[శ్రీ సాహితి రచించిన ‘తీర్పును శాసించే సాక్ష్యాలే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మనసు విరిగి అతుకున్న చోటనే
నిజం చిగురు వేసేటప్పుడు
మనిషి విరిగే చప్పుడు
ఎవరికి వినిపించదు.
ముఖంపై గుర్తుపట్టలేనంత
భయం గీసిన బాధ గీతలు
కాలుతున్న రాత్రి వెలుగులో
కసిగా చదివి కన్నీటితో చెరిపాక
కాలం విశాలంగా
కురిసే సంతోషానికి
మనిషి వటవృక్షంగా మారి
నిజాన్ని, నీడను బోధిస్తాడు.
లోతుగా ఆలోచిస్తే
ఒక్కో నిమిషంలో ఎత్తుగా కనిపించే
విరిగిన వాక్యాలు, చితికిన పదాలు
పగిలిన అర్థాలు, చిట్లిన భావాలు
అన్నీ ఆహ్వానించదగ్గ నేస్తాలే
రేపటి తీర్పును శాసించే సాక్ష్యాలే.
