166
భూమి తన కలల స్వర్గాన్ని నిర్మించుకుందుకు
అపరిమితంగా ఖాళీగా ఉండిపోతుంది ఆకాశం
167
అదొక శకలమే అని చెబితే
సంపూర్ణతకోసం ఎదురుచూస్తున్న
చంద్రవంక బహుశా అనుమానంతో నవ్వుతుంది
168
పగటి పొరపాట్లను సాయంత్రం మన్నించనీ
అలా తనకుతానే శాంతిని సాధించనీ
169
అందం నవ్వుతుంది
తీయని అసంపూర్ణ హృదయ నిర్బంధంలో మొగ్గని ఉంచినందుకు
170
నీ ప్రేమ
నా సూర్యపుష్పాన్ని దాని రెక్కలతో ఎగురుతూ తాకుతూ పోతూ
ఎన్నడూ అడగలేదు దాని తేనె అప్పగించటానికది సిద్ధమేనా అని
171
పూల చుట్టూ
నిశ్శబ్దాలు ఆకులు
అవి వాటి పదాలు
172
చెట్టు
దాని వేయి సంవత్సరాల్ని
ఒక మహా మహత్తరమైన క్షణంలా మోస్తుంది
173
నా నివేదనలు
దారి చివరన ఉన్న గుడి కోసం కాదు
ప్రతీ మలుపులో నన్ను ఆశ్చర్యపరిచే దారిపక్క పుణ్యక్షేత్రాల కోసం
174
నా ప్రేమా, నీ నవ్వు
ఒక అపరిచిత పుష్ప సుగంధంలా నిరాడంబరం అనిర్వచనీయం
175
మరణం నవ్వుకుంటుంది
మరణించిన వాని యోగ్యతని పెంచి చెప్పినపుడు
అతని హక్కుకి మించి అతని గిడ్డంగి పెరుగుతుంది గనుక
176
నౌకని సముద్రంలో తొందరపెడుతున్న గాలిని
తీరం నిట్టూర్పు వ్యర్థంగా అనుసరిస్తుంది
177
సత్యం దాని పరిమితుల్ని ప్రేమిస్తుంది
అందాన్ని అక్కడ కలుస్తుంది గనుక
178
నా నీ తీరాల మధ్య
తీవ్రమైన సముద్రం, నా స్వీయాత్మ తరంగమూనూ
దానిని దాటాలని నా కోరిక
179
స్వాధీనాధికారం
మూర్ఖంగా బడాయిపోతుంది
దాని భోగాధికారానికి
180
ముల్లుకోసం యెర్రబారిన క్షమాపణ కంటే
గులాబీ వ్యవహారం ఎక్కువ
(మళ్ళీ వచ్చే వారం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.