విశ్వవ్యాప్తంగా విస్తరించి వున్న రామభక్తులందరికీ, రామ విరోధులు, నాస్తికులతో సహా ప్రపంచ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొన్నికోట్ల సంవత్సరాలనుంచీ, ప్రపంచ వ్యాప్తంగా తన అపూర్వమైన వ్యక్తిత్వంతో శ్రీరామచంద్రుడు ప్రజలను ప్రభావితంచేస్తూవున్నాడు. రామాయణం ప్రధానంగా సంస్కృత భాషలో వాల్మీకి విరచితమయినా ప్రపంచంలోని పలుభాషలలో, పలు దేశాలలో రామాయణం విభిన్నమైన రూపాలలో ప్రచారంలో వుంది. హిందీ భాషలో కనీసం 11 రామాయణాలు,మరాఠీలో 8, బెంగాలీలో 25, తమిళంలో 12, తెలుగులో 5, ఒరియాలో 6 రామాయణాలతో సహా, గుజరాతి,మలయాళం, కన్నడ, అస్సామీ,ఉర్దు, అరబిక్,పెర్షియన్, భాషలలోనూ పలు రామాయణాలు ప్రచారంలో వున్నాయి. కాళిదాసు, భాసుడు, భట్టి, ప్రవరసేన, భవభూతి, క్షేమేంద్రుడు, రాజశేఖరుడు, కుమారదాసు, సోమదేవ్, గుణదత్త, గురుగోవింద్ సింఘ్, సమర్థ రామదాసు, తులసీ దాసు, మైథిలీ శరణ్ గుప్త, కేశవ్ దాస్, విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు రామాయణ రచనతో చిరంజీవులయ్యారు.
రామకీర్తి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పలుదేశాలలో విస్తరించింది. టిబెట్ వారికి ఒక రామాయణం వుంది. తుర్కిస్తాన్ వారికి, ఖోటానీ రామాయణ, ఇండోనేషియా వారికి కక్బిన్ రామాయణ, జావా వారికి సేరాత్రం, సైరిరాం, రాంకెలింగ్, పటాని రాం కథా వంటి రామాయణాలు, ఖామెర్ రామాయణ, బర్మా వారికి యుటో రామాయణ, థైలాండ్ వారికి రాంకియేన్ ….ఇలా పలు దేశాలలో పలు విభిన్న రూపాలలో రామాయణం ప్రచలితమవుతూన్నా, మౌలికంగా రామకథ అన్ని దేశాలలో అన్నిప్రాంతాలలో ఒకటే.
ఇలా ప్రపంచవ్యాప్తంగా పూజలందుకుంటూ ప్రజలను కాపాడుతూన్న అందరివాడయిన సీత,లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచందుడికి ప్రణమిల్లుతూ…బలవంతులకు బుద్ధిని, బలహీనులకు శక్తినీ ఇవ్వాలని ప్రార్ధిస్తూ…సంచిక శ్రీరామనవమి ప్రత్యేక పద్యాలనూ,కథలనూ,వ్యాసాలనూ అందిస్తోంది. మీ ఆశీస్సులను, ఆదరణను అభ్యర్ధిస్తోంది.
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

