Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రణయ రాగం పల్లవించిన రోజు

[14 ఫిబ్రవరి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘ప్రణయ రాగం పల్లవించిన రోజు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

లి చెలి చెలరేగుతోన్న ఈ హేమంతంలో
మంచు ముత్యాలు జాలువారుతోన్నవేళ..
నిరంతరం నీ తలపులతో
కురుస్తూనే వుంది నీ వలపు వెన్నెల వాన!

నువ్వు నా ఎద లోయలలో ముద్రించిన
మధురానుభూతుల చిత్తరువులు
నీ రాత కోసం నిరీక్షిస్తున్నాయి చెలీ!

నా ఎదురు చూపుల వయసెంతో
నాకైతే తెలియదు గానీ..
నీ కాలి అందియల సవ్వడి వినాలని
ప్రకృతి కాంత పరవశంతో ఎదురు చూస్తోంది!

కౌముదీ కాంతుల పున్నమి రేయి
మల్లెల పాన్పును పరిచింది ఆహ్లాదంగా..
రేయి తెల్లవార్లు పల్లవించేందుకు
నా తపనల తనువు..
‘సై’ అంటూ రాగాలు పలుకుతోంది!

ఏడాది మొత్తం ఈ రోజు కోసమే
ఎదురు చూస్తూ వుంటాయి ప్రేమపక్షులన్నీ!

అపురూపమైన నీ సోయగాన్ని
కవితాక్షరాలతో ఆరాధిస్తూ..
ప్రతి రేయి నాకు జాగారమే అవుతోంది!

జాగు సేమకు ప్రేయసీ!
విరహాగ్నికి నా ప్రేమ హృదయం
ఆహుతి కాకముందే..
సుగంధాల మల్లెలను
నీ కొప్పులో తురుముకొని రా!

నక్షత్ర భామల సరసాల రేడు
చందమామ సాక్షిగా –
మన ప్రేమ వెన్నెల గాథను
సరసంగా చెప్పుకుందాం..
వేగిరం నా గుండె గుమ్మంలో అడుగు పెట్టు సఖీ!

Exit mobile version