[గిద్దలూరు సాయి కిషోర్ గారు రచించిన ‘తరాలు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
రాబోయే తరానికి
కాస్త విలువలను నేర్పుదాం
రాబోయే తరానికి
నేస్తాలను కలుసుకోమని చెబుదాం
రాబోయే కాలానికి
నిజం మాటలు చేదుగా
అబద్ధాల మాటలు తీపిగా
వినపిస్తాయి కాబోలు
రేపటి తరానికి కంఠంతో వినిపిద్దాం
రాబోయే తరానికి
పూర్వీకుల పద్దతులు
తెలుపుదాం
రాబోయే తరానికి
న(తె)లుపు అని మానవునికి
నామకరణం చేయకండి
వారి మధ్య విభేదాలు
లేకుండా చూసుకుందాం
రాబోయే తరానికి
అన్నదమ్ముల బంధాన్ని
వివరిద్దాం కాస్త బంధాన్ని
నిలిపేవాళ్ళుగా
తోడుగా నిలుద్దాం
రాబోయే తరానికి
సాంప్రదాయాలు, ఆచారాలను
తెలుపుదాం
తెలుగు వారిగా ఈ భూమిపై
జీవనం కొనసాగిద్దాం
ఇరుగుపొరుగు వాళ్ళతో
పొట్లాటలు ఆపేద్దాం
తెలుగు వారిగా
వారి హృదయంలో
నాటుకుపోదాం
రాబోయే తరానికి
పర్యావరణాన్ని వివరిద్దాం
అందులో వారు భాగస్వాములుగా
స్వాగతం పలుకుదాం.
గిద్దలూరు సాయి కిషోర్ 2004 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జన్మించారు. గిద్దలూరు మురళి, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. గిద్దలూరు నందిని వీరి చెల్లెలు. ఆమె చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్నారు. సాయి కిషోర్ బాల్యం నుంచే సాహిత్య ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. తాత్వికత, సమాజం, ప్రకృతి, కాలం వంటి అంశాలను తన కలం ద్వారా ప్రతిబింబింపచేస్తున్నారు. కవిత్వం, కథలు, తాత్విక ఆలోచనలు వీటన్నిటిలోనూ ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది. వీరి పదాలు సున్నితమైన భావవ్యక్తీకరణతో పాఠకుడిని ఆలోచనలోకి నడిపిస్తాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని ఆధునిక భావాలతో మేళవించడం ఆయన రచనల ముఖ్య లక్ష్యం.
సాయి కిషోర్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఫౌండేషన్లో ప్రచార కార్యదర్శిగా తెలుగు భాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాహిత్యంతో పాటు విజ్ఞానం, విద్య, సాంకేతికత పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. వీరి సృజనలో “ఆశయమే పిడికిలి”, “నాన్నే నాకు ఓ బిరుదు”, “మట్టే మనిషోయ్”, “కాల ప్రవాహం” వంటి రచనలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.
