Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

టెక్నాలజీ బొమ్మా బొరుసు – సైబర్ నేరాలు

మన దేశంలోనూ, అంతర్జాతీయంగానూ జరుగుతున్న సైబర్ నేరాల గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి.

మన దేశంలో-

టెక్నాలజీ వాడకంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొట్టమొదటి సైబర్ పోలీస్‌స్టేషన్ సైబరాబాద్‌లో ఏర్పాటు చేయబడింది. సైబర్ నేరాలు ఇదివరకు సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌లోనే విచారింపబడేవి. ఇటీవల మిగిలిన చోట్ల కూడా విచారణ చేపడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ లాబొరేటరీలు ఏర్పాటు చేసి కానిస్టేబుల్ లెవెల్ నుండి సైబర్ నేరాల తీరు – పరిశోదనలకు సంబంధించి అవగాహన కల్పించి సిబ్బందిని, మొత్తం యంత్రాంగాన్ని సైబర్ నేరాల పరిశోధన దిశగా సంసిద్ధులను చేస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం – ప్రస్తుతం ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలు 5 లక్షల కోట్లకు పై మాటే. 2025 నాటికి ఇవి 15 లక్షల కోట్లకు చేరతాయని అంచనా.

నేషనల్ నేర నమోదు బ్యూరో ప్రకారం – 2018లో కంటే 2019లో ఆర్థిక నేరాలు 1,56,268 నుండి 1,65,782 కు పెరిగాయి. సైబర్ నేరాలు 63% పెరిగాయి. 2018లో సైబర్ నేరాలు 27,248 ఉండగా 2019 నాటికీ 44,546 కు పెరిగాయి. ఇవి నమోదుకు వచ్చినవి. చిన్నా చితకా, లెక్కకు రానివి మరి కొన్ని ఉండే ఉంటాయి. 17,263 కేసులను విచారణకై చేపట్టగా 352 కేసులు కొట్టివేయబడ్డాయి. 298 కేసులులో శిక్ష ఖరారైంది. వెయ్యికి పైగా మిగిలిన కేసులు విచారణ ఇంకా కొనసాగుతోంది.

2019లో సైబర్ నేరాల కారణంగా జరిగిన ఆర్థిక నష్టం 1.25 లక్షల కోట్లు. కొంచెం అటూ ఇటూగా 4,720 కోట్లు సైబర్ దొంగతనానికి గురికాగా 1450 కోట్లు మాత్రమే రికవరీ చేయగలగారు (30%). ఇండియాలో ఒక్క ఏడాదిలో 72% సంస్థలు దాడులకు గురయ్యాయి. గుల్షన్ రాయ్ సారధ్యంలోని అంతర్జాతీయ నివేదిక సైతం స్పష్టం చేసింది.

జాతీయస్థాయిలో సైబర్ నేరాల సమన్వయ కమిటీ ఏర్పాటు, రాష్టాలలో విభాగాలు, మోడీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడినవే. ఈ మొత్తం వ్యవస్థలను జాతీయ సమాచార నిధి, (నాట్ గ్రీన్) తోనూ కదలికలను గుర్తించే వ్యవస్థల తోనూ అనుసందానం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడి జాతీయ భద్రత (N.S) లో సైబర్ భద్రత (S.S) అంతర్భాగం.

చైనా –

2018లో హాంగ్జువాలో కేవలం సైబర్ నేరాలకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ నేరాలన్నీ ఈ కోర్టులలోనే విచారింపబడతాయి. ప్రావిన్స్‌లోని సైబర్ నేరాలన్నీ ఇక్కడికే విచారణకు వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానంలో సాధికారికత ఉన్న సిబ్బందే ఇక్కడ కోర్టుల్లో అధికారులుగా ఉంటారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులను అత్యధిక సంఖ్యలో (లక్షలలో) కలిగి ఉన్న దేశం చైనాయే. అమెరికా వంటి దేశం సైతం చైనా తరువాతి స్థానంలోనే ఉంది. అక్కడ సైబర్ సెక్యూరిటీ సిబ్బంది చైనాలో కంటే చాలా తక్కువ.

మన దేశంలో ఆ సంఖ్య వేలలోనే ఉండటం సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఎంత అధికంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలియచేస్తోంది. పటిష్టమైన కంప్యూటింగ్ వ్యవస్థ, నిపుణులైన సైన్యం మాత్రమే దేశంలోని వ్యవస్థలను, సంస్థలను, దేశ పౌరులను సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించగలవు.

Exit mobile version