[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘స్పందిద్దాం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నిశ్చల జలాశయంలో
తొలి వాన చుక్క పడి
సృష్టింపబడ్డ తరంగాల్లా
హృదయాంతరాళాల నడి
ఊరే పలు భావనల సవ్వడి ప్రవహించు..
స్పందనల జలాశయంలా!
స్పందనల నాడి పట్టి సాగే
రచన.. వచనమో, గేయమో..
ప్రక్రియ ఏదైనా కాని..
కవి హృదయ భారం అక్షరం పాలై
కురిసే మేఘంలా భారరహితమవుతుంది!
అనుభూతులు ఎన్నో..
తనువంతా పాకిన నాడీ వ్యవస్థలా
స్పందించగలుగు హృదయాలు కొన్నే..
అవే కదా ఈ సంఘానికి స్నేహితులు!
ఇతరుల గురించి
తపించని హృదయాలు..
సానుభూతితో
చెమర్చని నయనాలు..
సమాజ హితులెలా అవుతాయి?
వాటి సహవాసం సంఘానికి
అవసరమా అనే ప్రశ్నా ఉదయిస్తుంది!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు, 100 కవితలు రాశాను.
