[శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా రచించిన ‘పల్లె పిలిచింది’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[రమణ సొంతూరిలోనే ఉండిపోదామన్న ఆలోచన చేస్తాడు. అమెరికాలో ఉన్న, ఇక్కడ ఉన్నమిత్రులతో ఫోన్లలో మాట్లాడుతాడు. అన్నీ కుదిరితే, ఈ పల్లెలోనే ఒక పరిశ్రమ నెలకొల్పాలని భావిస్తాడు. ఓ రోజు తల్లి దగ్గర కూర్చుని ఉండగా, రామకృష్ణకి వడుగు చేయమని రమణని అడుగుతుంది. తనకేమీ అభ్యంతరం లేదనీ, నాన్నగారూ ఏమంటారో, ఆయనొప్పుకుంటే చేద్దామని అంటాడు. ఆ రాత్రి భోజనాలప్పుడు, తల్లి కోరిక, తమ్ముడి సమాధానాన్ని అన్నపూర్ణ తండ్రికి వివరిస్తుంది. దశరథరామయ్య, కొడుకు వర్ణసంకరం చేశాడంటూ చాలా కఠినంగా మాట్లాడుతారు. ఆ మాటలు విన్న గీత బాధపడుతుంది. భార్యని లోపలికి తీసుకువెళ్ళి, ఓదార్చి, తన ప్రణాళిక గురించి చెప్తాడు. అనుకోకుండా అటువైపు వచ్చిన అన్నపూర్ణ వారి మాటలు విని, తమ్ముడి దగ్గరకొచ్చి, మీ మాటలు అనుకోకుండా విన్నాను, నిజంగానే ఇక్కడే ఉండిపోతావా అని అడుగుతుంది. అవునంటాడు రమణ. తన ప్రణాళిక గురించి చెప్తాడు. రెండు రోజులయ్యాకా, స్వామివారు ఊళ్ళికి వస్తారు. పూర్ణ కలశంతో దశరథరామయ్య గారు, ఆ ఊరి మునసబు, ఇంకా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి, ఎదురువెళ్ళి ఆయనకు ఘన స్వాగతం పలికి, ఆయనకి ఏర్పాటు చేసిన బసకి తీసుకువెళ్తారు. ఆ సాయంత్రం గీతారమణలు చక్కగా తయారై వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారు పాల్గొనే కార్యక్రమాల వివరాలను మఠం వారు వెల్లడిస్తారు. పొందికగా తనకి సేవలు చేస్తున్న గీతను మెచ్చుకుని ఆ విషయం దశరథరామయ్యతో చెప్తారు స్వామివారు. అప్పుడు దశరథరామయ్య జరిగినదంతా ఆయనకు చెప్తారు. ఇక చదవండి.]
12.
స్వామివారు అంతా విని, నిమీలిత నేత్రాలతో మౌనంగా కూర్చున్నారు. స్వామివారు ఏదైనా ప్రాయశ్చిత్తం చెయ్యమని సెలవిస్తారేమోనని, దశరథ రామయ్య ఆత్రంగా అంజలి ఘటించి, ప్రక్కనే నుంచున్నాడు.
స్వామి మెల్లిగా కనులు తెరచి, “రామయ్యా, నువ్వు వేద శాస్త్ర కోవిదుడివి. కానీ బ్రహ్మజ్ఞానివి కాలేకపోయావు, అహంకారాన్ని వదలక మానవధర్మాన్ని విస్మరించావు. వర్ణాలు మానవ కల్పితాలని ఎరుగకపోయావు.
బ్రహ్మజ్ఞానియైన బ్రాహ్మడికి సృష్ట్యాద్యంతమూ పరబ్రహ్మ స్వరూపముగానే గోచరించవలెను కదా, అందరినీ ధర్మాచరణనమునకు మార్గనిర్దేశం చేసి, అందరినీ సమానంగా ఆదరించి ప్రేమించి, సదా లోకకళ్యాణము కొరకై పాటుపడాలి కదా, బ్రాహ్మలు మాత్రమే పూజ్యులు, గౌరవనీయులు, సనాతన ధర్మ కర్మలకు అర్హులు అనుకుంటే, క్షత్రియ కులంలో పుట్టిన రాముడు, యాదవ కులలంలో పుట్టిన కృష్ణుడు పూజ్యులు ఎలా అవుతారు? వాల్మీకి గిరిజనుడైనా కూడా మహర్షి, ఆది కవి ఎలా కాగలిగాడు? వేదాలనే విభజించి మనకు భారత భాగవతాదులను ప్రసాదించిన వ్యాసుడు మత్స్యకన్యకు జనించిన వాడు కాదా, ఈ వర్ణాలు, కట్టుబాట్లు అన్నీ మానవులు సృష్టించుకొన్నవే, అప్పటి కాలానికి అవి సరిపోయాయి. కానీ ఇప్పటి కాలం వేరు. కట్టుబాట్లు, పద్ధతులు, ఆచారాలు అన్నవి మానవోద్ధరణకు దోహదం చెయ్యాలి కానీ మానవ వినాశనానికి కాదు.
మనిషిని మనిషి గౌరవించబట్టి, ప్రేమించి అదరించబట్టే, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోబట్టే, సమాజము, కుటుంబాలు, మొదలైనవి ఏర్పడ్డాయి. మనిషిని మనిషి ద్వేషించి, వెలేయడం మొదలైతే చివరికి మానవులకు పశువులకు తేడా లేకుండా పోతుంది. అందరినీ కలుపుకోవడంలోనే, ఐకమత్యం, బలం, బలగం ఉన్నాయి రామయ్యా,
నీ కొడుకు అప్పుడు చేసిన పని నీ దృష్టిలో తప్పైయ్యుండచ్చు. కానీ అది భగవత్సంకల్పితమని గుర్తెరిగి, బ్రాహ్మణుడన్న అహంకారాన్ని వదిలి, దైవేచ్ఛ అనుకుని, నీ కుటుంబం కోసం శుద్ధ బ్రాహ్మణ్యాన్ని స్వీకరించి పాటిస్తున్న ఆ పిల్లను మనసారా అంగీకరించి, కోడలిగా స్వీకరించి, ఆశీర్వదించు. మన అనుకున్న వారి దగ్గర గెలుపు ఓటములు లెక్కించకూడదు. రమణ సత్సంకల్పంతో ఇక్కడే ఉండి ఇక్కడి జనోద్ధరణకు పూనుకున్నాడు. అతనికి నువ్వు బాసటగా ఉండు.
అలాగే రేపు మీ అబ్బాయిని రేపు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో నన్ను కలవమని చెప్పు. అతనితో కొంచెం మాట్లాడాలి. అతను తలపెట్టిన సంకల్పానికి కొన్ని సలహా సూచనలు ఇవ్వాలి. ఇక బయల్దేరు. మేం కూడా విశ్రమించే వేళయింది” అని చెప్పారు.
స్వాములవారు చెప్పింది పూర్తిగా విన్నారు దశరథ రామయ్య. వెంటనే స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంటికి బయలుదేరారు.
రాత్రి వేళయింది అందరూ రామయ్య గారి కోసమే కాచుకూర్చున్నారు. రామయ్యగారు స్నానం చేసి మడి కట్టుకుని భోజనానికి సిద్ధం అయ్యారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రాత్రి పూట భోజనం మానేసి, బదులుగా ఫలహారం చేస్తున్నారు. అందుకని వంటావిడ ఉప్పుడు పిండి తయారు చేసింది ఆయన కోసం. ఆయనకు మాత్రం వంటావిడ మడిగా వడ్డిస్తే మిగతావాళ్ళకి అన్నపూర్ణ, శారదా లక్ష్ములు వడ్డిస్తారు.
స్వామివారి దర్శనం కోసం వచ్చిన ముగ్గురు అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు భోజనానికి ఆయనతో పాటు కూర్చున్నారు. ఒక్క రమణ గీత పిల్లలూ తప్ప.
రామయ్యగారు, రమణ వచ్చిన దగ్గర్నుంచి ఇంతవరకూ, అతనితో సహపంక్తి భోజనం చెయ్యనేలేదు. అందువల్ల వారంతా ఆయన భోజనం అయ్యాక చేస్తారు.
రామయ్య గారు కూర్చున్న వాళ్ళనందరినీ చూసి, “రమణ పిల్లలు భోజనం చేశారా” అన్నారు.
“లేదు నాన్నా, మీ భోజనం అయ్యాక చేస్తారు” అన్నది అన్నపూర్ణ.
“తర్వాత దేనికి? ఏకంగా రమ్మనమని చెప్పు. పిల్లలికి, వాడికి కూడా విస్తళ్ళు వెయ్యండి” అన్నారు దశరథ రామయ్య గారు.
అన్నపూర్ణ ముఖం విప్పారింది. శారదా లక్ష్మి ముఖముఖాలు చూసుకున్నారు. అల్లుళ్లు కూడా భార్యల వంక అనుమానంగా చూసారు, ‘ఇదేవిటి ఇంతలో ఇంత మార్పూ’ అన్నట్టు.
అన్నపూర్ణ వెళ్లి అందరికీ విస్తళ్ళు వేసి, పిల్లల్ని, రమణను పిల్చుకొచ్చింది. రమణ సంతోషంగా తనూ వచ్చి కూర్చోబోయాడు. రామయ్యగారు రమణ విస్తరి తనకి కొంచెం పక్కగా వేయించి అక్కడ కూర్చోమనే సరికి ఆనందంగా కూర్చున్నాడు రమణ. అన్నపూర్ణ, శారదా వడ్డనలు మొదలెట్టారు.
రామయ్యగారు, “కోడల్ని కూడా వడ్డనకి రమ్మని విడిగా చెప్పాలా, మీరు మీ భర్తలకు వడ్డన చేస్తున్నప్పుడు తను కూడా తన భర్తకు వడ్డించద్దూ” అన్నారు అందరినీ ఆశ్చర్యపరుస్తూ.
అక్కడ ఉన్న అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అన్నపూర్ణ రమణ కూడా ఒకరిముఖం ఒకరు ఆనందంగా చూసారు. వెంటనే అన్నపూర్ణ వెళ్ళి గీతను పిల్చుకొచ్చింది. గీత సంకోచంగానే భోజనశాలలో అడుగుపెట్టి, తను కూడా వడ్డన మొదలుపెట్టింది. ఈ మార్పు అందరిలోనూ ఆశ్చర్యాన్ని, కొంత సంతోషాన్ని కూడా కలుగచేసింది. అందరూ సంతోషంగా భోజనం చేసారు. రామయ్యగారు మౌనంగా ఫలహారం ముగించి, ఉత్తారాపోశన చేసి, “రమణా రేపు మధ్యాహ్నం స్వామివారి విశ్రాంతి వేళ నిన్ను కలవమని చెప్పారు. నువ్వేదో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నావట కదా, ఆ పనిలో నీకేదో సూచనలు సలహాలు ఇవ్వాలనీ, అందుకని ఆయన్ను సంప్రదించమనీ చెప్పారు. రేపు వెళ్ళి కలు” అని చెప్పారు.
ఇంతవరకూ సూటిగా తనతో మాట్లాడని తండ్రి ఇలా మాట్లాడడం, తాను ఇక్కడే ఉండబోతున్న విషయం స్వామివారి ద్వారా తండ్రికి తెలియడం, అయినా ఆయన అందుకు అడ్డు చెప్పకపోవడం సంతోషాన్ని కలిగించింది రమణకు. గీతా రమణా ముఖాముఖాలు చూసుకుని, సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తపరచుకున్నారు.
భోజనాలు అయ్యాక ఆయన వెళ్ళి బయట నాలుగడుగులు నడిచి తర్వాత కాస్సేపు కృష్ణవేణమ్మ ఆరోగ్యం గురించి ఆవిడతో మాట్లాడి వెళ్ళి పడుకున్నారు.
ఆయన బయటకు వెళ్ళగానే రమణ చుట్టూ మిగతావాళ్ళు చేరి రమణ తను ఇక్కడ ఉండబోవడం నిజమా అని అడిగి తెలుసుకుని, అతని భవిష్యత్ప్రణాలికలు ఏమిటో తెలుసుకుంటున్నారు.
మర్నాడు పట్టుబట్టలు కట్టుకుని విభూది చందనం పెట్టుకుని రమణ స్వామివారి దర్శనం కోసం వెళ్ళాడు.
ఆయన రమణను చూస్తూనే, తనకు పక్కగా వచ్చి కూర్చోమని చెప్పారు. రమణ మాత్రం వినయంగా నమస్కరించి ఆయన ప్రక్కనే నుంచున్నాడు.
“రమణా, నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ పెట్టాలనుకోవడం, దాని భవనం కోసం శంఖుస్థాపన మాచే చేయించడం బాగానే ఉంది. దానివల్ల ఇంజనీరింగ్ చదివిన కొంతమంది విద్యాధికులు పల్లెకు మళ్లవచ్చు. కానీ ఇక్కడుండే వారికి భుక్తి ఎలా వస్తుందయ్యా, దాని గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా, మన సంస్కృత పాఠశాల, గుడి, మన సనాతన ధర్మం, మనపల్లె, ఈ పల్లెలోనే తయారు చేయబడ్డ వస్తువుల విక్రయం వాటిదిశగా ఎలాంటి అభివృద్ధి చెయ్యవచ్చు అనే విధంగా ఆలోచించు. ఒక్క సాఫ్ట్వేర్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే పల్లె యొక్క సర్వతోముఖాభివృద్ధి ఎలా సాధించగలుగుతాము? ఆ దిశగా ఏదైనా ప్రణాళికలు ఉంటే చెప్పు, వాటికి మఠం నుంచి కూడా నీకు సహాయం అందేలా చూస్తాను. నీ ప్రణాళిక మేము ఇక్కడినుంచి బయలుదేరే లోపు తెలియజేయి.” అన్నారు స్వామిజీ.
అతను సరేనని తలూపి అక్కడనుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి బయలుదేరాడు. దారిపొడుగునా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళి గీతతో కూడా చర్చించాడు. తనకు ఏది ఎలా చెయ్యాలో ఒక అవగాహన వచ్చింది.
మళ్ళీ సాయంత్రం రమణ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు అందరూ బయలుదేరారు. గీత ఎప్పటిలాగే పద్ధతిగా తాను తయారయి, పిల్లల్ని కూడా తయారు చేసి, అలాగే తన అత్తగారికి కూడా అన్నపూర్ణ సహాయంతో పట్టు చీర కట్టి, చక్రాల కుర్చీలో కూర్చోపెట్టుకుని, ఆవిడ్ని కూడా తీసుకుని బయలుదేరింది.
కృష్ణవేణమ్మ మొట్ట మొదటి సారి చాలా నెలల తర్వాత బయటకు వచ్చింది. అందరూ శంఖుస్థాపన చేసే స్థలానికి చేరుకున్నారు. యథావిధిగా వేద మంత్రోచ్ఛారణల మధ్య, స్వామివారి ఆశీర్వాదంతో, ఆయన పర్యవేక్షణలో, ఆయన చేతులమీదుగా శంఖుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారూ, ఆ వూరి మునసబు గారూ మాట్లాడారు. ఆ తర్వాత రమణ మాట్లాడాడు.
“ఈ ఊరన్నా, ఈ వూరి వాళ్ళన్నా నాకు ముందునుంచీ ఎనలేని ప్రేమ. కానీ, నా చదువుల మూలంగా ఆ తర్వాత ఉద్యోగాల వల్లనూ నాకు ఇక్కడ ఉండే అవకాశం లేకపోయింది. మా తండ్రి గారు చెప్పించిన చదువు వల్ల, ఆ దేవదేవుడు వేణు గోపాలస్వామి దయవల్ల నేను జీవితంలో కావాల్సిన దానికంటే ఎక్కువే గడించాను. ఈసారి నేను ఈ వూరికి వచ్చినప్పుడు, నాలాగే ఎందరో చదువులు ఉద్యోగాలని ఊరు వదిలి వలసలకి పట్నాలకు పోతున్నారని, ఇక్కడి వారికి ఉపాధి కరువైందని, ఇక్కడ ఇదివరకటి వృత్తులను, వారి జీవన శైలిని వదులుకుని పట్నాలకు పోయి జనులు కూలీపనులు చేసుకుంటున్నారని తెలిసి నేను బాధపడ్డాను.
‘చదువుల కోసం వేరే ఊళ్ళకి ఎందుకు వెళ్ళాలి? ఆ చదువులు ఇక్కడ కల్పించలేమా? పల్లెల్లో ఆయా వృత్తులు ఎందుకు అంతరించిపోవాలి? వాళ్ళను ఆదుకుని, ఆ వృత్తులను పెంపొందించే నాథుడు ఎవ్వరూ లేరా? ఆ దిశగా ఆలోచించి మార్గదర్శకత్వం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరా? మన సనాతన ధర్మాలు, ఆచారాలు అంతరించి పోవడానికి కారణమేమిటి? వాటిని కాపాడుకోవడం ఎలా?’ అని వీటి గురించి ఆలోచించాను. స్వామివారి మార్గ సూచనతో, నా ఆలోచనలు అమలు పెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను.
ఇక్కడ కట్టబోయే ఫాక్టరీలో ఒక భాగం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నెలవుగా ఉంటూ, ఆ విభాగంలో వుండే ప్రాజెక్టుల్లో పని చేస్తూ ఉంటారు.
ఇంకో విభాగంలో మన పల్లెటూరి ఉత్పత్తులను, చేనేత ఉత్పత్తులను ఆన్లైన్ లో అమ్మడం దగ్గర్నుంచి, వాటిని నేర్చుకుందామనుకున్న వారికి నేర్పే విధంగా ఉంటుంది. అంటే కుండలు చెయ్యడం, బొమ్మలు చెయ్యడం, కుట్లు అల్లికలు, బట్టలు కుట్టడం మొదలైనవి నేర్పడం లాంటివి. దాని వల్ల మన పల్లెటూరి వృత్తులు మళ్ళీ పుంజుకుంటాయి.
ఇవి కాక, మన వేద సంస్కృతి అభివృద్ధి కోసం ఒక ఆప్ తయారు చెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆప్ మన సంస్కృతిని పరిచయంచేసి, సంస్కృత భాషను ఆన్లైన్ ద్వారా నేర్చుకుందాం అనుకునే వారికి నేర్పే విధంగా, అలాగే ఆన్లైన్ ద్వారా కావాల్సిన వాళ్ళకు, వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కార్య కరామతులు, పూజ పునస్కారాలు చేయించడం మొదలైన సౌకర్యాలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా కల్పింప బడతాయి.
వీటివల్ల పై చదువులు చదివిన యువతకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి. మన హస్త కళలకు, కుటీర పరిశ్రమలకు, వ్యవసాయానికి ఆదరణ, ఆర్థిక సహాయం కల్పింపబడుతుంది. ఇక్కడి పురోహితులకు ఉపాధి దొరుకుతుంది. పల్లె నుంచి వలసలు తగ్గుతాయి.
ఇవన్నీ నా ఆలోచనలే, వాటిని కార్యాచరణలో అమలు జరపడానికి ఈ వూరి ప్రజలు సహకారం ఎంతో కావాలి. ఈ కార్యక్రమాన్ని సానుకూలంగా సాధించడానికి, స్వామివారు నన్ను అన్ని విధాలా ఆశీర్వదిస్తారని, అలాగే మా తల్లి తండ్రుల ఆశీర్వాదం, మా కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తుందని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను” అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అలా ఆ కార్యక్రమం విజయవంతమైంది.
రాత్రికి అందరూ ఎప్పటిలాగే భోజనాలు చేస్తుంటే, గీత అత్తగారిని భోజనశాలకు తీసుకు వచ్చి, ఆవిడకు కూడా అందరితో పాటుగా భోజనం తినిపించింది.
రామయ్య గారు చెయ్యి కడుక్కున్న తర్వాత అందరినీ వసారాలోకి పిలిచారు. అందరూ అక్కడ చేరి ఆయన ఎందుకు పిలిచారా అన్నట్టు ఎదురు చూస్తున్నారు.
“ఈరోజు చాలా సుదినం. కృష్ణవేణి చాలా రోజుల తర్వాత స్వస్థతతో కార్యక్రమానికి హాజరైంది. అలాగే రమణ చేపట్టిన మహాత్కార్యానికి స్వామివారి ఆశీర్వాదం లభించింది.
ఇన్నాళ్లూ అజ్ఞానంతో రత్నంలాంటి పిల్లాడిని అర్థం చేసుకోలేకపోయాను. నాన్నా రమణా, చిన్నవాడివైపోయావు లేకపోతే నిన్ను క్షమాపణ అడుగుదును. మీ వివాహం దైవేచ్ఛ అని తెలుసుకోలేక పోయాను. దేవుడి దయవల్ల మళ్ళీ అందరం ఇన్నాళ్ళకు మనస్పర్థలు లేకుండా ఒకటిగా మనగలిగాం. రామకృష్ణ బంగారు తండ్రి. వేదమంత్రాలు ఎంతబాగా నేర్చుకుంటున్నాడో, వాడికి వచ్చే శ్రావణ మాసంలో వడుగుకు ముహూర్తం పెట్టాను. బ్రహ్మాండంగా పిల్లాడి వడుగు చేద్దాం” అన్నారు.
అందరూ సంతోషించారు.
వెంటనే రమణ గీత ఆనందభాష్పాలతో, దశరథరామయ్య గారి పాదాల మీద పడ్డారు. ఆయన ఇద్దరినీ సాదరంగా లేపి, రమణను గుండెలకు హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చారు. పుత్ర పరిష్వంగణానందాన్ని చవిచూచారు. అప్పుడే అక్కడికి బుట్టబొమ్మలా పట్టు పరికిణీతో వచ్చి తాతగారి కాలును చుట్టేసిన జానకిని ఆయన ఎత్తుకుని, “మా తల్లే, నువ్వు నిజంగా మా అమ్మవమ్మా” అని ముద్దు పెట్టుకున్నారు. ఇంటిల్లిపాదీ ఆనంద డోలికల్లో తేలియాడారు. వారిని చూసి పల్లెటూరే సంతోషించింది.
(సమాప్తం)
శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుత నివాసం బెంగళూరు. వీరు 2019 నుంచి కథలు వ్రాస్తున్నారు. మొదటి కథ ‘నకిలీ మనిషి’. 2020లో వ్రాసిన మొదటి ధారావాహిక 45 భాగాల ‘విధి’ చాలా మందిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి కథలు, ధారావాహికలు వ్రాస్తున్నారు. 2023లో ‘ఆనందమయి’, 2025లో ‘అందం’ అనే ధారావాహికలు రచించారు. 2021లో భావుక సమూహం నిర్వహించిన ఆరు వారాల కథల పోటీలో వీరు రాసిన ‘దత్తత’ అనే ధారావాహికకు బహుమతి లభించింది. 2025లో అదే సమూహం నిర్వహించిన గొలుసు నవలా ప్రక్రియలో పాలు పంచుకుని, 25 మంది రచయితలతో కలిసి వీరూ ఒక భాగం వ్రాశారు.
ఇప్పటివరకు 15 దాకా కథలు, 7 ధారావాహికలు వ్రాశారు. వీరి కథలు రవళి అంతర్జాల మాసపత్రిలోనూ, తెలుగుతల్లి కెనడా అంతర్జాల పత్రికలోనూ, లీడర్ పత్రికలోనూ ప్రచురణకు నోచుకున్నాయి. వీరు వ్రాసిన కొన్ని కథలు, ధారావాహికలు వివిధ చానల్స్ ద్వారా ఆడియో కథలుగా వచ్చాయి. ప్రమదాక్షరి, శ్రీమతి మంథా భానుమతి గారు సంయుక్తంగా నిర్వహించిన మినీ నవల పోటీలో తన మినీ నవల ‘పల్లె పిలిచింది’కి ప్రోత్సాహక బహుమతి లభించడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నారు.
