Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘వసంత లోగిలి’ – కొత్త ధారావాహిక – ప్రకటన

శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.

***

జీవితంలో అన్నిటికంటే భయంకరం ‘ఒంటరితనం’. పూర్వం ఈ ఒంటరితనాన్ని జయించడానికి ఓ పెద్ద కుటుంబం ఉండేది. ఇప్పుడు కుటుంబం అంటే నలుగురే నలుగురు. పిల్లలు వాళ్ళ జీవితాల్లో బిజీగా అయిపోతారు. పెద్దవాళ్ళని ప్రతిరోజూ పలకరించే తీరిక, ఓపిక రెండూ లేకుండా పోయాయి నేటి తరానికి. పైగా ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఈ రోజుల్లో ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఇకపోతే మనవళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుల సరస్వతికి అంకితమైపోతున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా చదువు, ర్యాంక్లు, జీతాలు తప్ప వేరే ప్రపంచమే లేదు. దీంతో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలతో పిల్లలకి ఓ జ్ఞాపకం గాని, ఓ అనుభూతి గాని లేదు. వాళ్ళతో ఆడుకునే అవకాశం గాని, అవసరం గానీ లేనే లేవు. దీంతో చాలావరకు పెద్దవాళ్ళు నిస్సారంగా, నిస్సత్తువతో గడుపుతున్నారు. చావు వస్తే బాగుండు అని మృత్యు దేవత రాక కోసం ఎదురు చూస్తున్నారు. వయసు మీద పడ్డం వాళ్ళ తప్పు కాదు. వార్ధక్యం అందర్నీ పలకరిస్తుంది. అది కూడా జీవితంలో తప్పని ‘మజిలీ’. ఈ మజిలీని భారంగా ఘోరంగా ఎంతోమంది గడుపుతున్నారు నేడు. ఎందుకంటే మెల్లిగా ‘అనవసరమైన వస్తువులా’ వాళ్ళని కుటుంబానికి దూరం చేస్తున్నాం మనం.

ఇకపోతే మనవళ్ళు – తాతయ్యా, అమ్మమ్మల మద్య ముద్దుగా మురిపెంగా పెరిగే అవకాశమే లేదు ఎందుకంటే వాళ్లకి, మనవళ్ళకి మద్య దూరం కూడా పెరుగుతూ వస్తోంది. ఇలా అమ్మమ్మ, నానమ్మ తాతయ్యల ‘బంధాల గొలుసు’ తెంచేస్తున్నాం. పెద్దవాళ్ళ ‘అనుభవ సారం’ మనవళ్ళకి చేరటం లేదు. పెద్దవాళ్ళ అనుభవాలు సమాజానికి ఒక ‘వనరు’గా గుర్తించటం లేదు సరి కదా, వాళ్ళ అనుభవాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. వెలకట్టలేని అనుభవసారాన్ని వదిలేస్తే మనం రేపటి తరానికి అన్యాయం చేసినవాళ్ళం అవుతాం. దానివల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుంది. రాబోయే తరంలో ‘అనుభవలోపం లేదా అనుభవ లేమి’ జరిగి చికిత్స చేయలేని రోగంతో ఓ తరం కొట్టుమిట్టాడుతుంది. అలాంటి ఓ తరాన్ని రక్షించే ప్రయత్నమే ఈ ‘వసంత లోగిలి’.

***

వచ్చే వారం నుంచే

సంచికలో

చదవండి.. చదివించండి..

‘వసంత లోగిలి’

Exit mobile version