[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
781.
తొలి సంజె విత్తిన విత్తనమది పైరుగునే మలిసంజె!
కాల వ్యవధి వలయు మన కృషి ఫలితంబులకు
వలయు తగినంత కాలము; ఆతురత జెంద పక్వమగునె వంట
తాలిమి వలయు పరిపక్వతకు – మంకుతిమ్మ!
782.
అందందాచరించెడి కార్యము లాచరించి, అందినంత తనివి
జెంది, ఫలితం బదేదైన క్రుంగక, యుబ్బక, నిబ్బరముతోడ
బాంధవ్యం బెల్లడ జూపి, పరము పదంబును బొందు, ముందు చర్యన్
పొంది యుండుట సుకృత మరయ – మంకుతిమ్మ!
783.
బుద్ధి మాటొకటున్నది నీకు తెలియ; దేనినేని ఎదురింప
సిద్ధంబుగ నుండుము: దైవంబు వేరొండు తలంచుగాక; కర్మ నీ
హద్దుల లేకుండుగాక, అద్భుతంబు లెన్నో జరుగు దైవికంబుగ
సిద్ధంబుగ నుండుమన్నింటికిన్ – మంకుతిమ్మ!
784.
ఏ నిమిషాన ఏదేని సంభవించగ వచ్చు; సిద్ధంబుగ నుండుము
భాను కిరణంబులు శీతల౦బై చంద్రకిరణయబులు కాల్చగ వచ్చు,
క్షోణి కరగి నీరుగ మారవచ్చు, జగంబు శూన్యంబు కావచ్చు
మౌనంబున సిద్ధంబుగ నుండు – మంకుతిమ్మ!
785.
‘క్రుంగదీ మనః క్లేశ మెన్నటికిని’ యని దిగులు చెందగనేల?
క్రుంగనేల? యయ్యది తాత్కాలికంబె; శాంతించు తనకు దానె; కారు
మేఘములన్ చీల్చుకొని రవి ప్రకాశింపడే! శాశ్వతంబు కాదేది,
బెంగ పడనేల: ఆ దినపు సుఖమే సుఖము – మంకుతిమ్మ!
786.
ముగింపు గలదన్నింటికిన్: విషయేంద్రిములకున్
ముగింపు గలదేని యయ్యది పుణ్యఫలంబె తలంపగాన్,
ముగింపు ఎటులో! నీ నిగ్రహంబుననో! అయ్యవియే విసుగు జెందెనో!
ముగిసిన చాలు, శాంతి దొరకు – మంకుతిమ్మ!
787.
రోగంబులు – తట్టు, అమ్మవారు, శిశువులన్ కుదిపి వెళ్లు
రాగ మనురాగంబులున్ మోహితులైన వారి కుదిపి, కుదిపి, అనా
రోగ్య యాతనలకున్ గురిచేసి, జీవనంబును పక్వంబు జేసి తరలు
వ్యగ్రత తీరిననే సుఖము – మంకుతిమ్మ!
788.
జ్వర పీడితంబైన వేళ తనువు తపించి యాతనబొందు
జ్వరంబుపశమించిన తరి నవనవలాడు నరుడు
కారణ మేదైన నేమి! ఇంద్రియ తాపంబులు చల్లార
మరుజన్మ మది యాత్మకు – మంకుతిమ్మ!
789.
పర్వత సానువుల, పసరంబులకు పచ్చని గడ్డివై,
సౌరభమ్ముల విరజల్లు మల్లెల వోలె ఇంటను, విధి వర్షించు
క్రూరతకు గిరివై, దీన దుర్బలుల పాలిట మధుర తర
శర్కరమవై, ఎల్లరనొకడవై పొందియుండుము – మంకుతిమ్మ!
790.
చిక్కిన యుద్యోగ మదేదైన వదలక చేయుము: నేనేడ? నే
నొక గడ్డిపోచయని యనబోకు, అందరున్ అర్హులే కృషికి; ఈ
లోకపు వ్యవహారంబుల హీనమైన పని యదేదియున్ లేదు;
నీకున్ స్థానమున్నదీ లోకమందున – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
