[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
దేవ త్వత్సేవకాః సర్వే స్వగృహోత్కంఠితాశయాః।
దేశకాలావనాలోచ్య కథయన్త్య సుఖప్రదమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 95)
హే ప్రభూ! మీ సేవకుల మనస్సు వాళ్ల ఇళ్ల వైపు మళ్ళింది. లేకపోతే, ఇలా ముందూ వెనుక ఆలోచించకుండా, నష్టం కలిగించే అసుఖప్రదమైన మాటలు మాట్లాడరు.
అందరూ హాజీఖాన్ను కశ్మీరుపై దండయాత్రకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు. కానీ మంత్రులు మాత్రం ఇతరుల సలహాలకు వ్యతిరేకమైన సలహానిస్తున్నారు. నీ సేవకులు కశ్మీరుకు దూరంగా ఉండటం వల్ల విసిగి ఇళ్ళకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. లేకపోతే ముందూ వెనక ఆలోచించకుండా ఇలాంటి సలహాను ఇవ్వరు అని హాజీఖాన్ను హెచ్చరిస్తున్నారు.
కథమభ్యన్తరం యామః సతి రాజ్ఞి బలోర్జితే।
ప్రదీప్తం వ్యోమ్ని మార్తాండం కుండేన పిదధాతి కః॥
(శ్రీవర రాజతరంగిణి, 96)
ఆకాశంలో సూర్యుడికి ఎవరు అడ్డుపెట్టి ఆపగలదు? అలాగే కశ్మీరులో శక్తిమంతుడైన రాజు ఉన్నంత వరకూ కశ్మీరులో ఎవరైనా ఎలా అడుగుపెట్టగలరు? సూర్యుడిని కొబ్బరి చిప్పతో అడ్డు పెట్టి ఆపగలరా? అని అడుగుతున్నారు మంత్రులు. అంత శక్తిమంతుడు జైనులాబిదీన్. జైనులాబిదీన్ కశ్మీరులో జీవితుడై ఉన్నంత వరకూ ఎంతటి వీరుడైనా కశ్మీరు వైపు కన్నెత్తి చూడలేడు. కాబట్టి ఎవరెంతగా ప్రగల్భాలు పలికినా, కశ్మీరుపై దాడి చేసి గెలవగలటం అసంభవం అన్న మాటను నిర్మొహమాటంగా చెప్తున్నారు. మంత్రులు అన్న వారు ఎంతటి అప్రియమైన సత్యానయినా చెప్తారు. వారు రాజు శ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తారు. ఇతరులు ఎంతగా రాజును ఉత్తేజపరచి చెడు దారిలో ప్రయాణింప చేయాలనుకున్నా మంత్రులు రాజుకు నిజానిజాలు చెప్తారు. అంతా విన్న తరువాత రాజు తన నిర్ణయం తీసుకుంటాడు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
