[ధూళిపాళ అరుణ గారు రచించిన ‘రుధిర స్వప్నాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అక్కడ..
నెత్తుటి ముద్దల వర్షంలో తడిసి
సతత హరితాలు
ఎర్రగా మెరుస్తున్నాయి
గోడకు దిగ్గొట్టిన మేకులా
గాలి కొయ్యబారి ఆగిపోయింది
అదుపులేని శబ్ద ప్రకంపనాలు
ధరణి దేహాన్ని చీలుస్తున్నాయి
భూసారం పెటేలున పేలిపోతూ
పొగగా ఆకాశంలోతేలుతోంది
వేలప్రాణాలను ఒకేసారి తాగుతున్నా
తీరని మృత్యుదాహార్తిలో
శూన్యాన్ని శాపంగా అందిస్తూ
భీతావహంగా నవ్వుతూ
కలవరపెడుతున్న కాలం
కడుపారగ తిన్న ఆహారంతో
బలిసిన రాబందుల
రెక్కల చప్పుళ్ళ నడుమ..
గడ్డకట్టుకుపోయిన నవ్వులు
మాయమవుతున్నాయి మౌనంగా
బతుకు ఆశలు కుప్పకూలి
యుద్ధపు చీకటి కూడళ్లలో
రుధిరాన్ని స్వప్నిస్తున్నాయి
ఏ కాలపు తీరానికి చేరువగా
వేకువ వికసిస్తుందో తెలియక
బిగబట్టిన ఊపిరి కింద
చావుబతుకుల పోరాటంతో
క్షణాలను లెక్కిస్తూ
అఖాతపు అంచులకు వేలాడుతూ
అ.. ర.. ణ్య రోదన..!!!
ధూళిపాళ అరుణగారు అధ్యాపకురాలిగా పనిచేసారు. తెలుగు ఎమ్.ఏ., టిపిటి చేశారు. 25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం గడించి, స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 28 మందిని ఇంటర్వ్యూలు చేశారు.
ప్రచురణలు: ‘జ్ఞాపకాల సంతకం’ తొలి కవితా సంపుటి. ‘మిగిలేవి గురుతులే’ తొలి కథా సంపుటి. ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం, మయూఖ ముఖాముఖి (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం), చేతనాశిల్పం (కవితా సంపుటి), మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం ఇతర ముద్రిత గ్రంథాలు. ఫోన్: 8712342323
