మహా శివరాత్రి సందర్భంగా 28-2-2022 తేదీన విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన ‘సమన్వయ సరస్వతి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ‘శివపదం’ కీర్తనలపై శ్రీ చాగంటి లింగరాజు గారి ‘శివపదార్చన’ ప్రసంగ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో జరిగినది.
శ్రీమతి నిష్ఠల సరోజ గారి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సభలో ఆచార్య మలయవాసిని గారు మాట్లాడుతూ, మహా శివరాత్రి పర్వదినానికి ముందు రోజు శివుడిని ప్రార్థించడం పుణ్యప్రదమని పేర్కొన్నారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ‘శివపదం’ కీర్తనలు కర్ణపేయంగా గానం చేసి, అద్భుతంగా వ్యాఖ్యానం చేసినందులకు వారి శిష్యులైన శ్రీ చాగంటి లింగరాజు గారిని అభినందించారు.
పాలకొల్లు నుంచి సభలో ప్రధాన వక్తగా పాల్గొని, సుమారు గంటన్నరసేపు శ్రోతలను అలరించిన శ్రీ చాగంటి లింగరాజు గారు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసారు.
దేశ విదేశాలనుంచి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ అంతర్జాల సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సమన్వయకర్తగా వ్యవహరించారు.