[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
841.
మన ఎంగిలి మెతుకులే కాల్వ చేరునో! ఆ నీర
మెన్నగ ఏ మట్టి జేరి ఏ పంటను పండించునో!
అన్నమది ఎవరినుండి ఇంకెవరి కడుపు నింపునో!
వర్ణించున దెవరు దానిన్ – మంకుతిమ్మ!
842.
ఎవరి నేలనో గడ్డిమేసి, ఇంకెచటనో నీరు తాగి ఇం
కెవరికో ఆవు తన పాలనిచ్చి, ఆ పాల నింకెవరో త్రాగి, మ
రెవరికో బలము నిచ్చు; త్రాగిన వాడేమిచ్చునో లోకమునకు
భావింపగ నిదెంతటి ఋణమో దెలియ – మంకుతిమ్మ!
843.
జీవాణువులవెన్ని చేరియుండునో మన యూపిరుల! గాలి
వీవ, ధూళికణంబులవెన్ని చైతన్యయుతమై యుండునో!
జీవగతి వ్యవహారంబది రహస్యంబు; తెల్సినవార
లెవరు? నమస్కార మర్పించుటే సరైనది – మంకుతిమ్మ!
844.
ప్రసరింపబోకు నీ యజ్ఞానంపు నీడల నితరులపైన, వారల
నుసరించు మార్గంబుల వారిని నడువ నిమ్ము; ఏ దారులన
నుసరించ, వాటి మేల్గీడులు నీకవగతంబులే! అన
వసర పెద్దరికము వలదు నీకు – మంకుతిమ్మ!
845.
ఇతరుల జీవనపు తీరుపై నీదగు పెత్తనము చెలాయించనేల?
మోత నీయది చాలదే మోయ? ఇతరుల మోత నీకేల?
హితమగు గాదె నందరికి, మొగ్గ సహజంబుగ వికసించినన్,
హితమా! క్షేమమా చెఱసాల జీవనము – మంకుతిమ్మ!
846.
మరణమైన తరి ముందేమి? ప్రేతమో? భూతమో?
పరలోకమో? పునర్జన్మమా? మరేమో తెలియదు
తిరిగి వచ్చిన వారెవరు? వార్త తెచ్చిన వారెవరు?
ధరన్ జననంబు నడపువారికి మరణపు చింతయేల – మంకుతిమ్మ!
847.
తగు ఫలసాయంబున్ పొందడే కృషీవలుడు మేలగు రీతి
సాగు జేసినన్; సంశయమేల? మేలగు రీతి నీ
దగు జీవనంబునన్ నడపిన మేలగు గాదె నీకును; మే
లు ఇహమే పరలోకంబునకు దారి – మంకుతిమ్మ!
848.
స్థిరమా పరబ్రహ్మ హిమాద్రి వోలె, మాయ జాహ్నవి వోలె
చరము; ఘనరూప పరసత్త్వపు ద్రవరూపమీ జగము
పరమార్థమున కొక యక్షి, జగద్వ్యవహారంబుల కొకటి
సారూప్యంబులే రెండునున్ – మంకుతిమ్మ!
849.
స్థిరచిత్తంబునన్ గ్రహింపుము ఈ తత్త్వంబును, అనిర్దిష్ట, అ
నిర్వచ, అగణనీయమీ పరబ్రహ్మ లీల లరయ
నోరు విప్పక, మౌనంబు వహించి వర్తించుచు నుండుము
దారి యది నీ మనము శాంతి బొంద – మంకుతిమ్మ!
850.
నాట్యరంగమీ జగము, ఆ నటరాజుని రూప మరయ
నాట్య రీతులవి జీవనంపు వివిధ దిశలన్ సూచించు తీరులు,
నాట్యమిది విశ్వమాయా లీల, సత్య సత్త్వపు జ్వాల, జగ
న్నాటకంబున నీవొక ఆత్మ స్వరూపంబవు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
