[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-13: ఏలోస్ (Aloes)
సోకోట్రిన్ ఆలోస్గా పిలవబడే మొక్క నుండి హెల్బియో, డా॥ ఎన్.ఎమ్. చౌదరి ఔషధ గుణాల్ని పొటెన్సీ రూపంలో రాబట్టడమైనది.
స్థానాలు:
ఈ మందుకి కాలేయం, మలాశయం, నడుం, తల, స్త్రీ జననేంద్రియాలు, సిరలు (ఉదర సంబంధమైనవి), నర్వస్ సిస్టమ్, పోర్టల్ సిస్టమ్, రక్తం, చర్మంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు:
ఇది జీర్ణకోశ వ్యాధులు, కఫ రోగాలు, మెనోపాజ్లో వచ్చే నరాల వ్యాధులు, అనోరెక్టల్ వ్యాధులకి మంచిది.
పోలికలు:
దీన్ని ఎలియం సటైవా, కాలీబైక్, ఎలియం సెపా, ఎస్కులస్, పోడోఫైలం, మెర్క్సాల్, లైకోపోడియం మందులతో పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
దీనికి ఓపియం, కాంఫర్, నక్స్, లైకోపోడియం మందులను విరుగుళ్ళుగా వాడుకోవచ్చు.
సహచరి:
సల్ఫర్ మందు బాగా పనిచేస్తుంది.
స్వభావం:
వీరు శారీరక, మానసిక శ్రమ లేనివారు.
ఉద్రేకం:
వీరికి వేసవిలో తినడం, త్రాగడం, నిల్చుండడం వల్ల, సోమరితనం వల్ల, ఉదయం, భోజనానంతరం. వర్షాకాలం నడవడం, వేడి పొడి వాతావరణం, వెచ్చదనం వల్ల ఉద్రేకం వస్తుంది.
ఉపశమనం:
వీరికి బైట గాలిలో తిరిగినా, విరేచనం, అపాన వాయువులు వెళ్ళిన తర్వాత, చల్లనీళ్ళు వల్ల, వెలుతురు వల్ల, స్నానానంతరం, చల్లదనం వల్ల వ్యాధి లక్షణాలు ఉపశమనం చెందుతాయి.
వృద్ధులు:
ఇది స్త్రీలలో ముట్లుడిగిపోయేటప్పుడు ఉపయోగపడుతుంది. పీరియాడికల్గా ప్రతి సంవత్సరం వచ్చే చర్మ వ్యాధులకు మేలైన మందు.
కారణాలు:
శరీర పరిశ్రమ లేకపోవడం, శ్లేష్మ రోగాలు, నరాల వ్యాధుల కలిగే వ్యాధులకు ఉపయోగపడుతుంది.
మోతాదు:
వీటిని 6-200 పొటెన్సీ. ఆసన రోగాలు 3-3X పొటెన్సీ లో వాడుకోవచ్చు.
కాల పరిమితి:
1-7 రోజులు ఉంటుంది.
మయాజమ్:
సోరా. వీరిది బిలియస్ (పైత్య) టెంపర్మెంట్, వేడి భరించలేరు.
మానసిక లక్షణాలు:
వీరికి నిరాశ, ఎక్కువ కోపం, శ్రమయందు అయిష్టం, ఆయాసం కల్గుతుంది.
శారీరక లక్షణాలు:
తల:
వీరికి వికారం, మలబద్దకంతో నుదుటిలో నొప్పిగా ఉండి కళ్ళు బరువుగా ఉండడం, కళ్ళు మూసుకోవడం, తల దిమ్ము, విరేచనానంతరం తలనొప్పి, వేడి, వేసవిలో ఎక్కువవడం ఉంటుంది. తలనొప్పి, నడుం నొప్పి, మలబద్దకంతో అడుగు వేయునపుడెల్ల, వేడివల్ల ఎక్కువై చల్లని ఉపశాంతి వల్ల తగ్గుతుంది.
కళ్ళు:
కళ్ళు ఎర్రబడి వస్తువులన్నీ పసుపురంగులో కనపడడం, కండ్ల నుండి నీరు కారడం, కంటిగుడ్డులోపల ఎక్కువగా బాధగా, నొప్పిగా ఉండడం వల్ల కళ్ళు మూసుకోవడం వుంటుంది.
ముఖం వేడితో తలనొప్పి, పెదవులు ఎర్రబారడం, చెవిలో పోటు ఉండి, సంగీతం, చప్పుడు వల్ల రోగి కంపించడం జరుగుతుంది. ఉదయాన నిద్ర లేవగానే ముక్కు నుండి రక్తస్రావం, నోటిలో చేదు రుచి, పుల్లని లాలాజలమెక్కువగా ఊరుతుంది. మాంసం నందు అయిష్టం, ఎప్పుడు ద్రవ పదార్థాల్నే కోరడం, తిన్న తర్వాత త్రేన్పులు రావడం, ఆసనం దురదగా ఉంటుంది. పొత్తి కడుపులో, బొడ్డుచుట్టు బాధ ఎక్కువవుతుంది. మల విసర్జనకు ముందు గ్యాస్తో పొట్ట ఉబ్బరం, పట్టేసినట్లుండే నొప్పి, రెక్టమ్లో బరువుగా ఉండి సడన్గా మలవిసర్జనానుమానం వుంటుంది.
మలవిసర్జన సమయంలో మలబద్దకం వుంటుంది. కాలేయం వద్ద వెచ్చగా ఉండి నొప్పి నిల్చుండిన ఎడల ఎక్కువవుతుంది. మూత్రం విసర్జించేటప్పుడు అప్రయత్నంగా విరేచనమవుతుంది. జెల్లీలాగా జిగురు ముద్దలుగా పోతుంది.
గ్యాస్ ట్రబుల్ వల్ల పొట్ట ఉబ్బరించి బాధగా ఉంటుంది. గుడ గుడ శబ్ధాలు రావడం, దుర్వాసన గల ఎక్కువ అపానవాయువు వెళ్ళిన తర్వాత బాధ తగ్గుతుంది. భోజనం తర్వాత, ఏదైనా ద్రవ పదార్థాలు త్రాగిన తర్వాత విరేచనానుమానం ఉన్నా విరేచనమవకపోవడం ఉంటుంది. అధిక అపాన వాయువుతోపాటు కొద్దిగా పల్చని విరేచనం కావడం జరుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే వెచ్చగా, పల్చని, పసుపు పచ్చని విరేచనాలు, ముద్దలుగా జిగురు పడడం, బాధతో, ఎక్కువ తీపుతో కావడం, మల విసర్జన సమయంలో విరేచనం తర్వాత రోగి నీరసించిపోవడం, సొమ్మసిల్లడం, ఆకలి వుంటుంది. బీరు త్రాగేవారిలో పుల్లని పదార్థాలు, తినడం వల్ల కలిగే నీళ్ళ విరేచనాలకిది మంచి మందు.
విరేచనాలు నడుచుట చేత, నిలబడుటచేత, తినుటవల్ల, త్రాగడంవల్ల ఎక్కువ అవుతుంది. విరేచనం తర్వాత బాధతో కూడిన మ్యూకస్ ఎక్కువగా పోవడం, మొలలు ద్రాక్షగుత్తి వలె వెలుపలికి రావడం, చల్లనీళ్ళ వల్ల రిలీఫ్ ఉంటుంది. నడుం నొప్పి వుంటుంది. మలవిసర్జన తర్వాత నొప్పులు తగ్గి అధిక చెమటలు పట్టడం, అధిక నీరసం వుంటుంది. ఆసనంలో నిరంతరం దిగలాగినట్లు బాధగా, పచ్చిగా ఉండడం, ఆసనంలో దురద, మంట ఉండేవారికిది మంచి మందు.
మూత్రం:
వృద్ధుల్లో తరుచు మల, మూత్రానుమానం వుండడం. ప్రొస్టేటు గ్రంధి వాపు వల్ల మూత్రావయవాలు బరువుగా, బాధగా ఉంటాయి. పురుషుల్లో సాయంకాలం, భోజనానంతరం, మెలకువ వచ్చిన పిమ్మట సంభోగేచ్ఛ ఎక్కువవడం వుంటుంది.
స్త్రీలలో బహిష్టులు తొందరగా, ఋతుస్రావం ఎక్కువవుతుంది. కడుపులో శూలతో తెల్లమైల రక్తం జీరలతో కావడం, గర్భాశయం వెలుపలికి జారడం, ముట్లాగి పోయేటప్పుడు వచ్చే అధిక రక్త స్రావాలు ఉంటాయి. నిలబడినపుడు, బహిష్టు అయినప్పుడు ఆసనంలో తీపు ఉంటుంది.
వర్షాకాలంలో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ వల్ల దగ్గు, శ్వాస అందక పోవడం, పొత్తి కడుపులో నుండి ఛాతీలోనికి పోట్లు పొడిచినట్లుంటుంది.
ఒకసారి నడుంనొప్పి ఉంటే, మరొకసారి తలనొప్పి మొలల బాధతో రావడం, నడుం నొప్పి కూర్చున్నప్పుడు, రాత్రి మెలకువ వచ్చినప్పుడు ఎక్కువై కదలిక వల్ల తగ్గుతుంది. ప్రతి సంవత్సరం వర్షా కాలంలో వచ్చే ఎగ్జిమా (చిడుము) వంటి చర్మ వ్యాధులకిది మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
