Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వందే భారత్ – ట్రైన్ 18 కథ-6

[వందే భారత్ రైలు రూపకర్త సుధాంశు మణి అనుభవాల కథనం ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ ను తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమశంకర్.]

అధ్యాయం 5: మీ కలలను సజీవంగా ఉండనివ్వండి

ఐసీఎఫ్ ఆత్మను అన్వేషించాలనే నా ప్రయత్నం చాలా ఆనందదాయకంగా మారింది. సరైన వ్యక్తులతో కూడిన నా వ్యక్తిగత జాబితా దాదాపుగా సిద్ధమైంది. దీనికి త్రివేది, వావ్రే, శ్రీనివాస్, దాష్, శశి భూషణ్, మనీష్ ప్రధాన్, ఇంకా మరికొందరు నాయకత్వం వహించారు. ఒక ఆధునిక ట్రైన్ సెట్‌ను తయారు చేసే ప్రాజెక్ట్‌ను ఐసీఎఫ్ ప్రోత్సహించాలని, దానికి నాయకత్వం వహించాలనే కోరిక వీరి గుండెల్లో దాగి ఉంది. ఈ అవకాశాల గురించి మేము ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే – ప్రారంభంలో మామూలు మాటల్లో, ఆ తర్వాత కొంత వివరంగా – అంతగా ఒక విషయం స్పష్టమైంది; ఒక పెద్ద రోలింగ్ స్టాక్ ప్రాజెక్ట్‌లో తమ వంతు సహకారం అందించడానికి చాలా మందిలో తీవ్రమైన తపన ఉంది. రోజువారీగా నేను వారిని ప్రోత్సహించడం, ప్రేరేపించడం వల్ల, ఇన్నాళ్లూ వృథా అయిన సంవత్సరాల పట్ల వారిలో ఉన్న నిగూఢ అసంతృప్తి క్రమంగా ఆశగా మారుతోంది.

ఇప్పుడు చర్చలు – ఒకరితో ఒకరు గాల్లో మేడలు కట్టుకునేలా కాకుండా, అందరిని కలుపుకుని కలిసి ఉమ్మడిగా సాగాయి. ఏమేమి అవసరమవుతాయి, అందులో మనం వేటిని సాధించగలము అనే దానిపై ఒక ప్రాథమిక రూపురేఖలను సిద్ధం చేయడానికి నేను వావ్రే, శ్రీనివాస్‌లతో తరచుగా, అలాగే మరికొందరితో అప్పుడప్పుడు కూర్చుని చర్చించేవాడిని. నన్ను ఇబ్బంది పెట్టిన రెండు అంశాలు ఏంటంటే – బోగీ (చక్రాలు, సస్పెన్షన్ కలిగి ఉండి, కోచ్‌ని మోసే సబ్-అసెంబ్లీ), బోగీ బాహ్య రూపురేఖలు (ఎక్స్‌టీరియర్స్). మన బోగీల బాహ్య రూపురేఖలను ఖచ్చితంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఎల్‌హెచ్‌బీ కోచ్ బాడీపై మేము చేసిన నిరంతర ప్రయోగాలు కొన్ని ఫలితాలను ఇచ్చినప్పటికీ, అవి కేవలం స్వల్ప పురోగతిని మాత్రమే చూపించాయి కానీ ప్రపంచ స్థాయి రైలు వైపు ఒక పెద్ద ముందడుగుగా మారలేదు. బోగీ విషయానికి వస్తే, మనం ఒక కొత్త డిజైన్‌ను ప్రయత్నించవచ్చని శ్రీనివాస్ భావించాడు, కానీ ఐసీఎఫ్ కానీ లేదా దేశంలోని మరే ఇతర సంస్థ కానీ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని నాకు స్పష్టంగా తెలుసు.

గంటకి 160 కి.మీ. వేగంతో ప్రయాణించే సరికొత్త హై-స్పీడ్ డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ కోసం 3-ఫేస్ ఎలక్ట్రిక్స్ టెండర్లలో ఒకదానిలో, 180 కి.మీ/గంట వేగంతో పరీక్షించడానికి మరియు 160 కి.మీ/గంట వేగంతో నడపడానికి అనువైన కొత్త బోగీ డిజైన్, సంబంధిత డ్రాయింగ్‌లు, ఇంకా స్పెసిఫికేషన్ల సరఫరా కోసం కోట్ చేయమని మేము బిడ్డర్లను కోరాము. ఎలక్ట్రిక్స్ అండ్ కంట్రోల్స్ రంగంలో కొత్తగా ఎదుగుతున్న ఒక స్వదేశీ తయారీదారు నుండి మాకు ఒక కొటేషన్ వచ్చింది, అందులో వారు తమ యూరోపియన్ భాగస్వామితో కలిసి సరికొత్తగా ఒక బోగీని డిజైన్ చేయడానికి కోట్ చేశారు. అయితే, రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ఈ టెండర్ నిలిచిపోయింది; ఈ కాంట్రాక్ట్ మనకు ఒక విప్లవాత్మకమైన (గేమ్-ఛేంజర్) రోలింగ్ స్టాక్‌ను రూపొందించడంలో సహాయపడుతుందని నేను సి.ఆర్.బి (CRB) కి పదేపదే అభ్యర్థించినప్పటికీ, ఆయన దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అస్సలు అంగీకరించలేదు. ఇది ఎలక్ట్రికల్ రోలింగ్ స్టాక్ కోసం ఉపయోగించే బోగీ అయితే తాను పరిశీలిస్తానని, కానీ డీజిల్ రోలింగ్ స్టాక్ తయారీని భారీగా తగ్గించేస్తున్న తరుణంలో, ఇది వృథా ప్రాజెక్ట్ అవుతుందని ఆయన అన్నారు. మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చేదు నిజానిని అంగీకరించి, ఆ టెండర్‌ను రద్దు చేసాము, కానీ ఈ రకమైన కొనుగోలు పద్ధతి (ప్రొక్యూర్మెంట్ మోడల్) ఆశాజనకంగా ఉందని అందరూ అంగీకరించారు.

ఈ ప్రాథమిక చర్చల ఆధారంగా, శ్రీనివాస్, వావ్రే కలిసి త్రివేది అందించిన కొన్ని మార్గదర్శకాలతో ఒక విధమైన బ్లూప్రింట్ సిద్ధం చేశారు. మేము దానిని రైల్వే బోర్డుకు సమర్పించాలని ఆలోచిస్తున్న తరుణంలో, మాకు ఒక అవకాశం లభించింది. అది పాత నిస్తేజ వాతావరణాన్ని పోగొట్టి సరికొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశంగా ఖచ్చితంగా కనిపించింది.

2016 నవంబర్‌లో, కొత్త ఆలోచనల మేధోమథనం కోసం ఢిల్లీలో మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘రైల్ శివిర్’ పేరుతో ఒక భారీ సదస్సు నిర్వహించబడింది; దీని కోసం ఒక ప్రముఖ కన్సల్టింగ్ సంస్థను రంగంలోకి దించారు. ఆలోచనలను సమర్పించడానికి ఒక వికారమైన అధికారిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, అది ఒక మంచి ఆరంభంలానే అనిపించింది. ఊహించినట్లుగానే, త్వరలోనే సంఖ్యల ఆట మొదలైంది. సాధ్యమైనన్ని ఎక్కువ ఆలోచనలను ప్రతిపాదించాల్సిందిగా అన్ని విభాగాలను ఒత్తిడి చేస్తూ, బ్రతిమిలాడటం ప్రారంభించారు; సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్న భారతీయ రైల్వేల లోని అన్ని స్థాయిల అధికారుల నుండి ఈ ఆలోచనలు రావాల్సి ఉంది. ఇది రైల్వే ఉద్యోగులు తప్పనిసరిగా ఆలోచనలు చేయాలనే ఒక ఆజ్ఞలా అనిపించడం ప్రారంభించింది. ఆలోచనలను సమర్పించే ఒక పరుగు పందెం మొదలైంది, ఎవరి స్కోరు ఎంత అనే లెక్కలు కూడా కట్టసాగారు. మేము కూడా అనేక ఆలోచనలను జాబితా చేసాము, అందులో ఒకటి స్వదేశీ సాంకేతికతతో కూడిన సెమీ హై-స్పీడ్ ఆధునిక ట్రైన్ సెట్‌ను నిర్మించడం. అఖిల భారత స్థాయి సేకరించిన ఈ ఆలోచనలు బహుళ వడపోత ప్రక్రియల గుండా వెళ్ళాయి, ఆలోచనల ప్రాధాన్యత జాబితా రూపొందించబడింది.

నేను, నా 15 మంది బృందంతో కలిసి మూడు రోజుల పాటు జరిగే ఆ క్యాంపునకు చేరుకున్నప్పుడు, ఈ మొత్తం ప్రక్రియ అంతా ఒక ప్రహసనం అని మాకు అర్థమైంది. రైల్వే ఉద్యోగులందరూ కలిసి, ఆత్మపరిశీలన చేసుకుని, కొత్త ఆలోచనలను వెలికితీయాలని మోదీజీ ఎక్కడో చేసిన ఒక సాధారణ వ్యాఖ్య నుండి ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ భారతీయ రైల్వేల పనితీరుకు తగ్గట్టుగానే, అక్కడ జరుగుతున్నదంతా ఒక పెద్ద హడావిడిలా ఉంది. 5,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులను ఒక రిసార్ట్‌లో చేర్చి, రోజువారీ రొటీన్ జీవితానికి దూరంగా, ఒక విహారయాత్ర తరహా వాతావరణంలో అందరూ సంతోషంగా సందడి చేస్తున్నారు. ఇది మీడియాలో గొప్పగా ప్రచారమౌతోంది, కానీ అందరికీ కనిపిస్తున్న ఆ లోపలి అసలైన నటన (కపటత్వం) స్పష్టంగా తెలిసిపోతోంది.

త్వరలోనే పరిస్థితి మరింత ఘోరంగా మారింది. కన్సల్టెంట్లు ఎనిమిది ఆలోచనలను అత్యుత్తమమైనవిగా ఎంపిక చేశారు, మోదీజీ హాజరయ్యే సెషన్ కోసం ఆడంబరమైన ప్రెజెంటేషన్లను సిద్ధంగా ఉంచారు. నన్ను కూడా పదహారు మంది ప్రెజెంటర్లలో ఒకరిగా ఎంపిక చేశారు, ఒక్కో పీపీటీ ప్రెజెంటేషన్‌కు ఇద్దరు చొప్పున మాట్లాడాలి. ఈ బలిపశువులను ఎలా ఎంపిక చేశారు? దేవుడికే తెలియాలి! నేను బాగా మాట్లాడగలనని సిఆర్‌బి (CRB) భావించడం వల్లే నేను అక్కడ ఉన్నానని అనుకుంటున్నాను. ఆ రోజు అర్థరాత్రి మేమంతా కొంతమంది మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో, నన్ను ఒక చిన్న హాలుకు పిలిచారు, అక్కడ ఎంపిక చేయబడిన కొద్దిమంది ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలో ప్రాక్టీస్ చేయడానికి సిఆర్‌బితో కలిసి సమావేశమయ్యారు. నా వంతు వచ్చినప్పుడు, నేను ఒక కవితా పంక్తిని (షాయరీని) జోడించి నా శైలికి తగినట్లుగా కంటెంట్‌ను మార్చడానికి ప్రయత్నించాను. వెంటనే సిఆర్‌బి నన్ను గద్దిస్తూ, “మీ గజల్స్, ఖవ్వాలీలను మీ క్లబ్‌లకే పరిమితం చేయండి, ఇది చాలా గంభీరమైన విషయం” అని మందలించారు. దాంతో నేను అక్కడే కుంచించుకుపోయి, నా ఆలోచనలకు ఎంతమాత్రం సంబంధం లేని ఇతరుల మాటలను చిలుక పలుకుల్లా పలుకుతూ, నమ్మశక్యంగా మాట్లాడాల్సి వచ్చింది. కృతజ్ఞతగా, కవి ‘వహ్షత్ కల్కత్వి’కి నాపై కొంత సానుభూతి ఉన్నట్లు అనిపించింది:

ఆప్ అప్నా రూ-ఎ-జేబా దేఖియే
యా ముఝే మహ్వ్-ఎ-తమాషా దేఖియే
హాయే రే జౌఖ్ – ఎ – తమాషా -ఎ- జమాల్
ఖుద్ తమాషా హూఁ తమాషా దేఖియే

(మీ అందమైన ముఖాన్ని చూసుకోండి లేదా ప్రదర్శనను చూడటంలో మునిగిపోయిన నన్ను చూడండి. ఆహా, ఈ సౌందర్య ప్రదర్శనపై ఉన్న ఆసక్తి! నేనే ఒక ప్రదర్శనగా మారాను, నా ప్రదర్శనను చూడండి.)

కానీ వీరిలో చాలా మంది పిల్లలాట లాంటి పనిని ఎంతగానో తీవ్రంగా పరిగణించారు. మోదీజీ తమ జీవితాలను ఏదో ఉద్ధరించబోతున్నారన్నట్లుగా తెగ ప్రాక్టీస్ చేశారు. మరికొందరు, ముఖ్యంగా ఈ ప్రహసనంలో భాగం కాని జనరల్ మేనేజర్లు, తాము అవమానించబడ్డామని, నిరుత్సాహానికి గురయ్యామని భావించారు.

మరుసటి రోజు మోదీజీ మా మధ్యకు వచ్చారు. ప్రధాన హాలులో 5,000 మందికి పైగా కూర్చున్నారు. అనుకున్నవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోయాయి. ఇది భారతదేశమంతటా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, ఆ తర్వాత ప్రధాన స్రవంతి మీడియాకు కూడా విడుదల చేయబడింది. నేను, నా తోటి ప్రెజెంటర్ – ఆర్‌డీఎస్‌ఓకి చెందిన ఒక సీనియర్ అధికారి – కలిసి ఆ కృత్రిమమైన ప్రెజెంటేషన్ కంటెంట్‌ను ఏదో ఒక పోటీలో ఉపన్యాసం ఇస్తున్నట్లు చిలుక పలుకుల్లా చదివేశాము. నాకు దీనికి మంచి సమీక్షలు, ఇంకా అభినందన సందేశాలు కూడా వచ్చాయి. నా ఆందోళనను ఒక్కసారి ఊహించుకోండి. స్టేజ్ మీద నేను చేసిన ఆ నాటకం నా జీవితంలోనే అత్యంత అవమానకరమైన క్షణం. ఈ అల్పమైన ప్రహసనం నుండి నా ఉనికిని మరియు నా ప్రదర్శనను తుడిచిపెట్టడానికి, నా రాజ్యంలో సగభాగం ఇచ్చేయడానికైనా నేను సిద్ధపడేవాడిని.

ఈ కపటత్వాన్ని వదిలేయ్, జరిగిపోయిన దానికి ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. ఎందుకంటే ఇది నీ చేతులారా నువ్వు చేసుకున్నదే కానీ, ఎవరో నీ నెత్తిన రుద్దింది కాదు! కవి ఇఫ్తికార్ షాహీన్ మాటల్లో నిన్ను నువ్వు ఇలా ఆవిష్కరించుకో: “ఇష్క్ కీ ఖుద్-సుపర్దగీ దేఖీ, ఖుద్ తమాషా బనా తమాషాయ్” (ప్రేమ యొక్క ఆత్మసమర్పణను చూశాను, ప్రేక్షకుడే స్వయంగా ఒక ప్రదర్శనగా మారిపోయాడు). షేక్‌స్పియర్ నాటకాలలో, విదూషకులు తరచుగా చాలా వివేకవంతులుగా ఉంటారు, వారు ప్రధాన పాత్రలే అసలైన, సంపూర్ణమైన మూర్ఖులని నిరూపించడంలో సహాయపడతారు. దేవుడా, ‘ట్వెల్త్ నైట్’ నాటకంలోని విదూషకుడు, “జ్ఞానం ఉన్నవారికి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించుగాక. మరి మూర్ఖులుగా ఉన్నవారిని, తమ ప్రతిభను ఉపయోగించుకోనివ్వండి” అని అన్నట్లు.. నాకూ ఆ విదూషకుడి పాత్రను పోషించే భాగ్యాన్ని ప్రసాదించు.

ఏదేమైనా, ఒక ఆధునిక ట్రైన్ సెట్ గురించి మేము సిద్ధం చేసిన ప్రెజెంటేషన్ ఏమైంది? అది ప్రాధాన్యత లేని ఏదో ఒక చిన్న హాలుకు, తక్కువ స్థాయి అధికారుల సమావేశానికి పరిమితం చేయబడింది. ఈ చిన్న ఉద్యోగుల సముదాయంలో దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మాకు తెలుసు కాబట్టి, మేము దానిని ఒక మొక్కుబడి కార్యక్రమంలా ముగించాము. ఫలితం ఆశించినట్లే శూన్యం. ఈ మొత్తం హడావిడిలో మరే ఇతర అంశం కూడా పెద్దగా సాధించింది ఏమీ లేదు.

మేము మళ్లీ పుంజుకోవాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లోనే మేము ఒక ప్రాథమిక ప్రతిపాదనను సిద్ధం చేసి బోర్డుకు పంపాము. మేము ముందస్తుగా కొన్ని ఖర్చులను అంచనా వేసి, ఒక్కో ట్రైన్ సెట్ ధరను సుమారు రూ. 100 కోట్లుగా నిర్ణయించాము. ఊహించినట్లుగానే, బోర్డులోని కింది స్థాయి అధికారుల నుండి దీనికి బద్ధకం, ఉదాసీనత ఎదురయ్యాయి. కానీ బోర్డులో మాలో కొందరికి ఉన్న మంచి సంబంధాలను ఉపయోగించి, ఈ విషయానికి సంబంధించిన ఫైల్ కదిలేలా చేయగలిగాము. ఎందుకంటే రైల్వే బోర్డులో ఒక ఫైల్ కదలడమే అన్నింటికీ కీలకం; మీ దగ్గర ఒక ఫైల్ లేకపోతే, అక్కడ ఏదీ కదలదు. కేవలం ఫైల్ కదలడం అనేది ఏదో సాధించేసిన మైలురాయి ఏమీ కాదు, అది చాలా కష్టతరమైన మెట్ల వరుసలో ఒక చిన్న మొదటి అడుగు మాత్రమే. అంతకంటే ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే, నిరంతర చలనంలో, సందిగ్ధంలో, సంక్షోభంలో లేదా ఒకే స్థితిలో పడివుండే మిలియన్ల కొద్దీ బోర్డు ఫైళ్లను అడగాలి.

2016 చివరిలోనూ, 2017 ప్రారంభంలో కొన్ని నెలల పాటు, బోర్డు ఫైళ్లలో అస్పష్టత, సందిగ్ధత రాజ్యమేలాయి. అయినప్పటికీ, నేను ఈ విషయాన్ని కేవలం త్రివేది, ఇంకా ఇద్దరు సిడిఈ లతో మాత్రమే చర్చించాను. మనకు ఒక అధికారిక అనుమతి, ఒక అధికారిక ముందడుగు అవసరమని బృందంలోని సభ్యులందరికీ తెలుసు; కానీ నేను ఈ దశలో మిగిలిన వందలాది మందిని ఇందులో భాగం చేయలేదు, ఎందుకంటే దీనిని నేను పరిష్కరించుకోగలననే నమ్మకం నాకు ఉంది. కలలు కనేవారి ఉత్సాహాన్ని దెబ్బతీసేలా నిరుత్సాహాన్ని, ఆటంకాలను కలిగించడం కంటే.. ఐసీఎఫ్‌లో మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

“ఒక ఒంటరి కొవ్వొత్తి కేవలం ఒక గదిని మాత్రమే వెలిగించగలదు, కానీ అవే వేలాదిగా ఉంటే ఒక నగరాన్ని సైతం వెలిగించగలవు.” (మత్షోనా ధిల్వాయో). నాకు ఆ కలలు కనేవారందరూ కావాలి. ఆ కలలు కనేవారందరూ తమ కలలను కంటూనే ఉండటం నాకు అవసరం.

నా వృత్తి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన నా పూర్వపు బాస్ ఒకరు నాకు నేర్పిన రెండు వలయాల గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. మనందరికీ ‘బాధ్యతల పరిధి’ (Circle of Concerns) అనే ఒక పెద్ద పరిధి ఉంటుంది. అలా ఉండటం సహజమే, ఎందుకంటే మన పని ప్రాంతంలో, మన పర్యావరణ వ్యవస్థలో, ఇంకా మన పరిసరాలలో ఎల్లప్పుడూ చాలా పనులు పూర్తి కాకుండానే ఉండిపోతాయి. రోజువారీ జీవితంలో – ఇది పని చేయలేదు, అది చాలా అధ్వాన్నంగా ఉంది, వ్యవస్థ మొత్తం పాడైపోయింది అంటూ మనం విసుగు చెందుతుంటాము. “నేనే గనుక ఆ స్థానంలో ఉంటే, ఇలా చేసి దాన్ని సరిదిద్దేవాడిని,” అని మనకు మనం అనుకోవడం చాలాసార్లు వింటూనే ఉంటాం. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం తప్పులను గుర్తించి, మన అసంతృప్తిని తెలియజేయాలి కాబట్టి అది చాలా సమంజసమే. కానీ, ఈ బాధ్యతల గురించిన ఆలోచనల్లో పడి.. మనం నేరుగా సహకారం అందించగల లేదా కనీసం ప్రయత్నించగల మన ‘ప్రభావ వలయాన్ని’ (Circle of Influence) మర్చిపోతాము. మన స్వీయ అధికార పరిధిలో, హక్కులలో, విశేష అధికారాలలో మనం తగినంతగా పని చేస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మానేస్తాము. చిన్నదైనా, పెద్దదైనా మనందరికీ ఈ ప్రభావ వలయం ఉంటుంది.

కన్ఫ్యూషియస్ చెప్పినట్లుగా భావించే ఒక పాత సామెత ఉంది, లేదా అది ఒక పురాతన చైనీస్ సామెత కావచ్చు: “చీకటిని తిట్టుకునే కంటే ఒక కొవ్వొత్తిని వెలిగించడం ఎంతో మేలు”. చీకటిని చూసి అసహ్యించుకునే వేలాదిమందిని మనం కలుస్తాం కానీ, తమ వంతుగా ఒక చిన్న దివిటీని వెలిగించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు కదూ!

కవి అహ్మద్ ఫరాజ్ దీనిని చాలా అందంగా వ్యక్తపరిచారు:

శిక్వా-ఎ-జుల్మత్-ఎ-షబ్ సే తో కహీఁ బెహ్తర్ థా
అప్నే హిస్సే కీ కోయీ శమా జలాతే జాతే
ఇస్ కీ వో జానే ఉసే పాస్-ఎ-వఫా థా కీ నా థా
తుమ్ ఫరజ్ అప్నీ తరఫ్ సే తో నిభాతే జాతే

(రాత్రి చీకటిని చూసి ఫిర్యాదు చేయడం కంటే, నీ వంతుగా ఒక దీపాన్ని వెలిగించి వెళ్లడం చాలా ఉత్తమం. ఎదుటివారికి ప్రేమపై గౌరవం ఉందో లేదో వారికే వదిలేయ్, ఫరాజ్! నువ్వు మాత్రం నీ వంతు నిబద్ధతను నిలబెట్టుకుంటూ సాగిపో.)

నేను ఎల్లప్పుడూ సాధ్యమైనంతవరకు ఈ సూత్రాన్ని అనుసరించడానికే ప్రయత్నించాను. నా కల అనే పెద్ద కొవ్వొత్తిని వెలిగించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది.

కలల గురించి మాట్లాడేటప్పుడు, సమాజంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కొన్ని పాత నమ్మకాలు ఉన్నాయి. అవి యువతకు ఏమి చెబుతాయంటే – నువ్వు నీ కల కోసమే జీవించాలి లేదా నువ్వు నీ కలను మాత్రమే వెంబడించాలి అని అంటుంటాయి. కానీ, ఈ క్రూరమైన, విశాలమైన ప్రపంచంలో దారి తప్పిపోవడానికి ఇది ఒక మార్గం కాదా? నేను నా జీవితంలో ఆచరించినది ఏమిటంటే, మనిషి మొదట తనను తాను చూసుకోవాలి, దాని కోసం ఎన్నో రాజీలు పడవలసి వచ్చినప్పటికీ పర్వాలేదు; కానీ తన కలలోని ఆ నిప్పు కణికను మాత్రం ఎన్నటికీ ఆరిపోనివ్వకూడదు. అవకాశం ఎప్పుడు మీ ముందుకు వచ్చి నిలుస్తుందో ఎవరికీ తెలియదు, అది వచ్చినప్పుడే దానిని రెండు చేతులా పట్టుకోవాలి. ఇన్నేళ్లుగా నా కల నాలో సజీవంగానే ఉంది, ఇప్పుడు ఆ అవకాశం నిజంగానే నా కళ్ల ముందు నిలిచింది.

భారతదేశంలో మనం ఎప్పటికైనా ఒక ప్రపంచ స్థాయి రైలును తయారు చేయాలనే కల నాకు ఉండేది. భారతదేశం ఇంతవరకు ఎప్పుడూ చూడని ఒక వేగవంతమైన, సొగసైన, ఆధునికమైన ట్రైన్ సెట్ రూపకల్పన, తయారీకి సంబంధించిన స్పష్టమైన దార్శనికత కూడా నా కలకు ఉందని నేను ధైర్యంగా చెప్పగలను. ఈ దార్శనికతను ఆచరణలోకి మార్చడానికి నేను అత్యంత అనుకూలమైన వేదికపై ఉన్నాను. ఉత్సాహవంతులు, సమర్థులు అయిన ఒక అద్భుతమైన బృందం నాకు లభించడం నా గొప్ప అదృష్టం. ఇలాంటి జీవితకాల అవకాశం చేతికి వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలి, ఇది ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ సాధ్యం కాదు.

కానీ అనుమానాలు కూడా ఉన్నాయి. ఐసీఎఫ్ లోని వివేకవంతులు, సమర్థులైన సభ్యుల మధ్య సంశయాలు ఉండటం సహజమే. బెర్ట్రాండ్ రస్సెల్ అన్నట్లు: “ఈ ప్రపంచంలోని అసలు సమస్య ఏమిటంటే -మూర్ఖులు, ఉన్మత్తులు ఎల్లప్పుడూ తమపై తాము పూర్తి నమ్మకంతో ఉంటారు, కానీ వివేకవంతులు మాత్రం ఎప్పుడూ అనుమానాలతో నిండి ఉంటారు.”. ఇప్పుడు వారిలో ఉన్న ఆ సంశయాలను నివృత్తి చేయడమే నా బాధ్యత.

(ఇంకా ఉంది)

Exit mobile version