226
నక్షత్రాలు బయటకు రాకముందు సందెచీకటిలా
నా జీవితపు రిక్త మురళి
దాని అంతిమ గానం కోసం నిరీక్షిస్తుంది
227
నేల బంధనం నుండి విముక్తి
చెట్టుకు స్వేచ్ఛ కాదు
228
జీవితపు కథా యవనిక
కలుస్తూ తెగుతూ
ముడులుపడ్డ జీవితపు దారాలతో అల్లబడింది
229
పదాల్లో ఎన్నడూ బంధించలేని నా ఆలోచనలు
నా పాటల మీద వాలి నాట్యం చేస్తాయి
230
నిశ్శబ్ద చెట్టు హృదయంలో
బ్రహ్మాండం గుసగుసల మధ్య ఏకాంతంగా నిల్చుని
నేటి రాత్రి, నా ఆత్మ తనకుతానే కోల్పోతుంది
231
పనికిరాని మృత్యువు ఒడ్డున
సముద్రం విసర్జించిన ముత్యపు చిప్పలు
సృజనాత్మక జీవితపు వైభవోపేతమైన వ్యర్థాలు
232
నాకోసం సూర్యరశ్మి ప్రపంచ ద్వారాలు తెరుస్తుంది
ప్రేమకాంతి దాని నిధి
233
విరామాలతో పిల్లనగ్రోవిలా
నా జీవితం దాని ఆశల ప్రయోజనాల
రంద్రాలగుండా రంగులతో ఆటాడుకుంటుంది
234
నీకు నా ధన్యవాదాలు
నా నిశ్శబ్ద పూర్ణ శ్రద్ధాంజలిని దోచుకోనివ్వొద్దు
235
జీవితపు ఆకాంక్షలు
పిల్లల మారువేషంలో వస్తాయి
236
వాడిన పూవు నిట్టూరుస్తుంది
వసంతం శాశ్వతంగా అదృశ్యమైపోయిందని
237
నా జీవితం తోటలో
వెలుగునీడల నా సంపద పోగుచేసి
ఎప్పుడూ జమచేయలేదు
238
నాకు శాశ్వతంగా లబించిన ఫలం
నువు అంగీకరించినదే
239
మల్లెపువ్వుకు తెలుసు, ఆకాశంలో తన సోదరుడు సూర్యుడని
240
ప్రకాశం పసిది, అది ప్రాచీన కాంతి
నీడలు క్షణికం, అవి ముసలి
(మళ్ళీ వచ్చే వారం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.