[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-59. మెజీరియం (Mezereum)
డాఫెనె మెజీరియమ్ అని పిలవబడే వృక్షజాతికి చెందిన మొక్క నుండి ఔషధ గుణాల్ని రాబట్టినవారు ఇ. స్టాష్. దీన్ని వెజిటబుల్ మెర్కురీ అని అంటారు.
స్థానాలు:
ఈ మందుకి చర్మం, ఎముకలు, నరాలు, బ్రెయిన్ పై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది చర్మవ్యాధులు, శ్లేష్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
ఉద్రేకం:
వీరికి చల్లని గాలిలో, రాత్రియందు, సాయంకాలం మొదలు అర్థరాత్రి వరకు, వెచ్చని ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి బహిరంగమైన చల్లని గాలిలో ఉపశమనం ఉంటుంది.
విరుగుళ్ళు:
కాలీ అయోడ్, మెర్క్సాల్, నక్స్వామికా, బ్రయోనియా, రూస్టాక్స్, కాంఫర్, కాల్కేరియాకార్బ్ మందులు దీనికి విరుగుళ్ళుగా పనిచేస్తాయి.
మెర్క్సాల్, నైట్రిక్ ఆసిడ్, ఫాస్ఫరస్లకిది విరుగుడు. జనవరి, ఫిబ్రవరిలలో వచ్చే రోగాలకిది మంచి మందు.
వీరిది ఫ్లెగ్మాటిక్ టెంపర్మెంట్. వీరు చలికి తట్టుకోలేరు.
మోతాదు:
6-30 పొటెన్సీలో దీన్ని వాడుకోవాలి.
కాల పరిమితి:
45-80 రోజులుంటుంది.
మయాజమ్:
ఇది సోరా, సిఫిలిస్ మయాజమ్ గల మందు.
మానసిక లక్షణాలు:
ప్రతి వారిని దూషించడం, దెబ్బలాడుట ఎంతో ఇష్టంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి, ఏ విషయమైనా నెమ్మదిగా గ్రహించి ఆలోచనల్ని మరచిపోతారు.
శారీరిక లక్షణాలు:
తల:
మాటలాడుట వల్ల తలనొప్పి రావటం, కుడివైపు మత్తును కలుగజేయునట్టి తలనొప్పి, రాత్రి యందు ముఖం, కండ్లు, నరాలలో నొప్పి ఉండి, చెవులలోకి వ్యాపిస్తుంది. తల మీద ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మరోగాలతో దురదగా ఉంటుంది. వెచ్చదనం వల్ల దురదలు, బాధలు ఎక్కువవుతాయి.
ముక్కు:
తుమ్ములు విపరీతంగా రావడం వల్ల ముక్కు నుండి అదే పనిగా నీరు కారడం ఉంటుంది. ముఖం పాలిపోయి ఉంటుంది. బిడ్డ తల ముఖంను అదే పనిగా గోకడం వల్ల ముఖమంతా రక్తం చిమ్మినట్లయి ముఖం ఎర్రగా అవుతుంది. నోటి చుట్టూ దద్దుర్లు లేక పొక్కులు బయలుదేరడం వుంటుంది.
నోటిలో నీళ్ళూరడం, జీర్ణకోశంలొ పుండు వల్ల మంటగా ఉంటుంది.
మలం ఆకుపచ్చగా వెడలుచు ఆసనం వెలుపలికి వస్తుంది.
మూత్రం వెచ్చగా రక్తంతో కలసి పోతుంది. మూత్రం పోయిన తర్వాత కొద్దిగా రక్తం చుక్కలు పడుతుంటాయి. పురుషుల్లో గనేరియా వ్యాధికిది మంచి మందు.
స్త్రీలలో తెల్లమైల ఒరుపుతో ఉంటుంది. బహిష్టు ముందరగా, స్రావమెక్కువగా ఉంటుంది. పెద్ద ఎముకల వద్ద బాధ, వాపు ఉంటుంది.
చర్మంపై పొక్కులు, మాననటువంటి దురద, తామర, పుండ్లలో దురద, మంట, వాపు ఉంటుంది. పొక్కులు పుండ్లనుండి చిక్కని చీము పోతుంటుంది. ఇలాంటి వారికిది సూచించదగ్గ మందు.
హోమియో మందులు-60. మిల్లిఫోలియం (Millefolium)
యూరోగా పిలవబడే వృక్షజాతికి చెందిన మొక్క నుండి ఈ మందును డా॥ హానిమన్ ఔషధ గుణాల్ని రాబట్టడమైనది. దీన్నే విభలియా అంటారు.
స్థానాలు:
ఈ మందుకి మూత్రావయవాలు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, ఆసనం, ముక్కుపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది రక్తస్రావాలు, శ్వాసకోస వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పోలికలు:
దీనిని ఎకాలిఫా ఇండికా, ఇపికాక్, ఫికస్, జిరానియం, హెమమెల్లిస్ తో పోల్చవచ్చు.
విరుగుళ్ళు:
జిరానియం మేకులేటిన్ దీనికి విరుగుడు
ఉద్రేకం:
వీరికి ఎక్కువ శ్రమ, ముందరకు వంగుట వల్ల, కాఫీ త్రాగడం వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి రైన్, కళ్ళు తిరగడం, వికారం వల్ల ఉపశమనం ఉంటుంది.
కారణాలు:
బరువులు ఎత్తడం వల్ల కల్గు దోషాలు, క్రిందపడడం, పాలు, లోఖియా, బహిష్టులు అణిచివేయడం వల్ల వ్యాధులు వస్తాయి.
మోతాదు:
3-30 పొటెన్సీలో మదర్ టించర్ రూపంలో వాడవచ్చు.
కాల పరిమితి:
1-2 వారాలు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
వీరికి ఇరిటేషన్ ఎక్కువ, ఏం చేస్తుంది తెలియదు. కాఫీ తాగిన చక్కనౌతుంది. మెల్లగా కదలిన తల తిరుగుతుంది. బహిష్టులు అణచివేయడం వల్ల ఫిట్స్ వస్తాయి. తలకు రక్తప్రసరణ అధికమై గుచ్చినట్లు నొప్పులుంటాయి. తల నెమ్మదిగా కదులుట వల్ల వికారం వస్తుంది.
శారీరిక లక్షణాలు:
ముక్కు దిబ్బడ, ముక్కు నుండి రక్త స్రావం అవ్వడం ఉంటుంది.
మూత్రం రక్తంలో పోవడం వల్ల నిస్త్రాణగా ఉంటారు.
ఆంత్రాల నుండి మూలశంఖ నుండి రక్తం స్రవించడం ఉంటుంది.
పురుషులలో వీర్యనష్టం, గనేరియా వ్యాధిని నివారిస్తుంది.
స్త్రీలలో గర్భాశయం నుండి బహిష్టుకు బహిష్టుకు మధ్య కల్గు రక్త స్రావాలు. బహిష్టులో స్రావమెక్కువగా ఉంటుంది. వంధ్యత్వం గలవారిలో అధిక ఋతుస్రావం వుంటుంది. నీరసం వల్ల యువతుల్లో వచ్చే తెల్లమైలకి ఇది మంచి మందు. బహిష్టులు అణిచి పెట్టడంతో వచ్చు మార్పులు, దగ్గు, గుండెదడకిది మంచి మందు.
ప్రసవానంతర స్రావం ఎక్కువగా పోవడం వల్ల నీరసం వుండి, ఒక్కోసారి అణిచిపెట్టడం వల్ల బాలింత జ్వరం వస్తుంది. తల్లిపాలు అణిచిపెట్టడం వల్ల కంపంతో కూడిన ఫిట్స్ వచ్చి, అవయవాలలో విపరీతమైన బాధ ఉంటుంది. గర్భ స్రావమైన, ప్రసవమైన తర్వాత వచ్చే స్రావాలు బాధ లేకుండా వస్తాయి.
క్షయ రోగుల్లో కల్గు రక్తస్రావాలు దగ్గినప్పుడు రక్తంతో కూడిన స్రావం వస్తుంది. ఇలాంటి వారికిది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
