సమాజంలోని రుగ్మతలు తొలగించి, ఆదర్శ సమాజ నిర్మాణమే సాహిత్య ప్రయోజనం కావాలని శారదా కళా సమితి అధ్యక్షులు డోగిపర్తి శంకరరావు అన్నారు. 26/4/2026 ఉదయం సరస భారతి (ఉయ్యూరు) సంస్థ నిర్వహణలో గాంధీనగర్ వెలిగండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రముఖ సాహితీవేత్త చలపాక ప్రకాష్ సాహితీ ప్రయాణం గురించి పలువురు కవుల సంకలనం ‘సాహితీ ప్రకాశం’ ఆవిష్కరణ జరిగింది.
పుస్తకాన్ని ఆవిష్కరించిన శంకర్రావు ప్రసంగిస్తూ కవులను గుర్తించి గౌరవించాలని అన్నారు. గ్రంథాలయాలు అందించే సౌకర్యాలను కవులు విద్యార్థులకు ఉపయోగించు కోవాలన్నారు. తమ గ్రంథాలయంను కళాకారులకు ఉపయుక్తంగా ఉండే విదంగా ఆధునీకరించామని శంకర రావు అన్నారు. ప్రేక్షకులు అసౌకర్యానికి గురికాకుండా త్వరలో జనరేటర్ ఏర్పాటు చేస్తామని శంకర్రావు తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన గబ్బిట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చలపాక ప్రకాష్ అనేక రచనలు చేసారని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్త, సాహితీవేత్త తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు మాట్లాడుతూ విలువలతో కూడిన సాహిత్యాన్ని కవులు సమాజానికి అందించాలని అన్నారు. కవయిత్రి చింతా లక్ష్మి సుజాత కవి చలపాక ప్రకాశ్ను గజమాలతో సత్కరించారు.
సభలో వేలూరి సుధారాణి, కోనేరు కల్పన, సామినేని శైలజ, వి విజయశ్రీదుర్గ, కె ఆంజనేయ కుమార్, బి ఆంజనేయ రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

