[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
431.
జలాశయంబుల మునిగి తేలు తరి, అలల
వలయంబులవి తీరంబును జేరు; నయ్య
లల పగిది నీ యాత్మయు నెల్లడల పయనించి
కలయ వలయు జగపు తీరంబుల – మంకుతిమ్మ!
432.
స్వార్థ సుఖంబది యల్పము, క్షణిక మశాశ్వతము
ఆత్మ విస్తారంపు సుఖమే నిత్యసుఖము; సమిష్టి ని
స్వార్థ సుఖం బిచ్చు సుఖమే నిజమైనది; యందర
జతగూడి జీవింపుము – మంకుతిమ్మ!
433.
నగవు లేడ్పులు రెండును హృదయ కవాటంబులే,
నగవు లేడ్పులు లేని కఠిన శిలామూర్తివే నీవు!
నగవు లేడ్పులే ఎడదలోని భావంబుల వ్యక్తీకరించు సులభ
మార్గంబులు – మంకుతిమ్మ!
434.
నగవు లేడ్పులు రెండును రసపాకంబులే,
నగవు పరిమళంబు గుప్పించు విరి; ఎన్నగా లోని
వేగంపు నుద్వేగంబును చిమ్ము వగపు: తోషమును పంచు
నగవు; రెంటినిన్ యనుభవించు – మంకుతిమ్మ!
435.
మనసు చలించు రమణీయమైన దాని గనినంతనే,
దాని, తనదిగ జేసికొన కాతర జెంది చలించి వికారమగు;
ఘనతర భీమబలంబున్నును, సాహసించక, రామప్రవృత్తి గలిగి
వినయ సంపత్తి చరించుట వివేకము మంకుతిమ్మ
436.
నాణ్యమైనదాని కనులు వీక్షింప, వశంబుగాని ఎడద
యున్న ఫలమదేమి? దేహము సుఖించిన యుప్పొంగని
మనసున్న ఫలమదేమి? తనువు, మనసు రెండును
తనివి జెందిన తప్పిదమదేమి? – మంకుతిమ్మ!
437.
పటుతరంబుగ నుండవలె ఇంద్రియ రస సంగ్రహణ శక్తి,
అటులె యుండవలె నింద్రియ నిగ్రహశక్తియు, భోగ విరక్తియు,
కటువైనను, నిగ్రహశక్తి కలిగియుండిన వారలె విరక్తులు
పటు సుకృతి పరులు – మంకుతిమ్మ!
438.
కెంజిగురుటాకుల సొంపు; చిరుగాలి కూగు పసరుటాకుల
వొంపు; కపట మెఱుగని యువత కనుల కాంతి మెఱుపు,
ఇంపు గొలిపెడి పసివాడి పెదవుల జారు ముద్దుమాటల సొంపుల
సంతసించని వారెవరు – మంకుతిమ్మ!
439.
సుడిగాలి యది ఎయ్యదియో నా ఎడద యందు రేగి
వడివడిగ నా ప్రాణంబుల తల్లడించి, వేర్ల నల్లాడించి
కడదాక నా జీవనంబునే యూగిసలాడించు; దీని రభసంబున
కడు ధూళి దూసరమగు – మంకుతిమ్మ!
440.
బాహ్య కిరణ కాంతి నా హృదయాంతరాళమున య
నూహ్యంబుగ నాటి జ్వలించ, నందెగసిన ధూమము కనుల గప్ప
మోహ విభ్రాంతి నా యంతరంగంబును కల్లోలపరచు
అహరహంబు వీడక – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084