Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాంత్వన!

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘సాంత్వన!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

క్షరం నాకు వ్యసనమయ్యింది
రేగే ఆలోచనల సుడులలోంచి
బయటపడేసే మత్తుమందులా
భావాల మైకం జల్లే సాంత్వన!

జీవిక జాలంలో చిక్కి ఊపిరాడక
పారిపోయే దారి దొరకనప్పుడు,
గుండె గూడులో పేరిన బరువును
గుదిబండలా మారనీయకుండా
తేలికపరచగల ఆమ్లజనిగా అది!

లోకం పోకడైన గెలుపోటముల కేళిలో
నేను తేలిపోయి ఓడిపోతున్న ప్రతిసారీ
నన్ను నేను రేపటిలోకి నడిపించడానికి
తేలే వారధిలా అది ఆ తీరం చేరుస్తుంది!

అలసి సొలసి పోయిన సగటు ప్రాణం
అక్షరం ఒడిలోకి చేరి తలవాల్చగానే,
నిన్నటి గాయాలన్ని మటుమాయమై
రేపటి మనుగడకై ఆశలు చిగురిస్తాయి!

ఉద్వేగాలు ఉరికి అలలై కదులు వేళ
ముని వేళ్ళు భావాల లహరిలో తడిసి
భావ సిరా చరవాణి తెరపైన అక్షరాలై
వరుసకడుతున్న వేళ మనసు తేలికై
అక్షర మల్లెల కాసారంలో సేదదీరుతుంది!

Exit mobile version