(రాజస్థాన్లో ఓ దళిత బాలుడు ఇంద్రకుమార్, మట్టికుండలో నీళ్ళు తాగుతుండగా, ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు మరణించాడు. ఈ సందర్భంగా నా హృదయ స్పందన – విడదల సాంబశివరావు)
ఈ నడిరేయి నిశ్శబ్దంలో
నిదుర రాని నా కన్నుల ముందు
నీ దీన వదనమే తారట్లాడుతోంది!
దాహార్తితో..
పిడచకట్టుకుపోయిన
నాలుకను తడుపుకోవాలని..
గుక్కెడు నీళ్ళ కోసం
మట్టి కుండ ముందు
దోసిలి పట్టిన నీ రూపమే
నా అంతరంగంలో తిష్ట వేసి
క్షణం క్షణం..
నన్ను కలవరపెడుతోంది!
పక్షులు.. పశువులు
మూతి ముంచి నీళ్ళు తాగినా..
మందలించరు గాక.. మందలించరు!
అదేమి చిత్రమో..
పశుపక్ష్యాదులకంటే
హీనమైపోయిందిరా కన్నా.. నీ జన్మ!
ఆకాశంలో హార్మ్యాలు నిర్మించాలని
శూన్యాన్ని ఛేదిస్తూ
గ్రహాంతర యానం చేస్తోన్న
ఆధునిక మానవజాతి..
నవీన సాంకేతిక యుగంలో కూడా
అంటరానితనాన్ని అంతం చేయలేని
నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది!
జాతీయ అంతర్జాతీయ వేదికలపై
భరతజాతి ఘనకీర్తిని..
కంచు కంఠాల స్వరధ్వనులతో వినిపిస్తున్న
జాతినేతల నోళ్ళు మూగబోయాయి!
జనగణమన అధినాయక జయహే
భారత భాగ్య విధాత..
నీ మృత శరీరం ముందు
సిగ్గుతో మోకరిల్లాడు!
స్వతంత్ర భారత వజ్రోత్సవ పండుగ వేళ..
నీ మరణం..
ఈ దేశానికి శాపమేరా తండ్రీ!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.