[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మన భారత అవని’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[నవదంపతులు శ్రీరామ్, రోజ్లు ప్రతిరోజూ సాయంత్రం లండన్ లోని సుందర ప్రదేశాలు దర్శిస్తారు. ఒక రోజు యక్షప్రశ్నల గురించి అడుగుతుంది రోజ్. సవివరంగా చెప్తాడు శ్రీరామ్. తనకి పాప కావాలని అంటాడు శ్రీరామ్. ఆ సమయంలోనే తాను నెల తప్పినట్టు చెప్తుంది రోజ్. మర్నాడు ఓ లేడీ డాక్టర్ని కలవగా, ఆమె పరీక్ష చేసి, గర్భధారణను కన్ఫామ్ చేస్తుంది. రోజ్ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతుంది. వాళ్ళెంతో సంతోషిస్తారు. ఆరు నెలలు గడిచాకా, రోజ్కు సీమంతం చేస్తారు. నవమాసాలు నిండాకా, రోజ్ ఆడపిల్లని ప్రసవిస్తుంది. పాప పుట్టిన పదహారవ రోజున బారసాల జరిపించి పాపకి గంగ అనే పేరు పెడతారు. గంగకి తొమ్మిది నెలలు వచ్చేసరికి రోజ్ మళ్ళీ నెల తప్పుతుంది. నవమాసాలు నిండుతాయి. ఆడ, మగ కవలపిల్లలు పుట్టబోతున్నారని వైద్యులు చెబుతారు. కాన్పు కష్టమై, సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ సమయంలో ఏదో పొరపాటు జరిగి రోజ్ మరణిస్తుంది. పిల్లల్ని రెండు రోజులు తాము చూసుకుంటామని; జరుగవలసిన కార్యక్రమాలను ముగించి, రెండు రోజుల తర్వాత వచ్చి మీ బిడ్డలను తీసుకొని వెళ్ళమని నర్సులు చెప్తారు. అమితమైన దుఃఖంతో రోజ్ అంత్యక్రియలు పూర్తి చేస్తాడు శ్రీరామ్. – ఇక చదవండి.]
అధ్యాయం-7
నాల్గవరోజు (రోజ్ మరణించిన తరువాత) దుర్గ, థామస్లు హాస్పిటల్కి వెళ్ళి పుట్టిన బిడ్డలను శ్రీరామ్ ఇంటికి తెచ్చారు. ఒకటిన్నర సంవత్సరం వయస్సు ఉన్న గంగను, ఆ బిడ్డలను పోతపాలుతో సంరక్షించడం, కూతురు పోయిన వేదన మనస్సున ఉన్న కారణంగా దుర్గ పుట్టిన బిడ్డలను సరిగా సంరక్షించలేకపోయింది. భార్యాపిల్లల ఏడుపులను చూచిన థామస్ కన్నీటితో బాధపడేవాడే కానీ, ఆ పసికందుల సంరక్షణలో అతను దుర్గకు కావలసిన సహకారాన్ని (కూతురు పోయిన బాధలో) అందించలేకపోయాడు.
శ్రీరామ్.. రోజ్ను తలుచుకొంటూ కన్నీరు కార్చుకొనేవాడు. రోజ్ మరణం కారణంగా అతనికి ఆ బిడ్డలను చూడాలనించేది కాదు. మనస్సున అర్థాంగి వియోగ భారం తీరని వేదన..
ఆ పసిపిల్లల ఆరోగ్యం, పశుపాలు పోసినందున క్రమంగా క్షీణించింది. హాస్పిటల్లో చేర్చారు. రెండు రోజుల తర్వాత ఆ ఇరువురు బిడ్డలు మరణించారు.
ఆ వార్త విన్న శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. పరుగున ఆ బిడ్డలను (శవాలను) సమీపించాడు. అచేతనంగా పడివున్న వారిని చూచి భోరున ఏడ్చాడు.
థామస్ ఆ శిశువుల అంతిమ సంస్కార కార్యాన్ని నిర్వహించాడు ఎంతో ఆవేదనతో..
ఆ రోజు..
తన గదిలో వున్న శ్రీరామ్ను సమీపించింది గంగ.
వచ్చీ రాని మాటలతో.. “నాన్నా!.. అ.. మ్మ.. ఏది?” అడిగింది.
శ్రీరామ్ గంగ ముఖంలోకి కన్నీటితో చూచాడు. గంగను తన దగ్గరకు తీసుకొన్నాడు. హృదయానికి హత్తుకొన్నాడు. ఆవేదనతో కంఠం బొంగురుపోయింది.
“అమ్మా!.. అమ్మా.. అమ్మా.. దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందిరా!..” అన్నాడు.
“ఎప్పుడు వస్తుంది?”
గంగ అడిగిన ఆ ప్రశ్నకు శ్రీరామ్ ఏం జవాబు చెప్పగలడు! తలదించుకొని ఏడ్చాడు.
గంగ కూడా ఏడవసాగింది.
అక్కడకి వచ్చిన థామస్, దుర్గలు ఆ తండ్రి కూతుళ్ళ సంభాషణ విన్నారు. వయస్సులో పెద్దవారు, జీవితానుభవం వున్న వారు, ఇరువురి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. వారి మనోవేదనకు సాక్షి వారి కళ్ళనుండి కారే కన్నీరు..
ఆ ఇరువురూ తమాయించుకొని శ్రీరామ్, గంగలను సమీపించారు.
దుర్గ.. గంగను తన చేతుల్లోకి తీసుకొంది. ఇంట్లోని పెంపుడు జంతువులు, కుక్క, పిల్లిలను చూపించింది. అవి అరిచినట్లు తాను అరిచింది.
గంగ వదనం ఆనందాన్ని చూచింది.
థామస్ శ్రీరామ్ ప్రక్కన కూర్చున్నాడు. అతని భుజంపై చెయ్యి వేశాడు.
“శ్రీరామ్!.. జనన మరణాలు మన చేతుల్లో లేవు అన్న విషయం మీకు తెలియనిది కాదు. మీరు రోజ్ను ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు మై సన్!.. ఇప్పుడు రోజ్ బదులుగా గంగ మన ముందు ఉంది. ఆ చిన్నారిని ఆదరించి అభిమానించి, పెంచి పెద్దచేయవలసిన బాధ్యత మీ మీద వుంది. మీ మనోవేదన నాకు తెలుసు. నిగ్రహించుకొని మీరు మీ కూతురు కోసం మామూలు మనిషిగా మారాలి. ఆ బిడ్డకు ఎలాంటి బాధ కలుగకుండా సాకి సంతరించవలసిన బాధ్యత మనది. ముఖ్యంగా తండ్రిగా అది మీ కర్తవ్యం. నేను చెప్పినవన్నీ మీకు తెలిసిన విషయాలే!.. ఆవేదనను దిగమ్రింగి మీరు మీ బిడ్డ గంగతో ఎక్కువ సమయం గడపాలి. ఉద్యోగానికి వెళ్ళాలి. ఒక్కమాటలో చెప్పాలంటే గంగ పెరుగుదల కోసం, మీరు మామూలు మనిషి కావాలి. ఆమెకు తల్లి, తండ్రి మీరే కావాలి. మీ ఇరువురికీ సహాయంగా మా జీవితాంతం నేను దుర్గ వుంటాము. మీరు గంగ ఆనందంగా వుంటే మేమూ ఆనందంగా బ్రతుకగలం. అంటే ముగ్గురి జీవిత విధానాలు మీ ఒక్కరిమీదా ఆధారపడి వున్నాయి” ఎంతో అనునయంగా చెప్పాడు థామస్.
“అవును, అంకుల్ మీరు చెప్పిన ప్రతి అక్షరం సత్యం. రోజ్ చివరి కోరిక.. బిడ్డలను జాగ్రత్తగా చూచుకోండి, పుట్టిన బిడ్డలు ఇరువురూ ఆ తల్లి దగ్గరకు వెళ్ళిపోయారు.”
‘ఇప్పుడు వున్నది ఒక్క గంగ మాత్రమే. గంగను ప్రాణప్రదంగా చూచుకోవాలి. పెంచి పెద్ద చేయాలి. బాగా చదివించాలి. ఆమెను ఉఛ్ఛస్థితికి చేర్చాలి. గంగ ఆత్మకు శాంతిని కలిగించాలి. అదే నా ప్రస్తుత కర్తవ్యం. మాకోసం ఎంతో కష్టపడుతున్న దుర్గ ఆంటీ, థామస్ అంకుల్ను ప్రేమాభిమానాలతో చూచుకోవాలి. అది నా ధర్మం కర్తవ్యం..’ అనుకొన్నాడు శ్రీరామ్.
“మీ మాట ప్రకారమే నడుస్తాను అంకుల్. థాంక్యూ” లేచి వేగంగా రెస్ట్ రూము వైపుకు నడిచాడు. శ్రీరామ్.
మరుదినం.. ఐదుగంటలకు లేచి కాలకృత్యాదులు స్నానం చేసి, అరగంట పూజా మందిరంలో కూర్చొని భగవత్ ధ్యానం చేశాడు. హాల్లోకి వచ్చాడు.
“బాబూ!..” పలకరించింది దుర్గ.
“ఆంటీ!.. ఈరోజు నేను యూనివర్శిటీకి వెళతాను. తొమ్మిదింటికి బయలుదేరుతాను.”
“టిఫిన్ రెడీ బాబూ!.. పెట్టనా!..” ప్రీతిగా అడిగింది దుర్గ.
“గంగ!..”
“నిద్రపోతూ వుంది బాబూ!..”
శ్రీరామ్ పడుకొని వున్న గంగ గదిలోనికి వెళ్ళాడు. గంగ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. కొన్ని క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూచాడు. కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి.
“అంతా తల్లి పోలిక!..”
మెల్లగా వంగి గంగ నుదిటిపైన ముద్దుపెట్టాడు.
‘నా బిడ్డ గంగ నా ప్రాణం. నా రోజ్ తీపి గురుతు’ అనుకొన్నాడు.
గదినుండి బయటికి నడిచాడు.
దుర్గ హాల్లో సోఫాలో కూర్చొని ఉంది.
“ఆంటీ!.. అంకుల్ ఎక్కడ?” అడిగాడు శ్రీరామ్.
“ఆ ఇంటికి వెళ్ళారు బాబు!.. రెండు గంటల్లో వచ్చేస్తారు” అంది దుర్గ.
“ఆంటీ నాకు టిఫిన్ పెట్టండి!…”
“అలాగే బాబూ!..” వేగంగా వంటగదికి వెళ్ళి ప్లేట్లో ఉప్మా, చట్నీని సాంబార్ గిన్నెలను చేత పట్టుకొని డైనింగ్ టేబుల్పై వుంచింది.
శ్రీరామ్ టిఫిన్ తిన్నాడు.
“ఆంటీ!.. నేను యూనివర్శిటీకి వెళ్ళి వస్తాను.”
“మంచిది బాబు జాగ్రత్త!” చెప్పింది దుర్గ.
శ్రీరామ్ కార్లో యూనివర్శిటీకి వెళ్ళిపోయాడు. తన రూంలో కూర్చున్నాడు.
డీన్ జార్జి.. ఇతర ప్రొఫెసర్లు, లెక్చరర్స్, స్టూడెంట్స్ వచ్చి, వారంతా శ్రీరామ్ను, రోజ్ మరణ విషయంలో విచారంగా పరామర్శించారు.
అందరికీ శ్రీరామ్ చెప్పిన సమాధానం..
“అంతా దైవ నిర్ణయం సార్!..” ఎంతో గంభీరంగా చెప్పాడు.
అందరి హృదయాల్లోనూ బాధ. శ్రీరామ్ పట్ల సానుభూతి. అభిమానం.
“మీ అందరి ఆదరాభిమానాలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ అందరి విషయంలో నేను నా స్వధర్మాన్ని సవ్యంగా నిర్వహిస్తాను.” ఎంతో సౌమ్యంగా చెప్పాడు శ్రీరామ్.
ప్రతి ఉదయం పదిగంటలకు యూనివర్శిటీకి వెళ్ళేవాడు. సాయంత్రం ఐదు గంటల వరకూ, తన విధులను నిర్వహించి ఇంటికి తిరిగి వెళ్ళేవాడు.
శ్రీరామ్ జీవితంలో రోజులు, వారాలు, నెలలు భారంగా జరిగాయి. దుర్గ, థామస్౬లు అతన్ని, గంగను ఎంతో అభిమానంగా చూచుకొనేవారు.
శ్రీరామ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం గంగ చేరువనే గడిపేవాడు. ఆమెకు రామాయణ, భారత కథలను చెప్పేవాడు. ఆమెకు నిద్రవచ్చినప్పుడు తన విశాలమైన ఛాతిపై పడుకోబెట్టుకొని వీపును
జవురుతూ నిద్రపుచ్చేవాడు. ఆమెకు స్నానం చేయించేవాడు. బట్టను ధరింపజేసేవాడు. తన చేత్తో ఆమెకు ఆహారాన్ని పెట్టి కడుపు నింపేవాడు.
కాల గతిలో మూడు సంవత్సరాలు గడిచాయి. గంగను స్కూల్లో చేర్పించారు.
గంగ చాలా తెలివైన అమ్మాయి. ఏకసంథాగ్రాహి. స్కూలు ఫస్టు. సాటి పిల్లలకు, టీచర్లకు అభిమానపాత్రురాలు.
ఒకనాడు ఆదివారం గంగ స్కూలుకు శలవు. మూడవ తరగతి చదువుతూ ఉంది.
శ్రీరామ్.. రోజ్ వస్తువులనన్నింటినీ తన గదిలో ఒక బీరువాలో వుంచి తాళం వేశాడు.
గంగ శ్రీరామ్ ప్రక్కన కూర్చొని హోంవర్క్ ముగించింది. అప్రయత్నంగా ఆమె చూపులు మూసియున్న బీరువాపై పడ్డాయి.
“నాన్నా!..”
“ఏం తల్లీ!..”
“ఆ బీరువాను మీరు ఎప్పుడూ తెరువగా నేను చూడలేదు. అందులో ఏమున్నాయి?” అడిగింది గంగ. శ్రీరామ్ క్షణంసేపు గంగ ముఖాన్ని, ఆ తరువాత ఆ బీరువానూ చూచాడు. తండ్రి చూపులను గ్రహించింది గంగ.
“చెప్పకూడదా నాన్నా!..” గోముగా అడిగింది.
“చెప్తాను తల్లీ, అందులో మీ అమ్మ జ్ఞాపకాలు వున్నాయి” మెల్లగా రోజ్ని తలచుకొంటూ చెప్పాడు. శ్రీరామ్.
“నేను చూడవచ్చా!..”
శ్రీరామ్ లేచి వెళ్ళి ఆ బీరువా తాళాన్ని తీసి రెండు రెక్కలను తెరిచాడు.
గంగ చిరునవ్వుతో ఆ బీరువాను సమీపించింది. లోనికి చూచింది. రోజ్ పూల అట్టతో ఒక చిన్న ఫోల్డర్ కనిపించింది. గంగ దాన్ని చేతికి తీసుకొంది. ఆ కవర్పైన నాలుగు తెలుగు అక్షరాలు వున్నాయి. అప్పటికి గంగకు తెలుగు అక్షరాలు తెలియవు.
ఫోల్డర్ శ్రీరామ్కు చూపించి…
“నాన్నా!.. ఈ అక్షరాలు తెలుగు కదూ!..”
“అవును తల్లీ!..”
“చదవండి!..”
“నా ప్రార్థన.. మై ప్రేయర్!..” అన్నాడు శ్రీరామ్.
“ఎవరి ప్రేయర్ నాన్నా!..”
“మీ అమ్మ ప్రేయర్ తల్లీ!..”
“అలాగా!..”
“అవును..”
“నాన్నా!..”
“ఏమ్మా!..”
“నాకు మీరు తెలుగు నేర్పించాలి. త్వరగా నేను నేర్చుకొని అమ్మ వ్రాసిన ప్రేయర్ను నేను చదివి నేర్చుకోవాలి. అమ్మలా నేనూ ప్రార్థన చేయాలి!.. నేర్పుతారు కదూ!..”
“తప్పకుండా తల్లీ!.. ఈరోజే ప్రారంభిస్తాను!..”
గంగ ఆ ఫోల్డర్ కళ్ళకు అద్దుకుంది. బీరువాలో యథాస్థానంలో వుంచింది. లాక్ చేసింది. తాళాన్ని తండ్రికి ఇచ్చింది.
“దీన్ని మరలా తెరిచేది నేను తెలుగు బాగా చదువగలిగిన రోజున నాన్నా!..” ఎంతో గంభీరంగా చెప్పింది గంగ.
అప్పటికి ఆమె వయస్సు ఏడు సంవత్సరాలు. మూడవ క్లాస్ చదువుతూ ఉంది.
మనస్సున సర్వేశ్వరులను, సరస్వతీమాతలను తలుచుకొని నోట్ బుక్లో అ, ఆ, లను (అచ్చులను) వ్రాసి, గంగచేత అక్షరాలను పలికించాడు ఒకటికి మూడుసార్లు.
గంగ ఆ తెలుగు అక్షరాల క్రింద ఇంగ్లీషులో ఎలా ఏ అక్షరాన్ని పలకాలో వ్రాసుకొంది.
“థాంక్యూ నాన్నా!..” ఆనందంగా నవ్వుతూ చెప్పింది గంగ.
దుర్గకు కూడా తెలుగు చదవనూ, వ్రాయనూ బాగా తెలుసు. తండ్రి, గ్రాండ్మదర్ల ప్రోత్సాహంతో, సహజంగానే ఏకసంథాగ్రాహి అయిన గంగ ఆరునెలల్లో, తెలుగులో వ్రాయడం చదవడం నేర్చుకొంది. సంవత్సరానికి గంగ మన తెలుగు భాషను క్షుణంగా నేర్చుకుంది. అప్పటికి ఆమె వయస్సు ఎనిమిది. నాల్గవ క్లాసుకు ప్రమోట్ అయ్యింది.
ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు..
“నాన్నా!..”
“ఏమ్మా!..”
“రేపు ఏం వారం?”
“సండే కదమ్మా!..”
“నాకు బీరువా తాళాలు కావాలి!” అడిగింది గంగ.
“తాళాలు ఎప్పుడూ నా దిండు క్రింద వుంటాయి తల్లీ!..” ఎంతో సౌమ్యంగా చెప్పాడు శ్రీరామ్.
“నేను రేపు ఉదయాన్నే బీరువాను తెరువబోతున్నాను!”
“ఎందుకురా!..”
“అమ్మ ప్రేయర్ ఫోల్డర్ను తీసుకొని, నేను ప్రేయర్ చేయబోతున్నాను నాన్నా!.. కాస్త ఎర్లీగా లేస్తాను. మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకూడదని అడిగాను.”
“ఎన్నిగంటలకు లేస్తావు తల్లీ!..”
“నాలుగున్నరకు అలారం పెట్టుకొన్నాను.”
“అంత ఎర్లీగా లేచి ఏం చేస్తావమ్మా!” అడిగింది దుర్గ.
“అమ్మమ్మా!.. నేను అమ్మలా ప్రేపర్ చేయబోతున్నాను. చెప్పానుగా!.. నీవు వినిపించుకోలేదా!..” చిరునవ్వుతో అడిగింది గంగ.
“అలాగా తల్లీ!..” అడిగాడు థామస్.
“అవును తాతయ్యా!..”
“ఓకే అమ్మా.. అల్ ది బెస్ట్!..” నవ్వుతూ చెప్పాడు థామస్.
“నాన్నా!..”
“ఏం తల్లీ!..”
“మీ అభిప్రాయం?”
“చాలా సంతోషం అమ్మా!..”
భోజనపర్వం ముగిసింది.
శ్రీరామ్, థామస్ వారి గదులకు వెళ్ళిపోయారు.
దుర్గ, గంగలు వారి గదికి వెళ్ళి శయనించారు.
***
అలారం నాలుగున్నరకు మ్రోగింది.
గంగ నిద్రలేచి, కాలకృత్యాదులు తీర్చుకొని ఐదుంకాలుకు పూజ గదిలో ప్రవేశించింది.
శ్రీరామ్, దుర్గలు కూడా నిద్రలేచి, గంగ ఏ విధంగా దైవ ప్రార్ధన చేస్తుందో అనే ఆసక్తితో చూడాలనుకొన్నారు.
గంగ గత సాయంత్రం కొన్న రోజ్, చామంతి పూలతో జగత్ పితా మాతల చిత్రానికి పూలను అందంగా అలంకరించింది. తన తల్లి వ్రాసిన పూజా విధాన ఫోల్డర్ను తెరిచింది. నొసటన సిందూరపు బొట్టు పెట్టుకొంది.
పుస్తకంలో తొలి పేజీని చూచింది.. చదవసాగింది.
“శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే!..”
శ్రీ విఘ్నేశ్వరుల పాదాల ముందు పూలను వుంచింది. తర్వాత.. చేతులు జోడించి ఫోల్డర్ను ముందు వుంచుకొని..
1.
ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వఁడు మూలకారణం
బెవ్వఁ డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
2.
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!
వినుత గుణశీల, మాటలు వేయునేల?
3.
నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే న పతియు గతియు నిజముగ కృష్ణా!
4.
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా.
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాపాతు సరస్వతీ.
5.
యాకుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా.
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా
6.
అసతోమ సద్గమయ – తమసోమ జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ – ఓం శాంతి శాంతి శాంతిః
(అర్థం: ఓ దేవా!.. అసత్యము నుంచి సత్యానికి, నన్ను నడిపించు. చీకటి నుంచి వెలుగులోనికి నడిపించు. మృత్యువు నుండి అమృత తత్వానికి (శాశ్వతత్వం వైపు) నన్ను నడిపించు దేవా!..)
శ్రీరామ్… దుర్గలు గంగ గొంతు విప్పగానే ఆ గడిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఏకాగ్రతతో చేతులు జోడించి దీక్షతో దైవాన్ని అర్చిస్తున్న గంగ, వారిని చూడలేదు.
ఆమె ప్రార్థన ముగిసింది.
దైవానికి ఫలాల నివేదనను సమర్పించింది. అప్పుడు తండ్రిని, అమ్మమ్మనూ చూచింది.
గంగ తన మృదుమధుర కంఠంతో ప్రార్థన గీతాలను ఆలపించే సమయంలో.. దుర్గ, శ్రీరామ్౬ల కళ్ళకు ఆమె రోజాగానే కనిపించింది. నయనాలు ఆశ్రుపూరితాలైనాయి. గత స్మృతులు గుర్తుకురావడంతో..
దుర్గ చీర చెంగుతో, శ్రీరామ్ తనపై పంచతో కన్నీళ్ళను తుడుచుకొన్నారు. ప్రీతిగా గంగ ముఖంలోకి చూచారు. గంగ దైవానికి నమస్కరించి తండ్రి శ్రీరామ్, అమ్మమ్మ దుర్గ ముఖాల్లోకి చిరునవ్వుతో చూచింది.
“నాన్నా!.. అమ్మమ్మా!.. ఎక్కడైనా తప్పుగా పలికానా!..” అడిగింది గంగ.
“తల్లీ!.. ఎక్కడా తప్పులేదురా..” వాత్సల్యంతో ఆనంద భాష్పాలతో పలికింది దుర్గ. గంగ శ్రీరామ్ను సమీపించింది.
“నాన్నా!.. మీరేమంటారు?” చిరునవ్వుతో పలికింది.
అతని కళ్ళముందు ఇంకా రోజ్ తన ముందున్నట్లు భ్రమ.. కళ్ళల్లో కన్నీరు..
తండ్రి చేతిని తాకి.. “నాన్నా!.. అమ్మ జ్ఞాపకం వచ్చిందా..” మెల్లగా అడిగింది.
శ్రీరామ్ తొట్రుపాటుతో పైపంచతో కన్నీటిని తుడుచుకొని..
“తల్లీ!.. నీ దైవ ఆరాధన అద్భుతం అమ్మా!..” కూతుర్ని దగ్గరకు తీసుకొని నొసటిపైన ముద్దుపెట్టి, కుడిచేతిని తలపై వుంచి మనసారా దీవించాడు శ్రీరామ్.
దుర్గ, గంగ ప్రార్థనను సెల్లో రికార్డ్ చేసింది.
థామస్ శుచుడై హాల్లో కూర్చున్నాక, అతని ప్రక్కన కూర్చొని గంగ ప్రార్థన గీతాలను వినిపించింది. గంగ స్వరం.. ముమ్మూర్తులా రోజ్ స్వరం..
“దుర్గా!.. నా తల్లి రోజ్ పాడినట్లే వుంది కదా!..” పరవశంతో చెప్పి కన్నీరు కార్చాడు థామస్.
థామస్ గారు చూచేవారికి ఎంతో గంభీరంగా చిరునవ్వుతో కనిపించినా, రోజ్ మరణం వలన వారు లోలోన ఎంతో బాధపడేవారు. అదే రీతిగా శ్రీరామ్, గంగలకు చిన్న వయస్సులో రోజ్ నిర్యాణం ద్వారా, సంక్రమించిన లోటు, వారి ఆవేదనలను తలచుకొని ఎంతగానో విచారపడేవాడు. ఎప్పుడో పండుగ పబ్బాల్లో త్రాగే థామస్ రోజ్ మరణం కారణంగా రాత్రి ఆదమరిచి నిద్రపోయేదానికి ప్రతిరోజూ త్రాగుతున్నారు.
దుర్గ ఎంతగానో వారించేది. కానీ.. థామస్ ఆమె మాటలను పాటించేవాడు కాదు. సరిగా వేళకు తిండి తినేవాడు కాడు. ఆ కారణంగా.. థామస్ గారి ఆరోగ్యం క్షీణించింది. హాస్పిటల్లో చేర్చారు. శ్రీరామ్, దుర్గలు. వారి లివర్ పూర్తిగా డ్యామేజీ అయ్యింది. హాస్పిటల్లో చేరిన ఐదవరోజున మరణించారు. థామస్ చరిత్ర ముగిసింది.
దుర్గ ఆవేదనకు హద్దులులేవు..
శ్రీరామ్ తనను కన్నబిడ్డలా చూచుకొంటున్న ఆమెను ఎంతగానో ఓదార్చాడు. అప్పటికి గంగకు మంచీ చెడ్డలు బాగా తెలిసే వయస్సు. తన చిన్నారి చేతులతో గంగ, దుర్గమ్మ కన్నీటిని తుడిచేది.
“అమ్మమ్మా!.. నాన్న చెప్పారు. మంచివారిని ఆ దేవుడు త్వరగా తన వద్దకు చేర్చుకుంటాడట. మా అమ్మ, మా తాతయ్యలు ఎంతో మంచివారు. అందుకే వారు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. ఏడవకు అమ్మమ్మా!.. నీవు ఏడుస్తుంటే, నాకూ ఏడుపు వస్తూవుంది” గద్గద స్వరంతో పలికి తన చేతులతో దుర్గ కన్నీటిని తుడిచేది గంగ.
అప్పటికి థామస్ మరణించి సరిగ్గా సంవత్సరం. రోజ్ మరణించి ఎనిమిది సంవత్సరాలు.
గడచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో శ్రీరామ్ మామూలు మనిషిగా మారి, ఉద్యోగ ధర్మాలను ఖచ్చితంగా, క్రమంగా చేయకలిగిన దానికి దుర్గ, థామస్లు సహాయకారులు. అలాంటి వారిలో థామస్ గతించడం, శ్రీరామ్కు ఎంతో బాధను కలిగించింది.
దుర్గ మనస్సున కూతురు రోజ్ మరణంతో, ఎంతగానో బాధ ఆవేదన, వాటిని గుండెల్లో దాచుకొని, గంగ సంరక్షణ చేయసాగింది. భర్త థామస్ మరణంతో ఆమె హృదయం ఎంతో భారంతో నిండిపోయింది.
ఒకనాటి రాత్రి గుండెపోటుతో మరణించింది. శ్రీరామ్ ఆమె వియోగంతో కృంగిపోయాడు. ఒక కొడుకుగా ఆమె అంత్యక్రియలు నిర్వహించాడు. నా అనేవారెవరూ (గంగ తప్ప) ఇంగ్లండ్లో లేనందున, గంగ భవిష్యత్తు కోసం భారత్కు వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు.
దుర్గమ్మ మరణం తరువాత శ్రీరామ్, గంగ ఆమె మీద బెంగతో ఒంటరితనానికి, బాధపడుతుందని హాస్టల్లో చేర్పించాడు. అక్కడ ఆమె వయస్సు పిల్లలు చాలా మంది, వార్డెన్స్ వుంటారు. కాబట్టి, గంగ మనోక్లేశం క్రమంగా తగ్గిపోగలదని శ్రీరామ్ భావించాడు. గంగకు పరిస్థితిని అర్థం చేసుకునేలా అనునయంగా చెప్పి ఆమెను ఒప్పించి హాస్టల్లో చేర్చాడు. ఐదవ తరగతి హాస్టల్లో చేరిన తొలి వారం పదిరోజులు డల్గా వున్న గంగ, ఆ తర్వాత తోటి పిల్లల కలయిక, వార్డెన్ అభిమానంతో, వారందరితో కలిసిపోయింది. ప్రతి ఆదివారం శ్రీరామ్ హాస్టల్కు ఉదయాన్నే వెళ్ళి గంగను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు ఇష్టమైన పదార్థాలను వండి, చెంత కూర్చొనబెట్టుకొని ఎంతో అభిమానంతో తినిపించేవాడు. అతని మనస్సున స్వదేశానికి గంగ పరీక్షలు ముగియగానే వెళ్ళిపోవాలనే భావన కలిగింది. ఆ విషయాన్ని గంగతో చెప్పాడు కూడా.
శ్రీరామ్ గదిలో ప్రవేశించి గంగ.. “నాన్నా!..” పిలిచింది.
చేదు గతస్మృతులు ఆ పిలుపును విని చెదిరిపోయాయి. శ్రీరామ్ నయనాల్లో కన్నీరు. టవల్లో కన్నీటిని ఒత్తుకొంటూ..
“ఏం తల్లీ!..” ప్రీతిగా పలుకరించాడు శ్రీరామ్.
“భారత్లో మన వాళ్ళు ఎవరెవరు వున్నారు?” అడిగింది గంగ.
“అమ్మా! అక్కడ నా అక్క, ఆమె భర్త, నా బావ, వారి కూతురు, కొడుకు, నా తమ్ముడు వున్నారు. ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడు దినకర్ విశాఖపట్నంలో వున్నాడు. వాడి భార్య పేరు స్వప్న. వాడికి ఒక కొడుకు సుందర్, నీకంటే రెండేళ్ళు పెద్దవాడు. నేను వాడితో వివరంగా మాట్లాడి వాడి ఇంటి ప్రక్కనే మనకు ఒక ఇంటిని కొన్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరో బాడుగకు వున్నారు. మనం మన భారత్కు వెళ్ళేనాటికి వారు, ఆ మన ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. మనం నేరుగా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏప్రిల్లో నిన్ను మంచి స్కూల్లో చేర్పిస్తాను. నేను ట్యూషన్ సెంటర్ను ఓపెన్ చేస్తాను. మన వారి మధ్యన నీవు అక్కడ వుండి ఆనందంగా చదువుకోవచ్చు. మన ఇరువురం కలిసి ఉండవచ్చు. ఆనందంగా జీవితాన్ని సాగించవచ్చు తల్లీ!..” అనునయంగా కూతురుకు చెప్పాడు శ్రీరామ్.
“ఓకే నాన్నా!.. అలాగే!..” నవ్వుతూ చెప్పింది గంగ.
ఆదివారం సాయంత్రం ఐదున్నరకు గంగను హాస్టల్లో దించేవాడు శ్రీరామ్.
ఆ రీతిగా పదినెలలు గడిచాయి. గంగకు పరీక్షలు ప్రారంభం అయినాయి. పదిరోజుల్లో ముగిసిపోయాయి. గంగ బాగా చదివి అన్ని పరీక్షలూ బాగా వ్రాసింది.
ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకు తండ్రి కూతుళ్ళు బయలుదేరి మిత్రుడు అశోక్ ఇంటికి వెళ్ళాడు.
అశోక్ అతని భార్య కుసుమ వారిరువురినీ ఎంతో అభిమానంతో ఆహ్వానించారు.
అశోక్ కొడుకు కోమల్, గంగకు పరిచయం వున్నవాడే. కోమల్ గంగ కన్నా రెండు సంవత్సరాలు పెద్ద.
కోమల్ ప్రీతిగా గంగను పలకరించాడు. అతను ఎనిమిదవ క్లాసు పరీక్షలు వ్రాశాడు.
“గంగా!..”
“చెప్పు కోమల్!..”
“రా!.. మనం క్యారమ్స్ ఆడుకొందాం!..” నవ్వుతూ పిలిచాడు.
గంగ శ్రీరామ్ ముఖంలోకి చూచింది.
చిరునవ్వుతో శ్రీరామ్ తలాడించాడు.
కోమల్ గంగ, కోమల్ గదిలోనికి వెళ్ళిపోయారు.
శ్రీరామ్, అశోక్తో తన నిర్ణయాన్ని మరోసారి తెలియజేశాడు.
చివరగా.. “అశోక్!.. ఈ మధ్యన నాకు నా వాళ్లంతా పదే పదే గుర్తుకు వస్తున్నారు!” విచారంగా చెప్పాడు. శ్రీరామ్.
కొన్ని క్షణాలు ఆలోచించి అశోక్.. “ఓకే!.. నీ నిర్ణయం మంచిదేరా!.. ఆల్ ది బెస్ట్ క్యారీయాన్” నవ్వుతూ చెప్పాడు అశోక్. మధ్యాహ్నం అందరూ కలిసి భోంచేశారు ఆనందంగా.
కోమల్, గంగలు సరదాగా ఆడుకోసాగారు.
నాలుగు గంటలకు టీ త్రాగి శ్రీరామ్, గంగలు వారి ఇంటికి చేరారు.
మరుదినం గంగ, శ్రీరామ్లు, గంగ చదువుతున్న స్కూలుకు వెళ్ళి టి.సి తీసుకొన్నారు. ఆ రోజు వారి భారత్ ప్రయాణం.
అశోక్, కుసుమ, కోమల్, శ్రీరామ్, గంగ లండన్ హిత్రో విమానాశ్రయం చేరారు.
మిత్రులు ఇరువురూ కౌగలించుకొన్నారు. ఆ సమయంలో ఆ ఇరువురి సమయాల్లో కన్నీరు. అలాంటి స్థితే కుసుమ, కోమల్, గంగల పరిస్థితి. కుసుమ, గంగను దగ్గరకు తీసుకొని నొసటన ముద్దుపెట్టి, తలపై కుడిచేతిని వుంచి మనసారా దీవించింది.
ఫ్లైట్ అనౌన్స్మెంటు జరిగింది. హితులకు చెప్పి లగేజీతో శ్రీరామ్ గంగలు ఏయిర్ పోర్టులో ప్రవేశించారు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 26 నవలలు, 230 కథలు, 21 నాటికలు/నాటకాలు, 85 కవితలు రాశారు. ప్రస్తుతం 27వ నవల ‘అపర చాణుక్య’ వ్రాస్తున్నారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.
