[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ప్రకృతి సిరివి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
పూలకే తేనియలు వున్నాయనుకున్నాను నే ఇన్నాళ్ళూ
నీ పెదవులు చూసాక అది తప్పని అర్థమైంది
వెన్నెలలు జాబిల్లికే సొంతమని భావించాను ఓనాడు
నీ కళ్ళను చూసాక కానీ నా పొరపాటు తెలిసిరాలేదు
వసంతం ఏడాదికి ఒకమారే అని విన్నా
నీ దర్శనంతో అది ప్రతి రోజూ అనుకుంటున్నా
నందనవనం గురించి ఎవరో అంటే ఏమో అనుకున్నా
నువ్వు కదలివస్తూంటే అదే ఇలకు వచ్చిందనుకుంటున్నా
నిన్ను చూసిన నా కళ్ళకు
కడలి పొంగులలో ఏముందనిపించింది
నింగిన పూచే సోయగం హరివిల్లు అనుకున్నా
కానీ నీ మేనిలో అణువణూవునా ఓ ఇంద్రధనస్సును చూసా
ఒక్క మాట అయితే చెప్పగలను
ఈ సృష్టిలో లేనివి ఏమైనా వున్నాయేమోగానీ
అన్నీ వున్న ప్రకృతి సిరివి నీవని నా మనస్సు అంటోంది
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.