[శ్రీ బొందయ్య ఆడేపు రచించిన ‘ప్రథమ వందనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వందనమో వైవిద్య వనితామణి
వినయ సంపన్న విదుషీమణి
వివాదరహిత మనస్విని
విద్వదనంత సంపన్న సౌభాగ్యిని
విచక్షణ శక్షు విరాగిణి
అనన్య ఆనంద ప్రదాయణి
అవ్యక్త మనోల్లాసిని
ఎవరు నీవంటే, ఏమని చెప్పను
ఆనందమే నీ రూపమై
అనురాగమే నీ ఆభరణమై
ఆలంబన నీ కరకంకణమై
అభిమానం నీ ఆభూషణమై
నీవు వీచే పవనమై
వర్షించే హర్షమై
ప్రవహించే జలపాతమై
విచ్చుకునే విరిపంకమై
మెచ్చుకునే కవిగానమై
పద్యమై, గద్యమై
పదకవితకు వైవిధ్యమై
పాటకు పల్లవై
పలుకుల విరితేనెవై
వీడని నీడవై
తోడై జోడైన నీతో
నిన్నో మొన్నోనీచేయి పట్టుకొని
ఏడడుగులు నడిచినట్టుంది
ఇప్పుడిప్పుడే మన పాపానెత్తుకున్నట్టుంది
అప్పటికప్పుడే మూడున్నర దశాబ్దాలు
కాలగతిన కలసి నడిచామిద్దరము
అందుకే
వందనమో వైవిద్యావనితామణి
