[శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ రచించిన ‘నాన్న ఎప్పుడూ నాన్నే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సమయం రాత్రి పన్నెండు గంటలయి ఉంటుంది. చాలా రోజుల తర్వాత తాగకుండా, తూలకుండా ఇంటికొచ్చాడు చలపతి. ఇంటి తలుపుకు తాళం వేసి ఉంది. చలపతి ఇంటిబయట ఉన్న ఓ రాతిబండపై కూర్చుని ఆలోచిస్తూండిపోయాడు. అతనికి తండ్రి గుర్తుకొచ్చాడు. అతని కళ్ళనిండా నీళ్ళు నిండాయి.
పాము కరచి తన తల్లి చనిపోతే, తండ్రి – భార్య చనిపోయినందుకంటే తన కొడుకు ‘తల్లిలేని బిడ్డ’ అయినందుకే ఎక్కువగా ఏడ్చాడు. ఆ రోజు నుంచీ తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాడు. తను కోరిందల్లా కొనిచ్చాడు. రెండో పెళ్ళి చేసుకుంటే తనకు సవతి తల్లి వల్ల ఇబ్బంది కలుగుతుందని బంధువులెంత పోరుపెట్టినా ఆయన ఆ మాటే తలపెట్టలేదు.
తను వ్యసనాలకు బానిస అయి ఇంటిని నరకంగా మార్చాడు. దేవుడిలాంటి తండ్రిని మానసికంగా హింసించాడు. పెళ్ళయితే తను మారుతాడేమోనని ఓ మర్యాదస్తుల కుటుంబంలోని అమ్మాయి పార్వతిని తనకిచ్చి పెళ్ళి చేశాడు తండ్రి. అయినా తను మారలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా బాధ్యతలు తనకు తెలియలేదు. రూపాయి రూపాయి కూడబెట్టి తండ్రి సమకూర్చుకున్న భూములను తను పోగొట్టాడు. తండ్రిని బెదిరించి, అగ్రిమెంట్లో సంతకాలు పెట్టించుకుని భూములన్నీ అమ్మేశాడు. లక్షల్లో విలువున్న భూముల్ని వేలరూపాయలకే అమ్మేశాడు. అడ్డొచ్చిన భార్యని తోసేశాడు, బిడ్డల్ని కొట్టాడు.
ఇప్పుడు తన చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇన్నాళ్ళూ తనతో తిరిగిన స్నేహితులు ముఖం చాటేశారు. ఇంటికొస్తే ఇంట్లో ఎవరూ లేరు. బహుశా తను చేసిన నిర్వాకం వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకుని, ఇక ఇక్కడ ఉండటానికి ముఖం చెల్లక ఊరు వదలి వెళ్ళిపోయుంటారు. దాదాపు యాభై లక్షల రూపాయల విలువున్న భూముల్ని పోగొట్టుకుని, ఏ కూలిపనికో సిద్ధపడి ఉంటారు. ‘తనూ మరో ఊరికి వెళ్ళి కూలో, నాలో చేసుకుంటూ బ్రతకాలి. వ్యసనాలను వదిలేస్తే భవిష్యత్తులో తండ్రి, భార్య ఎదురైతే వారిని క్షమాపణ కోరవచ్చు, ధైర్యంగా వారితో మాట్లాడవచ్చు’ అనుకున్నాడు చలపతి.
***
అయిదేళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఊర్లోకి అడుగుపెట్టాడు చలపతి.
అతన్ని ఊర్లో ఎవరూ గుర్తుపట్టలేదు. తెలిసినవారు, స్నేహితులు కూడా అతని ప్రక్కనుంచే వెళ్ళిపోయారు. ‘తను అంతగా మారిపోయాడా’ అనుకుంటూ తమ ఇంటివైపు నడిచాడు. అక్కడ తమ ఇల్లు ఉన్న స్థలంలో ఓ పెద్ద భవనం కనిపిస్తూంది. ‘ఇల్లు కొన్నవాళ్ళు పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకున్నట్లుంది’ అనుకున్నాడు. ఆ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడి బాధగా ఆ ఇంటి ద్వారం వైపే చూడసాగాడు.
కొంతసేపటి తర్వాత ఆ ఇంట్లోంచి ఓ మహిళ బయటికి వచ్చింది. ఆమెను తన భార్య పార్వతిగా గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఆమె కాస్త సన్నబడినా ముఖంలో కళ తగ్గలేదు. చాలా బిజీగా ఇంటి బయటికీ, లోపలికీ తిరుగుతూంది. దాదాపు అరగంట అలాగే ఆ ఇంటిముందే నిలబడిపోయాడు చలపతి. లోపలికి వెళ్ళి భార్యని పలుకరించడానికి అతనికి ధైర్యం చాల్లేదు.
ఈసారి బయటికి వచ్చిన పార్వతి చలపతివైపు ప్రశ్నార్థకంగా చూసింది. తెల్లటి గడ్డంతో చిక్కి శల్యమై కనిపిస్తున్న చలపతిని మొదట పార్వతి గుర్తించలేదు. కొంతసేపు పరీక్షగా చూశాక గుర్తించింది. ఆమె కళ్ళలో నీళ్ళు జలజలా రాలాయి. ఆమె అతని చేయి పట్టుకుని లోపలికి పిలుచుకుని వెళ్ళింది.
హాలు మధ్యలో ఓ స్టూలుపై ఉంచబడిన తండ్రి ఫొటోను చూశాడు చలపతి. ఫోటోకు వేలాడుతున్న దండను చూసి నివ్వెరపోయాడు. అతని కంట నీరు తిరిగింది.
“నాన్న.. ఎప్పుడు?” తన మాటను పూర్తిచేయలేకపోయాడు దుఖంతో.
“పదిరోజుల క్రితమే! ఈరోజు వైకుంఠ సమారాధన! సరిగ్గా ఈరోజే మీరు మన ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మీ నాన్నగారి ఆశీర్వాదమే” ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతూంది.
“ఈ ఇల్లు మనదా?” తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు చలపతి.
“అవునండీ! ఇప్పుడు భూములకు విలువ బాగా పెరిగింది. కొంత భూమి అమ్ముకుని ఇల్లు కట్టుకున్నాము. పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నాము. మామగారు ఉన్నన్నాళ్ళూ మీ గురించే తలచేవారు” అంది పార్వతి కళ్ళు తుడుచుకుంటూ.
“అయితే మీరు ఊరు వదలి పోలేదా?” అని అడిగాడు.
“లేదు. మేము కొద్దిరోజులు మీకు దూరంగా ఉంటే మీలో మార్పు వస్తుందని తీర్థయాత్రలకు వెళ్ళిపోయాము.”
“ఇది తప్పకుండా ఆ భగవంతుడి లీలే. ఎప్పుడూ ఊరు వదలి పోని మీరు తీర్థయాత్రలకు పోవడం, నేను ఇంటికి తాళం చూసి మీరు ఊరు వదలి వెళ్ళిపోయారని భావించడం.. ఇవి డబ్బు విలువ తెలుసుకోవడానికి, నేను కోల్పోయినదేమిటో నాకు తెలియజేయడానికి ఆయన కల్పించిన పరిస్థితులు.”
“మీరు ఇన్నాళ్ళూ ఎక్కడున్నారు, ఏం చేశారు?”
“ఎన్నో వూర్లు తిరిగాను. ఆకలి తీర్చుకోవడం కోసం చిన్న చిన్న పనులు చేశాను. ఆఖరికి మూటలు మోశాను. ఇప్పుడు కర్నూలులో ఓ బియ్యం షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాను. నాన్న సంపాదించిన పొలాలు కాపాడుకుని ఉంటే మహరాజులా ఉండేవాడిని. వ్యవసాయం చేసి ఉంటే మరో పదిమందికి పని ఇచ్చి పోషించి ఉండేవాడిని. ఇదంతా నేను చేతులారా చేసుకున్నదే!”
“జరిగినదేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం వ్యవసాయం చేసి పంటలు పండిద్దాం. మీరన్నట్లు మనం బ్రతికి మరి కొంతమందిని బ్రతికిద్దాం. అప్పుడు మామయ్యగారి కోరిక తీర్చినట్లుంటుంది. ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది”
“అది ఎలా వీలవుతుంది పార్వతీ? ఇప్పుడు నాన్న పేరుమీద పొలాలు లేవు కదా?” అనుమానంగా అడిగాడు చలపతి.
“మామగారు పొలాలన్నీ నా పేరుమీద రిజిస్టర్ చేయించారు.”
“అదెలా చేశారు? నేను ఇక్కడ ఉన్నప్పుడే పొలాలన్నీ అమ్మేశాను కదా? నేను బలవంతం చేస్తే నాన్న అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు. డబ్బు ఇచ్చిన వాళ్ళు ఊరకుండరు కదా! తమ పేరుతో పొలాలు రిజిస్టర్ చేయించుకునే ఉంటారు. వాటిని మళ్ళీ నీ పేరుమీద ఎలా రిజిస్టర్ చేయిస్తారు?” ఆశ్చర్యంగా అడిగాడు.
“మామయ్యగారు మీకు డబ్బులు ఇచ్చిన ప్రతివ్యక్తి దగ్గరకూ వెళ్ళారు. వారు మీకు ఇచ్చిన సొమ్మును వారికి తిరిగి ఇచ్చేస్తానని, అగ్రిమెంటు కాగితాన్ని తనకు ఇవ్వమని వేడుకున్నారు. అదివరకే మీ నాన్నగారి మంచితనం చవిచూసినవారు కనుక వారందరూ అయన కోరికను మన్నించి ఆ కాగితాలు ఇచ్చేశారు. అలా మీరు అమ్మిన భూములన్నిటినీ ఆయన మన కోసం, మన బిడ్డల కోసం కాపాడుకున్నారు.”
ఆశ్చర్యంతో, పశ్చాత్తాపంతో రెండు చేతులూ జోడించి తండ్రి ఫోటో ముందు మోకరిల్లాడు చలపతి.
