జంటగా ఎగిరే గువ్వల జంట వెక్కిరింతగా చూస్తున్నాయ్
ఎగిసిపడే అల తెల్లని స్వచ్ఛతలో
నీ స్నేహాన్ని చూస్తున్నాను.
అంతలో తడిపి ఇంతలో మాయమయ్యే ఆ జడిలో
నీ ప్రేమ వురవడి కనిపిస్తోంది!
చిత్రంగా ఆ హోరులో నీ పేరు వినిపిస్తోంది!
లోకంలోని మరే శబ్దమూ నా చెవికి చేరడం లేదు.
పిడత కింద పప్పువాడు నోరు కదుపుతున్నాడు!
ఓ అమ్మాయి అబ్బాయి పెదవులు కదుపుకుంటూ
నిశబ్దంగా పోతున్నారు!
పిల్లలు పరుగులు పెట్టి గవ్వలు ఏరుకుంటున్నారు!
నేనేమో నీ జ్ఞాపకాల్ని!
ఓ వృద్ధుడు తదేకంగా సముద్రాన్ని చూస్తున్నాడు.
అతడి నుదుటి మీది చారికలు అతను
అనుభవించిన జీవిత పర్వాల్ని సూచిస్తున్నాయి!
ఇప్పుడు కదులుతున్న నా చేతివేళ్ళు
మన భవిష్యత్తుకై కలల గూల్ళు కడ్తున్నాయి!
జీవితంలో
నడి సంద్రంలో ప్రయాణిస్తున్న ఓ నడివయసు జంట –
రేపు అనే కాయితం మీద లెక్కలు వేస్తూ –
ఈ వేల్టి కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్నారు!
పసిపిల్లలకి అమ్మానాన్నలు,
ముసలాయనకి కర్ర ఊత,
ప్రేమికులు ఒకరికొకరు,
భార్యాభర్తలకి బాధ్యతల బంధానాలు
అందరికీ వెనక్కి వెళ్ళడానికి సాధానాలున్నాయి!
నేను ఎలా వెళ్ళను?
అందుకే కూర్చునే వున్నాను ఇలా
తీరంలో ఒంటరిగా!
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.