Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నన్నయ కాలం ప్రజల ఆహారం

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘నన్నయ కాలం ప్రజల ఆహారం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

న్నయ భట్టారకుడు ఆంధ్రశబ్దచింతామణిలో ‘స్వస్థానం, స్వవేషం, స్వభాష వీటిపైన అభిమానం ఉన్న రసలుబ్దబుద్ధులైన సత్పురుషులు వైకృత కావ్యాలను వ్రాస్తార’న్నాడు. అంటే సంస్కృతంలో కాకుండా తమ మాతృభాషలలో రచనలు చేస్తారని! రాష్ట్రాభిమానం, జాత్యభిమానం, దేశాభిమానం అనే భావాలు మనుషుల్లో ఉంటేనే జాతి మనుగడ సాగుతుందని ఆయన ప్రబోధం.

రేనాటి చోళుల్లాంటి సామంతరాజులు, పండురంగడి లాంటి సేనాపతులు, యుద్ధమల్లుడి లాంటి రాజులూ తమ నిర్ణయాల్ని, సాహసకృత్యాల్ని, భక్తి వితరణ భావాల్ని తెలుగులోనే చెప్పుకున్నారు. రాజరాజ నరేంద్రుడు తెలుగులో భారతాన్ని రాయవలసిందిగా నన్నయను కోరాడు. “తెనుంగు నిలిపి రంధ్రవిషయంబున, జనసత్యాశయుని దొట్టి చాళుక్య నృపుల్” అంటూ, చాళుక్యరాజులు ఆంధ్ర ప్రాంతంలో తెనుగుని నిలిపారని నన్నెచోడుడు ప్రస్తుతించాడు.

రాజరాజ నరేంద్రుడుకి తెలుగు భాషతోపాటు సనాతన మత గౌరవాన్ని, వర్ణాశ్రమ ధర్మాలను తిరిగి నెలకొల్పాలనే కోరిక ఎక్కువ. నన్నయను తెలుగులో భారత రచనకు ప్రేరేపించి తద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు. వ్యాసభారతాన్ని ముక్కస్య ముక్క అర్థః అన్నట్టు అనువదించకుండా నన్నయగారు ఆంధ్రమహాభారతం అన్న పేరుతో స్వతంత్ర కావ్యంగా వ్రాయనారంభించాడు.

ప్రభుత్వ విధానాలే సంస్కృతిని ప్రేరేపిస్తాయి. బౌద్ధ, జైనాల నుండి వైదికమతం లోకి ఎక్కువమంది వచ్చి చేరుతున్న కాలం అది. వైదిక ఆచారాలకు ప్రాధాన్యత పెరిగింది. శాతవాహనుల గాథాసప్తశతి నాటికే ఈ పరిస్థితి కొంతవరకూ ఏర్పడినా నన్నయ కాలంలో అది నిలదొక్కుకుంది. శైవులు, వైష్ణవులతో పాటు బౌద్ధులు, జైనుల ప్రాబల్యం అక్కడ సమాజం మీద ఉంది. బోయలు, సవరలు కూడా బలంగా ఉన్నారప్పుడు. కులవ్యవస్థ మరింత బలంగా నాటుకుంది. కన్నడ సంస్కృతి కన్నా భిన్నమైన రీతిలో తూర్పుచాళుక్యులు తమ కాలపు సామాజిక వ్యవస్థని తీర్చిదిద్దారు. కన్నడ తెలుగు భాషల మధ్య ఎడం పెరిగిన కాలం అది!

ఆ కాలపు ప్రజలపైన ఆయుర్వేద శాస్త్ర ప్రభావం చాలా ఉంది. 10-11 శతాబ్దాలలోనే ధన్వంతరీ నిఘంటువు, నలుడి పాకదర్పణం లాంటి అనేక ఆయుర్వేద గ్రంథాలు వెలువడి దేశవ్యాప్తంగా ఆరోగ్య స్పృహని ప్రేరేపించాయి. సమకాలీన తెలుగు ప్రజలు వాటిని అందుకోగలిగారు. తెలుగువారి ఆహారవిధానాలు ఆయుర్వేదపరంగా రూపొందేందుకు ఇదీ ఓ కారణమే.

 “తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి” అనే సామెతతో భారతానికి, భక్ష్యాలకు తెలుగువారు ముడిపెట్ట గలిగారు. అప్పటి ప్రజలకు వరి, గోధుమలతో పాటు జొన్నలు, రాగులు, సజ్జలు కూడా తెలుసు. ‘చోళ’ శబ్దానికి తమిళంలో జొన్నలని, తెలుగులో చోడి+లు= చోళ్లు, రాగులు. లేదా తమిదెలనీ అర్థం. మౌలికంగా చాళుక్యులు రాజపుత్రులని, క్రమేణా ద్రావిడ జాతులపైన ఆధిపత్యం సంపాదించి, వారితో కలిసిపోయారని చెప్తారు. ‘చులుకము’ అంటే బ్రహ్మగారి దోసిలి (పుడిసిలి) అనే అర్థంలో ఈ చాళుక్య శబ్దం ఏర్పడిందని ఒక వివరణ ఉంది. రాజరాజ నరేంద్రుడి నుండీ తమిళ చోళచక్రవర్తులతో తూర్పుచాళుక్య రాజులకు సంబంధాలు బలపడి చాళుక్య చోళులుగా మారారు.

భూమ్మీద జీవించే జీవులకు ఆహారం అవసరం. దేవతలు ఏం తిని బతుకుతారో తెలీదు. వారికి ఆకలి దప్పులుండవని అంటారు గానీ, హవిస్సులలో వాటాలు వెడ్తున్నాయికాబట్టి వారికీ ఆహారం అవసరమే! అగ్నిదేవుడికి, గరుత్మంతుడనే పరివార దేవతకి వారివారి ఆహారాల్ని తీసుకునే వరాలున్నాయి. గజ కచ్చప భక్షణము అనే కథలో ఆస్తి కోసం కొట్టుకున్న అన్నదమ్ములిద్దరూ ఒకరిని ఒకరు శపించుకుని ఏనుగు, తాబేలుగా మారతారు. అయినా కొట్టుకోవటం ఆపరు. “అవి నీ కాహరంబు సుమ్మరుగుము కార్యసిద్ధి యయ్యెడన్” అని, వాటిని తినే అధికారాన్ని గరుత్మంతుడికివ్వటం ఈ కథ సారాంశం. తండ్రి ఆస్తికోసం అన్నదమ్ములు కలహిస్తే ఆ ఇద్దరినీ మూడో వాడొచ్చి తన్నుకుపోతాడనే నీతి ఈ కథలో కనిపిస్తుంది. ‘గరుత్మంతుడికి పాములు సహా జంతుమాంస భక్షణను అధికారికంగా ఇచ్చినట్టు ‘సర్పాశనం’ కథ చెప్తోంది. ఎలుకల్ని, పాముల్ని గద్దలు తినటం సహజం. మరి, జంతువుల మాంసభక్షణం మానవులకూ అంతే సహజమా? ఈ ప్రశ్నకు నన్నయగారు పరోక్షంగా “నిషాద భక్షణావసరమున బాహ్మణులను పరిహిరింపుము” అని సమాధానం ఇస్తాడు. జంతువుల్ని వేటాడి తినే నిషాదుల్ని కూడా తినే అధికారాన్ని గరుడుడికి ఇస్తూ, ఇందులోంచి బ్రాహ్మణులను పరిహరించమన్నాడు. ఎందుకంటే, వారు మాంసం తినరు కాబట్టి!

తెలుగువారిలో సంఖ్యరీత్యా మాంసాహారులే ఎక్కువైనప్పటికీ, వీరు శుద్ధమాంసాహారులు కారు. రోజువారీగా శాకాహారాన్నీ, అప్పుడప్పుడూ మాంసాహారాన్ని తింటూ ఉంటారు. అందుకని ప్రాచీన కావ్యాలన్నింటిలో శాకాహార వర్ణనలే ఎక్కువ కనిపిస్తాయి.

కామధేనువు సాయంతో వశిష్ఠుడు విశ్వామిత్రుడికి, అతని పరివారానికి అతిథి మర్యాదలు చేసిన సందర్భంలో నన్నయ చేసిన ఈ వర్ణన చూడండి: గ్రామీణాహారం (పులుసు, మసాలాలు, నూనెలు పోసి వండిన వంటకాలతోకూడిన నాగరిక ఆహారం), ఆటవిక ఆహారం (ఫలాలు, కందమూలాలతో కూడిన ఆహారం), తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు చేదు రుచులతో కూడిన భోజనం, మధుర రసాయన పానీయాలు, పాలు, అమృత సమానమైన లేహ్యాలు (పచ్చళ్లు), గారెలు బూరెలు, అప్పాల్లాంటి భక్ష్యాలు, పీలుస్తూ తినే పులుసులు, పాయసాది పేయాలు, చెరకురసం, రత్నవస్త్రాదులు మొదలైన సమస్త మనోవాంఛితాలన్నీ ఆ కామధేనువు ద్వారా పొంది వశిష్టుడు వడ్డించాడట. ఆనాటి ఆహారం ఈనాటి మన ఆహారానికి నకలుగానే ఉంది! అయితే ఆయుర్వేదానుసారం జీవించారు కాబట్టి ఆ ప్రజలకు గ్రామ్యాహారం అజీర్తికరం అని తెలుసు!

ఆదిపర్వం బకాసురవథ ఘట్టంలో కొన్ని ఆహార పదార్థాలున్నాయి. ఏకఛత్రపురవాసులు ప్రతిరోజూ ఒక ఎద్దు మోయగల మంచి బియ్యపు అన్నం, 20 తూముల ధాన్యం, 2 దున్నపోతులు, పంచభక్ష్యాలతో కూడిన వంటకాల్నీ, వాటిని తీసుకెళ్లే ఒక మనిషినీ ఆహారంగా పంపాలనేది నియమం. బండి నిండా వాటిని నింపాక, మొదట భీముడికి కడుపునిండా అన్నం పెట్టారు. భీమసేనుడు ఇష్టాన్న భోజనం చేసి, సంతృప్తి చెందినట్టు చేసిన వర్ణన ఇది.

పలుదెఱంగుల పిండివంటలుఁ బప్పుకూడును నేతికుం

డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ

నలఘుసత్త్వుడు మారుతాత్మజుఁ డన్నిటన్ గత ఖేదుఁడై

బలము గల్గి కడంగె నప్పుడు బ్రావ్మాణార్థము సేయఁగాన్”

రకరకాల పిండివంటలు, పప్పన్నం, కుండెడు నెయ్యి, బెల్లం, కుండల్నిండా పెరుగుతో భీముడు ఈ యిష్టాన్న భోజనం చేసి సంతృప్తి చెందాడు. బ్రాహ్మణుడికి బదులు బకుడికి ఆహారంగా భీమసేనుడు వెడుతున్నాడు కాబట్టి ఈ భోజనాన్ని “బ్రాహ్మణార్థం” అంటాడు నన్నయగారు! భీముడు బండి తోలుకుంటూ బకాసురుడు ఉండే చోటుకు వెళ్లాడు. యమునా తీరాన బండి నిలిపి, అతన్ని పిలిచాడు. వాడు ఎంతకూ రాలేదు. అందాకా ఊరికే ఉండటం ఎందుకని, ఆ బండిలో ఆహార పదార్థాలన్నీ తనే ఒక్కొక్కటిగా తినేస్తాడు.

సభాపర్వంలో ద్రౌపది లావణ్యాన్ని చూసి కౌరవుల భార్యలు ఈర్ష్య చెందారని నన్నయగారు ఇలా వర్ణిస్తాడు. “అఖిల లావణ్య పుంజంబు నబ్జభవుఁడు/ మెలఁతగా దీనియందు నిర్మించె నొక్కొ/ కాని నాఁడిట్టి కాంతి యేకాంతలందు/ నేల లేదని సామర్షహృదయ లైరి” అని. ఇక్కడ లావణ్యం అనే పదానికి విస్తృతార్థమే ఉంది. లావణ్యం అంటే ‘ముక్తాఫలచ్ఛాయావదంగదృశ్యమాన కాంతి” అంటే ముత్యంలాగా మెరిసే చర్మసౌందర్యం అని నిఘంటువులు అర్థాన్నిచ్చాయి. కానీ, ‘లవణము యొక్క భావము లావణ్యము’ అని దాని అన్వయార్థం. సైంధవ లవణం అనేది ఉప్పగా ఉండే తెల్లని కొండరాయి. పెద్ద ఉప్పురాయిని పగల కొట్టినప్పుడు అది పలకలుగా పగిలి, దాని స్నిగ్ధత్వం చేత సూర్యకాంతికి తళతళా మెరుస్తుంది. ఆ మెరుపుని ‘లావణ్యం’ అంటారు.

ఆహారం జీవనాధారం కాబట్టి ఆహార ప్రస్తావన లేకుండా సాహిత్యం ఉండదు. అయితే, మనిషి మానవుడిగా ఎదగటానికి కావలసిన రాజకీయ సామాజిక నియమాలకు ప్రాధాన్యత నివ్వటంతో నన్నయగారి ఆంధ్రమహాభారతంలో ఆహారపదార్థాల ఏకరువు తక్కువగా కనిపించినప్పటికీ, వాటిని ప్రస్తావించకుండా ఆగలేకపోయాడు నన్నయ. ఆ ఆహారంలో తెలుగుదనం రసాలూరుతుంటుంది.

Exit mobile version