాన్ని చేకూరుస్తాయి.

ప్రచార ఆర్భాటం లేని సందేశం:

ఏ కథలోనూ రచయిత నేరుగా వచ్చి నీతులు చెప్పరు. పాత్రల ప్రవర్తన, కథలోని సంఘటనల ద్వారానే మానవీయ విలువలను, సామాజిక స్పృహను పాఠకుడి అంతరాత్మకు తాకేలా సున్నితంగా ప్రబోధిస్తారు. వారి 72 కధలు, 1 నవలల సంపుటి అయిన ‘మధ్యతరగతి మందహాసం’ చదివితే, ఒక నిఖార్సైన మధ్యతరగతి జీవితాల చిత్రకారుడి కలం సత్తా ఏమిటో మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.

రక్తపాతం లేని మానవీయత:

బెహరా వారి కథల్లో తిరుగుబాటు, హింస, రక్తపాతం, లేదా కులమత విద్వేషాలకు ఎక్కడా తావుండదు. ఆయన కథల్లో మనుషుల మధ్య, ముఖ్యంగా తరాల మధ్య వచ్చే వ్యత్యాసాలను ఎక్కువగా చర్చించడం వల్ల చాలా కథలు ‘అంతరాలు’ ఎక్కువగా గోచరిస్తాయి. ఆయన కథల్లో మరీ ధనవంతులు లేదా విలన్లు ఉండరు; కేవలం ఉపాధ్యాయులు, గుమాస్తాలు, పోలీసు కానిస్టేబుళ్లు, చిన్న టీ కొట్టు నడుపుకునే దిగువ మధ్యతరగతి మనుషులే కనిపిస్తారు. ఉన్నంతలో ఆనందంగా, నిజాయితీగా ఎలా బతకాలి అనే ఆరాటమే వారి ‘మందహాసం’. ఈ పుస్తకంలోని కొన్ని కథలను ప్రస్తావిస్తాను.

~

1. దొడ్డమనసు:

ఆర్ధిక అంతరాలు, మనస్తత్వాల చుట్టూ తిరిగే అద్భుతమైన కథ ఇది.

సారాంశం: కథానాయకి సుజాతకు తన వదిన ఇచ్చిన ఒక బహుమతి విషయంలో కొంత అసంతృప్తి, నొచ్చుకోవడం జరుగుతుంది. అయితే, ఆమె ఇంట్లో పనిచేసే ‘గౌరి’ అనే పనిమనిషి ఒక సందర్భంలో ఊహించని రీతిలో గొప్ప గుణపాఠం నేర్పుతుంది. అంతస్తులు, చదువుల కంటే మనిషికి ఉండాల్సింది పెద్ద మనసు (దొడ్డమనసు) అని, పేదరికంలోనూ ఇతరుల సంతోషాన్ని కోరుకునే గొప్ప సంస్కారం ఉంటుందని ఈ కథ నిరూపిస్తుంది.

2. విలువలు:

ఈ కథ ప్రముఖ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారి ప్రథమ వర్ధంతి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది.

సారాంశం: ఆధునిక సమాజంలో మనుషులు ఆస్తులు, డబ్బు వెనుక పరుగెడుతూ నైతిక విలువలను ఎలా మర్చిపోతున్నారో ఇందులో చూపించారు. మనిషికి ఉండాల్సిన నిజమైన ఆస్తి అంతస్తులు కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన మానవత్వమని రచయిత ఈ కథ ద్వారా చాలా బలంగా చెప్తారు.

3. కర్తవ్యం:

గురు-శిష్యుల బంధం, వృత్తి ధర్మం నేపథ్యంగా సాగుతుంది.

సారాంశం: ఒక పేద ఉపాధ్యాయుడు సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతుంటాడు. ఆయన పాత శిష్యుడు ఒకరు కాలక్రమేణా పెద్ద ప్రభుత్వ అధికార హోదాలోకి వస్తాడు. ఉపాధ్యాయుడి కొడుకుకు ఏదైనా సహాయం (ఉద్యోగ పరంగా లేదా ఇతరత్రా) చేయమని అడిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆ గురువు తన శిష్యుడి దగ్గరకు వెళ్లి “నీ అధికార ధర్మానికి, వృత్తి విలువలకు విరుద్ధంగా నా కొడుకు కోసం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు” అని హితవు పలుకుతాడు. స్వార్థం కంటే కర్తవ్య నిర్వహణ, అవినీతి రహిత సమాజం ముఖ్యం అని చాటిచెప్పే కథ ఇది.

4. అత్తగారూ – అరటిచెట్టూ:

గృహ వాతావరణంలో, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లోని చిన్న చిన్న ఆనందాలు, బంధాల మధ్య ఉండే ఆర్ద్రతను ఈ కథ ఆవిష్కరిస్తుంది.

సారాంశం: సాధారణంగా సమాజంలో అత్తాకోడళ్ల బంధాన్ని నెగెటివ్‌గా చూపిస్తుంటారు. కానీ బెహరా గారు ఈ కధలో నిత్యజీవితంలో మన ఇంట్లో జరిగే ఒక చిన్న సంఘటనను (అరటిచెట్టు నేపథ్యంగా) తీసుకుని, కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన ఆత్మీయతను, గౌరవాన్ని ఎంతో సున్నితమైన హాస్యంతో మరియు సహజత్వంతో చిత్రించారు.

5. ప్రాణం ఖరీదు:

సమాజంలోని సామాజిక స్పృహ, మానవతా దృక్పధాన్ని ప్రశ్నించే కథ.

సారాంశం: అత్యవసర సమయాల్లో లేదా ప్రమాదాలు జరిగినప్పుడు మనుషుల ప్రాణాలు కంటే చట్టాలు, నిబంధనలు లేదా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ తీరును ఈ కథలో ఎండగట్టారు. తోటి మనిషి ప్రాణాన్ని కాపాడటమే అన్నిటికంటే మిన్న అనే సందేశాన్ని హృదయానికి హత్తుకునేలా రచయిత వివరించారు.

బెహరా వెంకట సుబ్బారావు గారి కథలన్నీ ‘నరుడి పరిణామ క్రమంలో నైతికత’ను పెంచేవిగా ఉంటాయి. ఆయన కథలు చదివితే మనకు ఏదో ఒక నీతిని బలవంతంగా రుద్దినట్టు కాకుండా, మన ఇంట్లోనో లేదా పక్కింట్లోనో జరిగిన సంఘటనను చూసి మనమే స్వయంగా ఆలోచనలో పడినట్లు అనిపిస్తుంది.

బెహరా వెంకట సుబ్బారావు గారి కథల్లో స్త్రీ పాత్రలు:

బెహరా వెంకట సుబ్బారావు గారి కథల్లో స్త్రీ పాత్రలు కుటుంబ బంధాలకు వారధులుగా వ్యవహరిస్తాయి. వారి కథల్లో స్త్రీ పాత్రలు మన ఇంట్లోని మనుషుల్లాగే కనిపిస్తాయి. నిత్యజీవితంలో కుటుంబ బాధ్యతలు మోస్తూ, ఎదురయ్యే ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఓర్పుతో తట్టుకునే గృహిణులుగా వారు కనిపిస్తారు. ‘పెద్ద కొడుకు’, ‘అత్తగారూ – అరటిచెట్టూ’ వంటి కథల్లో అత్తలు, కోడళ్లు, కూతుళ్లు, మరదళ్లు (ఉదాహరణకు: మాలతి, భారతి, అనసూయమ్మ, రమ) కుటుంబ విలువలను కాపాడే పాత్రలుగా చిత్రించబడ్డారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలబడటంలో ఈ స్త్రీ పాత్రలు కీలక పాత్ర పోషిస్తారు. ఆత్మాభిమానం, సామాజిక స్పృహ, మానవీయ విలువలు కలిగిన సజీవమూర్తులుగా పాఠకుల మనసుల్లో నిలిచిపోతాయి.

~

‘నిశ్శబ్ద సంగీతం’ నవల:

ఈ నవల ‘రేణుక’ అనే ఒక మధ్యతరగతి యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని, తన కాళ్లపై తాను నిలబడాలని ఆకాంక్షిస్తుంది. హైదరాబాద్ వంటి పెద్ద నగరంలో ఒంటరిగా ఆమె పడే కష్టాలు, సమాజం నుండి ఎదురయ్యే సవాళ్లు, ఆశలు, నిరాశలను రచయిత ఎంతో వాస్తవికంగా చిత్రించారు. ఈ ప్రయాణంలో రేణుకకు కొన్ని అనుకోని పరిచయాలు ఏర్పడతాయి. పాత బంధాలు కొన్ని మళ్లీ బలపడతాయి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, నైతిక విలువలను వదులుకోకుండా రేణుక తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందనేదే ఈ నవల యొక్క సారాంశం.

‘నిశ్శబ్ద సంగీతం’ లోని ‘రేణుక’ పాత్ర ఆత్మవిశ్వాసానికి చక్కని ఉదాహరణ. హైదరాబాద్లో టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను, పాత కొత్త బంధాలను బ్యాలెన్స్ చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆధునిక యువతిగా రేణుక పాత్రని గొప్పగా చిత్రించారు రచయిత.

~

బాలల కథ ‘దారి తప్పకు’:

రఘు అనే విద్యార్థి చెడు స్నేహాల వల్ల తప్పుదోవ పట్టి, చివరకు పెద్దల సలహాలతో క్రమశిక్షణను అలవర్చుకుని సరైన మార్గంలోకి ఎలా వచ్చాడనే అంశాన్ని తెలియజేస్తుంది. ఈ కథలో రఘు, నారాయణ మూర్తి (తండ్రి), లక్ష్మి (తల్లి), ఆనంద్ (స్నేహితుడు) మరియు గోపాల్ మాస్టారు (గురువు) ప్రధాన పాత్రలు. బాల్యంలోనే మంచి బుద్ధులు నేర్పాలని, లేకపోతే, తరువాతి కాలంలో అవి అలవడవని ఈ కథ సూచిస్తుంది.

ముగింపు:

రచయిత తూర్పు గోదావరి జిల్లా వారైనా, ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం ఉత్తరాంధ్రలో నివసించడం వల్ల చాలా కథల్లో ఉత్తరాంధ్ర నుడికారం, ఆ ప్రాంతపు జీవన శైలి అద్భుతంగా ప్రతిఫలిస్తాయి.

వీరి కథలు ఎంత గొప్పవో, నేటికీ వీటి ప్రాసంగికత ఎంత ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇటీవల ఒక స్టాండప్ కామెడీ ప్రోగ్రామ్‌లో ఓ యువ వైద్యురాలు తమ పరీక్షలు జరిపి మగశవాల జననాంగాల పరిమాణం గురించి అసభ్యంగా మాట్లాడిన సంగతి తెలిసినదే. ఉన్నత చదువులు చదివినా, సంస్కారం లోపించిందామెలో. తర్వాత క్షమాపణలు చెప్పినా, ఆమెపై కల్గిన అభిప్రాయం మాత్రం పోవడం కష్టం. ఇలాంటి సందర్భాలలోనే మంచి సాహిత్యం విలువ తెలుస్తుంది.

నదీనాం సాగరో గతిః’ అన్న కథలో రఘు అనే యువ వైద్యుడు తన తండ్రితో పలికిన ఈ మాటలు చదవండి: “మేం చదువుకొనే రోజుల్లో ఎన్నో శవాల్ని కోసి చూశాం! అవి ఏ కులానికి చెందినవో తెలీదు, అది మా కనవసరం. అందరి శరీరాలు ఒక్కలాగే ఉంటాయి.. శరీర పరిశుభ్రత కోసం స్నానం చేస్తాను కానీ, వారెవరినో తాకినందుకు కాదు! ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు చెప్పండి?

ఈ ఒక్క డైలాగ్ చాలు మంచి సాహిత్యం ఏమి చేయగలదో చెప్పడానికి. ఒకవేళ ఆ వైద్యురాలు ఇలాంటి సన్నివేశాలో, సంభాషణలో ఉన్న కథ చదివి ఉంటే అలా మాట్లాడేది కాదు. అందుకే ఇలాంటి ఉత్తమ సాహిత్యం ఇతర భాషలలోకి అనువాదమవ్వాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.

బెహరా గారు మధ్యతరగతికి ప్రతినిధి. ఆయన కేవలం మధ్యతరగతి గురించి రాయలేదు. తానే ఒక మధ్యతరగతి మనిషిగా బతికి, ఆ జీవితానికి ‘విలువలు’ చేకూర్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు గారుల వంటి దిగ్గజాల మధ్య విజయనగరం కేంద్రంగా బెహరా వెంకట సుబ్బారావు గారు ఒక విలక్షణమైన ముద్ర వేశారు.

చివరగా చెప్పాలంటే, బెహరా వెంకట సుబ్బారావు గారి కథలు కేవలం చదివి వదిలేసేవి కావు. అవి. మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. సమాజంపై ఒక మానవీయ దృక్పధాన్ని కలిగిస్తాయి. విలక్షణమైన కథకుడిగా ఎదిగిన బెహరా గారి ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకం ప్రతి తెలుగువారూ తప్పక చదవాల్సిన అమూల్యమైన గ్రంథం.

***

మధ్యతరగతి మందహాసం
రచన: బెహరా వెంకట సుబ్బారావు
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 744
వెల: ₹ 500/-
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్ ప్రై. లి.,
33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్. రోడ్, చుట్టుగుంట,
విజయవాడ 520004
ఫోన్: 0866-2436643

Exit mobile version