Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీవారెవరో తెలుసుకో!

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘నీవారెవరో తెలుసుకో!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

తెల్లవారుతూ వెలుగు పంచుతోంది
జగతినంతా మెల్ల మెల్లగా
ఉదయం వేళ
చిగుర్లు మేసిన కోయిలలు
స్వాగతాలు పలుకుతూ
మేలుకొలుపు పాడుతున్నాయి

రేయంతా నిదురలేక
ఎప్పుడో మగతలోకి జారుకున్న
పడతులను లెలెమ్మని పిలుస్తున్నాయి
వెన్నెల సెలయేరుల విరబూసిన
కలువలు ఎండవేడికి తాళలేక
వసివాడిపోతున్నాయి

నింగీ నేలా కలిసినచోట
నీలిరంగు అందాలు
కనువిందు చేస్తున్నాయి
తొలకరివానకు పుడమి పులకించగా
పచ్చని వనాలు విరులతో అలరించాయి

చల్లగాలి మోసుకొచ్చిన రాగాలేవో
నా మదిలో ఆశలు రేకెత్తించాయి
నీ చూపులు సోకగానే
సిగ్గుతో విరబూసిన కుసుమమునయ్యాను

పులకించిన నా మదిలో అంబరాన్ని
అంటిన సంబరం అలుముకుంది
తేనెలూరు పెదవుల మాటున
ఒదిగిన మురిపెములెవ్వరికో తెలుసుకోవోయి

వలపంటే ఎరుగనిదానను
కలలుకనే వయసులేనిదానను
ఎదురుగా నువ్వుంటే చాలు

బంధమంటే తెలియని నేను
మరుని తూణీరాలను
పూలబాణాలని భ్రమసేను

ఎదలో దాచుకున్న మమతలన్నీ
బాహుబంధంతో అందిస్తున్నా
బదులేమి ఇస్తావో
తెలుసుకోలేక పోగొట్టుకుంటే
తిరిగి పొందలేవు
కాలం నీకోసం ఆగదు
మనసిచ్చేది ఒక్కసారే
అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావని
పగిలిన హృదయం అతుక్కోదని తెలుసుకో!

Exit mobile version