కశ్మీరును హరుడిలో భాగంగా పార్వతి అంశగా భావించమనడంలో ఎంతో ఆలోచన దాగుంది.
భారతీయ ధర్మంలో ప్రతీదీ దైవంతో ముడిపడి ఉంటుంది. ధర్మం, దైవం వేరు కాదు. పాశ్చాత్య దేశాలలో State వేరు, Religion వేరు. భారతదేశంలో ఈ రెండు పడుగులో పేకలా కలిసిపోయి ఉంటాయి. అందుకే పాశ్చాత్యుల దేశభక్తి భౌగోళిక సరిహద్దులపై ఆధారపడి ఉంటే, భారతీయ దేశభక్తి ధర్మసంబంధి. ఈ తేడా గ్రహించని వారు తప్పటడుగు వేసినట్టే. మౌలికంగా అవగాహన చేసుకోవటంలోనే పొరపాటు ఉంటే ఆ తరువాత ఎలాంటి తీర్మానాలు చేసినా, తీర్మానాలకు సమర్థనగా ఎన్ని ఋజువులు చూపించినా, అవి వ్యర్థమే. పునాదులు సరిగ్గా లేని భవనాన్ని పాలరాతితో కట్టినా, మణిమరకత మాణిక్యాలు పొదిగినా ఎలా స్థిరంగా ఉండదో, మౌలిక అవగాహనలో పొరపాటు జరిగిన తరువాత ఎన్ని తీర్మానాలు చేసినా వ్యర్థమే. భారతీయ ధర్మానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఈ రకమైన పొరపాట్లు జరిగాయి. రాజు దైవాంశగా భావించడం వల్ల భారతీయులకు రాజభక్తి తప్ప దేశభక్తి భావన లేదు అని భావించడం కూడా ఇలాంటి పొరపాటు భావనే.
కశ్మీరు రాజు శ్రీకృష్ణుడి చేతిలో మరణించాడు. కశ్మీరును ఆక్రమించమని శ్రీకృష్ణుడిపై మంత్రులు ఒత్తిడి తెస్తారు. మామూలుగా అయితే రాజు రాజ్యం ఆక్రమించాల్సిందే. కానీ భారతీయులు దేన్నయినా ఆక్రమించాలని ఆశించరు. తనది కాని దాన్ని ఆశించకూడదు అన్నది దైవ నిర్దేశం. దీనికి తోడు కశ్మీరం పార్వతి. కాబట్టి రాజు లేకున్నా కశ్మీరును కశ్మీరీయులకే అప్పగించాడు శ్రీకృష్ణుడు. అదీ భారతీయ ధర్మం! ఇలాంటి సంఘటన ఇతర ఏ నాగరికతలోనూ కనబడదు. ఇదొక్కటే కాదు, ఇలాంటి సంఘటనలు భారతదేశ చరిత్రలో అనేకం కనిపిస్తాయి. దేశం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అయిష్టంగా రాజ్యభారం స్వీకరించి, రాజ్యంలో పరిస్థితులు చక్కబెట్టి, వయసుడిన తరువాత ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువయిపోయిన రాజు, వారసులు లేరు కాబట్టి వేరే దేశం నుండి అర్హత ఉన్న వ్యక్తిని ఆహ్వానించి అతడికి రాజ్యం కట్టబెట్టే అపూర్వమైన, అద్భుతమైన సంఘటన కేవలం బారతదేశంలోనే సాధ్యం. కశ్మీరుకు చెందిన రాజు ‘సంధిమతి’ ఇందుకు ఉదాహరణ. ఎలాంటి అహం, వ్యామోహం లేకుండా తన వయసయిపోయిందని గ్రహించి మరో వ్యక్తిని ఆహ్వానించి రాజ్యం కట్టబెట్టాడీ ఆధ్యాత్మిక రారాజు సంధిమతి.
ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ప్రాధాన్యం దైవాన్ని మించి ధర్మానికే అని స్పష్టం చేస్తాయి. రాజు పని పాలించడం విష్ణువులా. అప్పుడే అతడిది దైవాంశ, లేకపోతే రాక్షసుడే ఆ రాజు. అందుకే దుష్ట రాజులపై ప్రజలౌ విప్లవాలు లేవదీసిన గాథలు, తరిమి తరిమి కొట్టిన గాథలు భారతదేశ చరిత్రలో బోలెడు. అంతేకాదు, తురుష్కులు భారతదేశంలో ప్రవేశించిన తరువాత, అనేకులు తురుష్కుల సైన్యంలో చేరారు. హిందువులయిన మరాఠాలతో తురుష్కసేనల తరఫున పోరాడారు. కానీ ఎప్పుడయితే అహంకారంతో ముస్లిం రాజులు దేవాలయాలను ధ్వంసం చేశారో, అప్పుడు తురుష్కుల సైన్యంలోని హిందువులు తిరుగుబాట్లు చేశారు. అక్కడ రాజభక్తి అన్న భావన లేదు. అలాగే రాజు హిందువయినా, అధర్మంగా వ్యవహరించినప్పుదు రాజుకు బుద్ధి చెప్పడంలో ‘రాజు విష్ణువు అంశ’ అనే ఆలోచన అడ్డం రాదు. ఇలాంటి సంఘటనలు భారతీయులకు ధర్మమే ప్రాధాన్యం అన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఎప్పుడయితే ఆధునిక యుగంలో దైవం ధర్మం, పాశ్చాత్యుల ఆలోచనా విధానాలను అనుసరించి వేరు చేశారో, అప్పటి నుండి సమస్యలు అంతవరకూ లేనివి మొదలయ్యాయి.
కథం సతీ శచీ గంగా అదితీర్యమునా దితిః।
సరిత్త్యా మహా సంప్రాప్తా యా చ దేవీ కరీషిణీ॥
కశ్మీరు పార్వతి. అక్కడ సకల దేవతలు నదుల రూపం ధరించి ప్రవహిస్తూ దేశాన్ని పవిత్రం చేస్తున్నారు. ఇదంతా విన్న గోవిందుడికి అనుమానం వచ్చింది.
“సతి, శచి, గంగ, అదితి, యమున, దితి, కరీషిణీ దేవతలు నదుల రూపం ఎలా ధరించారు?” అని అడిగాడు.
రావలసిన అనుమానమే. దేవతలు నదుల రూపం ధరించటం ఎందుకు? కశ్మీరం పార్వతి అంటే సరిపోదా? మళ్ళీ ఇతర దేవతలు నదులుగా మారాల్సిన అవసరం ఏమిటి?
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

