ఈ భూమిలో ఏ రహస్యం దాగుందో!
ఈ పొరల మధ్య ఏ బడబానలం రగులుకుందో!
హతశేషుల, క్షతగాత్రుల
ఆర్తనాదాలు వినిపించేందుకా?
కులమతాలను కూల్చేందుకా?
సామూహిక శవ దహనాలతో
సామరస్యం సాధించేందుకా?
ఈ అంతరాలను అంతమొందించేందుకా?
ఎందుకు – ఎందుకు – ఎందుకీ
ప్రళయ నర్తనం? విలయతాండవం?
ఏ శిథిలావశేషాల కింద
ఏ తనువు చావించిందో!
ఏ చిన్నారి చిరునవ్వు
ఏ క్షణాన చిదిమేసిందో!
ఏ కప్పు కింద ఏ ముప్పు జరిగిందో!
ఏ రోగగ్రస్థ శరీరం
ఎప్పుడు ఉపశమనం పొందిందో!
ఏమిటి? ఏమిటి? ఏమిటీ?
ప్రళన నర్తనం? విలయతాండవం?
కష్టార్జితంతో కట్టుకున్న యిల్లే
సమాధి అవుతుందని
ఇంటి వాసాలే శవ దహనానికి
కట్టెలుగా మారతాయని ఎవరూహిస్తారు?
ఏ మమతల జంట ఇది కాళరాత్రని
కలలు గంటూ నిద్రపోతుంది!
అపురూపంగా అల్లుకున్న ఏ ఊహల తీవలు
ఎప్పుడు తెగిపోతాయో ఎవరికి తెలుసు!
ప్రకృతి బీభత్సం –
మనిషికెప్పుడూ ప్రశ్నార్థకమే!
(భూకంపంపై స్పందన)
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.